డీకే అరుణను ఎమ్మెల్యేగా ప్రకటించిన తెలంగాణ హైకోర్టు

తెలంగాణలో మరో ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడింది. గద్వాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి తెలంగాణ హైకోర్టు గురువారం అనర్హత వేటు వేసింది. తప్పుడు అఫిడవిట్ సమర్పించారని రుజువవ్వడంతో ఈ నిర్ణయం తీసుకుంది. కృష్ణమోహన్ రెడ్డి ఎన్నిక చెల్లదని తీర్పు ఇచ్చింది.
 
తప్పుడు అఫిడవిట్ ఇచ్చారని వేటు వేసింది. రూ.3 లక్షల జరిమానా కూడా విధించింది. ఆ మూడు లక్షల్లో 50 వేల రూపాయలను డీకే అరుణకు ఇవ్వాలంటూ ఆదేశించింది. 2018 ఎన్నికల్లో కృష్ణమోహన్ రెడ్డి తర్వాతి స్థానంలో ఉన్న బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలు  డీకే అరుణను ఎమ్మెల్యేగా గుర్తించాలని ప్రకటించింది. కృష్ణమోహన్ రెడ్డి సమర్పించిన అఫిడవిట్ తప్పుల తడకగా ఉందంటూ రెండవ స్థానంలో ఉన్న ఆమె హైకోర్టులో సవాలు చేశారు.
 
ఇదిలావుండగా,  ఇప్పటికే పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఎన్నికలు చెల్లవని ఆరోపిస్తూ తెలంగాణ హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. మంత్రి శ్రీనివాస్ గౌడ్‌ కూడా అఫిడవిట్ ట్యాంపరింగ్ చేశారంటూ పిటిషన్ దాఖలు కాగా  ఆ వ్యవహారంలో నాటకీయ పరిస్థితులు నెలకొన్నాయి. 
 
అంతకుముందు, కొత్తగూడెం బీఆర్ఎస్ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావుపై తెలంగా ణ హై కోర్టు అనర్హత వేటు విధించిన విషయం తెలిసిందే. అఫిడవిట్‌లో తప్పులు ఉండడమే ఇందుకు కారణమని కోర్ట్ పేర్కొంది. రెండవ స్థానంలో ఉన్న జలగం వెంకట్రావ్‌ను ఎమ్మెల్యేగా గుర్తించాలని ప్రకటించింది. అయితే వనమా వెంకటేశ్వరరావు సుప్రీంకోర్టును ఆశ్రయించగా హైకోర్టుపై స్టే విధించింది.