మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన పట్నం మహేందర్‌రెడ్డి

కేబినెట్ మంత్రిగా ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. గురువారం రాజ్ భవన్లో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌ మహేందర్‌రెడ్డి చేత మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి‌ కేసీఆర్‌తోపాటు శాసనమండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి, అసెంబ్లీ స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌ రెడ్డితో పాటు పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, నాయకులు హాజరయ్యారు.
 
ఈటల రాజేందర్ బర్త్‌రఫ్ తర్వాత దాదాపు రెండేళ్లపాటు సీఎం కేసీఆర్ ఆ మంత్రి పదవిని ఖాళీగా ఉంచారు. అయితే మరో మూడు నెలల్లో ఎన్నికల జరగనున్న నేపథ్యంలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో కీలక నేత పట్నం మహేందర్ రెడ్డి గతంలో మంత్రిగా చేశారు. తర్వాత జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆయన గెలిచారు. 
 
తర్వాత మంత్రి పదవి వస్తుందని అంతా భావించినా సీఎం కేసీఆర్ మంత్రి పదవి ఇవ్వలేదు. దీనిపై మహేందర్ రెడ్డి గతంలో రకరకాల కామెంట్లు చేశారు. కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు లీకులు కూడా ఇచ్చారు. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ అభ్యర్థులను ప్రకటన చేయడం, మహేందర్ రెడ్డికి మంత్రి పదవి ఇచ్చేందుకు నిర్ణయం తీసుకోవడం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో మహేందర్ రెడ్డికి మంచి పట్టుంది.