హైదరాబాద్‌లో ఒక్కసారిగా ఈదురుగాలులతో కూడిన భారీవర్షం

 
 హైదరాబాద్‌లో ఒక్కసారిగా మంగళవారం సాయంత్రం వాతావరణం మారిపోయింది. ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది. భారీగా ఈదురు గాలులు వీస్తున్నాయి. మధ్యాహ్నం వరకు ఎండ వేడి, ఉక్కపోతతో ఇబ్బందిపడ్డ నగరవాసులు ఒక్కసారిగా కురిసిన వర్షంతో  తడిసిముద్దయ్యారు. కూకట్‌పల్లి, కేపీహెచ్బి, మూసాపేట్ పరిసర ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. బాలానగర్, ఫతేనగర్, సనత్ నగర్‌లోనూ వర్షం పడుతోంది. 
 
జీడిమెట్ల, చింతల్, షాపూర్, కుత్బుల్లాపూర్, మియాపూర్, చందానగర్, గచ్చిబౌలి, మాదాపూర్‌లో ఈదురుగాలతో కూడిన వర్షం కురుస్తోంది. జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ ప్రాంతాల్లో పెనుగాలులు వీస్తున్నాయి. అదే సమయంలో భారీ వర్షం కురుస్తోంది. ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కారణంగా చెట్లు, హోర్డింగ్స్‌ నేలకూలుతున్నాయి. కోఠి, అబిడ్స్, గోషామహల్, ఎంజే మార్కెట్‌ తదితర ప్రాంతాల్లో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురుస్తోంది.

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఈదురు గాలులతో ఒక్కసారిగా వాతావరణం మారిపోవడంతో  మంథనిలో రాజస్థాన్ ముఖ్యమంత్రి భజన్ లాల్ శర్మ పాల్గొనే బహిరంగసభ  కొద్ది సేపట్లో జరుగుతోందని భావిస్తున్న తరుణంలో భారీ ఈదురుగాలులతో టెంట్లు మొత్తం కూలిపోయాయి. అలానే కరీంనగర్ ఎస్‌ఆర్‌ఆర్‌ డిగ్రీ కళాశాల మైదానంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో జరుగవలసిన భారీ బహిరంగ సహితం భారీ ఈదురు గాలులు వీచి టెంట్లు నేలవాలాయి. కుర్చీలు చెల్లాచెదురయ్యాయి.

తెలంగాణవ్యాప్తంగా పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిశాయి. ఉత్తర తెలంగాణ జిల్లాలతో పాటు పలుచోట్ల ఉరుములు, మెరుపులు, ఈదుగాలులతో మోస్తరు వర్షాపాతం నమోదైంది. ఉమ్మడి కరీంనగర్‌ జిల్లావ్యాప్తంగా ఈదురుగాలులతో వర్షాలు కురిశాయి. కరీంనగర్‌ జిల్లా కేంద్రంతో పాటు మానకొండూరు, హుజూరాబాద్‌లో వాన పడింది. పెద్దపల్లితో పాటు రాజన్న సిరిసిల్ల జిల్లాకేంద్రంతో పాటు బోయినపల్లి, వేములవాడలో ఈదురుగాలులు, మెరుపులతో మోస్తరు వర్షాపాతం నమోదైంది.

జగిత్యాల జిల్లా మల్యాల, పెగడపల్లి ఈదురుగాలులతో పలుచోట్ల వాన కురిసింది. ఖమ్మం జిల్లావ్యాప్తంగా ఈదురుగాలులతో కురువగా.. అత్యధికంగా వేంసూర్‌లో మోస్తరు వర్షాపాతం రికార్డయ్యింది. ములుగు జిల్లా కన్నాయిగూడెం, ఏటూరునాగారం, తాడ్వాయి మండలాలు.. కొత్తగూడెం జిల్లా ఇల్లెందులో వాన కురిసింది. కుమ్రంభీం ఆసిఫాబాద్‌ జిల్లాలోని వాంకిడి, చింతలమానేపల్లి, పెంచికల్‌పేట, కాగజ్‌నగర్‌, కౌటాలా, సిర్పూర్‌(టీ) భారీ వర్షం కురిసింది. ఇదిలా.. మేడ్చల్‌ మల్కాజ్‌గిరి జిల్లాలో చల్లబడిన వాతావరణం చల్లబడింది.

జిల్లాల్లో పలుచోట్ల ఉరుములు, మెరుపులతో వర్షం కురిసింది. మేడ్చల్‌, కండ్లకోయ, దుండిగల్‌, గండిమైసమ్మతో పాటు మియాపూర్‌, చందానగర్‌, గచ్చిబౌలి, రాయదుర్గంలో వానపడింది. మియాపూర్‌లో పలుచోట్ల వడగళ్లు కురిశాయి. హైదరాబాద్‌ జంట నగరాల పరిధిలోనూ ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది. పొద్దంతా ఎండ దంచికొట్టగా.. సాయంత్రం సమయంలో ఒక్కసారిగా ఆకాశం మేఘావృతమైంది. పలుచోట్ల ఈదురుగాలులు వీయడంతో ప్రజలు ఊపిరిపీల్చుకున్నారు. రాబోయే గంటలో సమయంలో నార్త్‌ హైదరాబాద్‌లో వాన కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ పేర్కొంది.