ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ సర్కారుపై విరుచుకుపడ్డ కాంగ్రెస్ లోక్సభ పక్షనేత అధిర్ రంజన్ చౌధురిపై గురువారం సస్పెన్షన్ వేటు పడింది. అవిశ్వాస తీర్మానంపై చర్చలో భాగంగా నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తిస్తూ ప్రొసీడింగ్స్ను అడ్డుకున్నారంటూ సభ నుంచి సస్పెండ్ చేశారు. కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి దీనికి సంబంధించిన తీర్మానాన్ని ప్రవేశపెట్టగా సభ ఆమోదించింది. ఈ అంశంపై ప్రివిలేజెస్ కమిటీ తన నివేదిక సమర్పించేవరకు ఆయనపై సస్పెన్షన్ కొనసాగనుంది.
విభజన రాజకీయాలు, మత విద్వేషాలు, కాషాయీకరణను దేశం నుంచి తరిమికొట్టేందుకు ‘క్విట్ ఇండియా’ రావాల్సిందేనని తెలిపారు. ‘‘మణిపూర్ ప్రజలకు ప్రధాని శాంతి సందేశం ఇవ్వాలి. మన్కీ బాత్లోనైనా ఆయన స్పందించాలి. అమెరికా, యూరోపియన్ పార్లమెంట్లో కూడా మణిపూర్ అంశంపై చర్చించారు. మణిపూర్ అల్లర్లు చిన్న విషయం కాదు. అందుకే ప్రధాని స్పందించాలని డిమాండ్ చేశాం” అని చెప్పారు.
అవిశ్వాస తీర్మానానికి ఉన్న శక్తే ఆయన్ను పార్లమెంట్కు రప్పిస్తోందని అంటూ ఒకప్పుడు నిండుసభలో ద్రౌపది వస్త్రాపహరణం జరుగుతుంటే అంధుడైన ధృతరాష్ర్టుడు ఎలాగైతే నిస్సహాయంగా ఉన్నాడో ఇప్పుడు మణిపూర్ విషయంలోనూ మోదీ అలాగే ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు.
మరోవైపు అధిర్ వ్యాఖ్యలపై బీజేపీ అగ్గిమీద గుగ్గిలమైంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, పలువురు బీజేపీ ఎంపీలు సభలో నిరసన తెలిపారు. అధిర్ క్షమాపణలు చెప్పాలని, ఆయన వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. స్పీకర్ ఓంబిర్లా స్పందిస్తూ అధిర్ చేసిన వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటించారు.
More Stories
హైదరాబాద్ కేంద్ర పాలిత ప్రాంతం అంటూ కేటీఆర్ కొత్త అస్త్రం
రేజర్వేషన్లపై అమిత్ షా `నకిలీ వీడియో’పై ఎఫ్ఐఆర్
20 రోజులు కూడా సమావేశం కాని తెలుగు రాష్ట్రాల అసెంబ్లీలు