చంద్రయాన్​-3 “ల్యాండింగ్​”పై సర్వత్రా ఉత్కంఠ

చంద్రయాన్​-3 “ల్యాండింగ్​”పై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. బుధవారం, అంటే ఆగస్ట్​ 23 సాయంత్రం 6 గంటల 4 నిమిషాలకు విక్రమ్​ ల్యాండర్​, చంద్రుడి ఉపరితలంపై అడుగుపెడుతుందని ఇస్రో ప్రకటించింది. ఈ పూర్తి ప్రక్రియ 20 నిమిషాల పాటు ఉంటుంది. ఇది విజయవంతమైతే భారత్ చరిత్ర సృష్టించినట్లు కాగలదు. 
 
అన్ని సజావుగా సాగితే.. చంద్రుడి ఉపరితలంపై అడుగుపెట్టిన నాలుగో దేశంగా చరిత్రలో భారత్ నిలిచిపోనుంది. దీనికోసం యావత్‌ భారతమేకాదు ప్రపంచ దేశాలు కూడా ఉత్కంఠగా ఎదురుచూస్తున్నాయి. ప్రస్తుతం చంద్రుడి దక్షిణ ధ్రువంపై సాఫ్ట్‌ ల్యాండింగ్‌కు అనువైన ప్రదేశం కోసం విక్రమ్‌ ల్యాండర్‌ అన్వేషణ కొనసాగిస్తోంది.
 
ఈ 20 నిమిషాల కీలక సమయాన్ని టీ-20 (టెర్రర్​-20) అని పిలుస్తున్నారు. 25 కి.మీల ఎత్తు నుంచి విక్రమ్ ల్యాండర్ ​​ చంద్రుడి ఉపరితలంపై దిగుతూ వస్తుంది. ఆ సమయంలో రెండు ఇంజిన్​లు ఫైర్​ అవుతుండగా ల్యాండర్​ స్పీడ్​ 6048 కేఎంపీహెచ్​గా ఉంటుంది. ఆకాశంలో తిరిగే విమానం స్పీడ్​ కన్నా ఇది 10 రెట్లు ఎక్కువ!

చంద్రుడి ఉపరితలంపై దిగుతున్న క్రమంలో ల్యాండర్​ స్పీడ్​ తగ్గుతూ వస్తుంది. ఈ సమయంలో విక్రమ్​ ల్యాండర్​, చంద్రుడి సర్ఫేస్​కు అడ్డంగా ఉంటుంది. ఈ దశను “రఫ్​ బ్రేకింగ్​ ఫేజ్​” అని పిలుస్తున్నారు. మొత్తం 20 నిమిషాల ప్రక్రియలో ఇదే 11 నిమిషాలు ఉంటుంది. 

అక్కడి నుంచి ల్యాండర్​ను ఉపరితలానికి వర్టికల్​గా మారుస్తారు శాస్త్రవేత్తలు. ఇక్కడి నుంచి “ఫైన్​ బ్రేకింగ్​ ఫేజ్​” మొదలవుతుంది. వాస్తవానికి ఫైన్​ బ్రేకింగ్​ దశలోనే చంద్రయాన్​-2 మిషన్​ విఫలమైందని చెప్పుకోవాలి. ల్యాండర్​ను అదుపు చేయడం కష్టంగా మారడంతో, అది చంద్రుడిపై కూలిపోయింది. ఈసారి అలా జరగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని ఇస్రో చెబుతోంది.

చంద్రుడి ఉపరితలానికి 800 మీటర్ల ఎత్తులో ల్యాండర్​ వేగం దాదాపు సున్నాకు చేరుకుంటుంది. ఆ తర్వాత ల్యాండింగ్​ కోసం ప్రయత్నిస్తుంది. అప్పటికి కూడా రెండు ఇంజిన్​లు ఫైర్​ అవుతూనే ఉంటాయి. వాటి సాయంతోనే చంద్రుడి ఉపరితలంపై అడుగుపెట్టేందుకు విక్రమ్​ ప్రయత్నిస్తుంది. ల్యాండర్​ కాళ్లల్లోని సెన్సార్​లు ఉపరితలంపై దిగినప్పుడు ఇంజిన్​లు ఆఫ్​ అవుతాయి.

ఫలితంగా 20 నిమిషాల ప్రక్రియ పూర్తవుతుంది. ల్యాండింగ్​ ప్రక్రియ కారణంగా ఉపరితలంపై దుమ్ము ఎగిసిపడుతుంది. ఈ దుమ్మును రెగోలిథ్​ అని పిలుస్తున్నారు. ఇది సెటిల్​ అయిన తర్వాత, కొంతసేపటికి ల్యాండర్​ నుంచి ప్రగ్యాన్​ రోవర్​ బయటకి వస్తుంది. ఈ ప్రగ్యాన్​ రోవర్ చంద్రుడి ఉపరితలంపై అడుగుపెట్టి, దాదాపు 14 రోజుల పాటు పరిశోధనలు చేస్తుంది. అయితే.. ల్యాండ్​ అయిన తర్వాత విక్రమ్​ కొన్ని ఫొటోలు పంపుతుంది. వీటిని సక్సెస్​ ట్రోఫీగా పరిగణించవచ్చు.

కాగా, 70 కిలోమీటర్ల దూరం నుంచి జాబిల్లి ఫొటోలను ల్యాండర్‌ తన కెమెరాలో బంధించింది. ఈ ఫొటోలను భారత అంతరిక్ష పరిశోధనా కేంద్రం ట్విట్టర్‌ (ఎక్స్‌)లో పోస్టు చేసింది. విక్రమ్‌ ల్యాండర్‌కు అమర్చిన ల్యాండర్‌ హజార్డ్‌ డిటెక్షన్‌ అండ్‌ అవైడెన్స్‌ కెమెరా ఈ ఫొటోలను తీసినట్లు తెలిపింది. మిషన్‌ షెడ్యూల్‌లో ఉందని.. సిస్టమ్‌లు క్రమం తప్పకుండా తనిఖీలు జరుగుతున్నట్లు పేర్కొంది. సున్నితమైన సెయిలింగ్ కొనసాగుతోందని తెలిపింది