మహిళలకు సీట్లపై కవిత మాట్లాడరే?

మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలంటూ పోరాడుతున్న ఎమ్మెల్సీ కవిత బిఆర్‌ఎస్‌లో మహిళలకు 3 శాతం సీట్లే కల్పించడాన్ని ఎందుకు ప్రశ్నించడం లేదని బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలు డికె అరుణ ప్రశ్నించారు. కెసిఆర్‌కు దమ్ముంటే మజ్లిస్ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ, బిజెపి ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌లపై పోటీ చేయాలని ఆమె సవాల్ విసిరారు. 
 
బిసి బిడ్డ గంప గోవర్ధన్‌ను పక్కన పెట్టి కెసిఆర్ పోటీ చేయడం దుర్మార్గమని ఆమె విమర్శించారు.ఓడిపోతాననే భయంతోనే కెసిఆర్ రెండు స్థానాల్లో పోటీ చేస్తున్నారన్నారని ఆమె ధ్వజమెత్తారు.  రాజకీయాల్లోకి రావాలని ఆశ ఉన్న అధికారులు ముఖ్యమంత్రి కాళ్లు మొక్కడం సిగ్గుచేటని ఆమె పేర్కొన్నారు. రాజకీయ ఆకాంక్ష ఉంటే పదవులకు రాజీనామా చేసి రాజకీయాల్లోకి రావాలని అరుణ హితవు పలికారు.

మహిళ బిల్లును ప్రవేశపెట్టెడిది, రానున్న రోజుల్లో తీసుకువచ్చేది బిజెపినే అని డికె అరుణ స్పష్టం చేశారు. గిరిజన మహిళను రాష్ట్రపతిని చేసింది, ఎనిమిది మంది గవర్నర్ లను చేసిన ఘనత బిజెపిదే అని ఆమె గుర్తు చేశారు. కీలకమైన ఆర్థిక శాఖ, రక్షణ శాఖ, విదేశీ వ్యవహారాల శాఖలను మహిళలకు ఇచ్చిన ఘనత మోదీది అని మాజీ మంత్రి చెప్పారు. 

 
కేవలం మహిళలకు 7 ఎమ్మెల్యే సీట్లు ఇచ్చిన కెసిఆర్ దీనికి సమాధానం చెప్పాలని ఆమె స్పష్టం చేశారు. రాష్ట్రంలో కనీసం మహిళల రక్షణ లేకుండా పోయిందని ఆమె మండిపడ్డారు. రాష్ట్రంలో ప్రజల విశ్వాసం కోల్పోయిన బిఅర్‌ఎస్‌ను తప్పించి బిజెపికి మద్దతును పలుకుతున్నారని ఆమె వెల్లడించారు.
చాలా మంది ఎమ్మెల్యేలపై అవినీతి ఆరోపణలు వచ్చాయని, ఇసుక దందాలు, భూ దందాలు, 30 శాతం కమిషన్ ఎమ్మెల్యేలు ఉన్నారని ఆమె గుర్తు చేశారు. ఐనా వారందరికీ తిరిగి టికేట్లు ఇచ్చారని అరుణ విస్మయం వ్యక్తం చేశారు. ముదిరాజ్ లకు అసలు ఒక్క టిక్కెట్ కూడా ఇవ్వలేదని ఆమె వాపోయారు.