ఉగ్రవాదం లేకపోతేనే పాక్ తో చర్చలు

భారతదేశంతో అపరిష్కృతంగా ఉన్న సమస్యల పరిష్కారం కోసం చర్చించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ చేసిన వ్యాఖ్యలపై తాజాగా భారత్ ఘాటుగా స్పందించింది. పొరుగు దేశమైన పాకిస్తాన్‌తో తమ దేశం స్నేహపూర్వక సంబంధాలనే కోరుకుంటోందని స్పష్టం చేసింది. 
కానీ అందుకు ఉగ్రవాదరహిత వాతావరణం ఉండాలంటూ భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ తేల్చి చెప్పింది.
పాక్ ప్రధాని వ్యాఖ్యలపై విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి అరిందమ్ బాగ్చి మాట్లాడుతూ ఇరుదేశాల సంబంధాల విషయంపై పాక్ ప్రధాని చేసిన వ్యాఖ్యల రిపోర్ట్‌ని తాము చూశామని తెలిపారు.  భారత్ కూడా అన్ని దేశాలతో మంచి సంబంధాలు కోరుకుంటోందని, ఇందులో ఎలాంటి సందేహమే లేదని తేల్చి చెప్పారు. కానీ.. అందుకోసం ఉగ్రవాదం, శతృత్వం లేని వాతావరణం అవసరమని ఆయన స్పష్టం చేశారు.

కాగా.. ఆగస్టు 2వ తేదీన ఇస్లామాబాద్‌లో జరిగిన పాకిస్తాన్ మినరల్స్ సదస్సు ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాక్ ప్రధాని షెహబాజ్ దౌత్య సంబంధాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్‌తో పెండింగ్‌లో ఉన్న తీవ్రమైన సమస్యల్ని పరిష్కరించేందుకు తాము చర్చించేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. చర్చల ద్వారానే సమస్యల్ని పరిష్కరించుకోవాలని ఆయన సూచించారు. యుద్ధం ఎప్పటికీ పరిష్కారం కాదని పేర్కొన్నారు. ఈ విధంగా ఆయన చేసిన వ్యాఖ్యలకు కౌంటర్‌గా భారత విదేశాంగ శాక పైవిధంగా దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చింది.

 నిజానికి, పాకిస్తాన్‌తో భారత్ ఎప్పటినుంచో స్నేహపూర్వక సంబంధాల్ని కోరుకుంటూనే ఉంది. అలాంటి సంబంధం ఏర్పడాలంటే  ఉగ్రవాదం, శతృత్వం లేని శాంతియుత వాతావరణాన్ని సృష్టించే బాధ్యత కూడా పాక్‌పై ఉందని స్పష్టం చేస్తుంది. అంతేకాదు జమ్మకశ్మీర్ ఎప్పుడూ భారత భూభాగమేనని, ఎప్పటికీ ఉంటుందని కూడా భారత్ చెప్తూ వస్తోంది. కానీ పాకిస్తానే తన తీరు మార్చుకోవడం లేదు.