నామినేషన్‌ ఉపసంహరించుకున్న ఇండోర్‌ కాంగ్రెస్ అభ్యర్థి

లోక్‌సభ ఎన్నికల వేళ కాంగ్రెస్‌ పార్టీకి వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి అక్షయ్‌ కాంతి బాబ్‌ తన నామినేషన్‌ను ఉపసంహరించుకున్నారు. ఆయనను పార్టీలోకి ఆహ్వానిస్తూ మంత్రి విజయ్‌వర్గియ ట్వీట్‌ చేశారు.  కాంగ్రెస్‌ ఇండోర్‌ అభ్యర్థి అక్షయ్‌ కాంతిని బీజేపీలోకి సాదరంగా స్వాగతం పలుకుతున్నట్లు పేర్కొన్నారు. అక్షయ్‌ తనతో ఉన్న ఫొటోను దానికి ట్యాగ్‌ చేశారు. దీంతో ఇండోర్‌ మరో సూరత్‌ కానుందా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

బామ్ తన నామినేషన్‌ను ఉపసంహరించుకున్నట్లు ఇండోర్ కలెక్టర్ ఆశిష్ సింగ్ ధృవీకరించారు. ఇండోర్‌లో కాంగ్రెస్‌ అభ్యర్థి అక్షయ్‌కాంతి బామ్‌ ప్రధాని నరేంద్ర మోదీ, పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, ముఖ్యమంత్రి మోహన్‌ యాదవ్‌, రాష్ట్ర అధ్యక్షుడు వీడీ శర్మ నేతృత్వంలో బీజేపీలోకి స్వాగతం పలుకుతున్నారు’’ అని విజయవర్గీయ ట్వీట్‌ చేశారు.

స్థానిక బీజేపీ ఎమ్మెల్యే రమేశ్ మెండోలాతో కలిసి కలెక్టర్ ఆఫీస్‌కు వెళ్లిన ఆయన.. తన నామినేషన్‌ను ఉపసంహరించుకున్నారు. ఇక్కడ బీజేపీ నుంచి సిట్టింగ్ ఎంపీ శంకర్ లాల్వానీ పోటీలో ఉన్నారు. మెండోలా విజయవర్గియాకు నమ్మకమైన సహచరుడు. కాషాయ పార్టీకి కంచుకోటగా ఉన్న ఇండోర్ లోక్‌సభ స్థానం నుండి సిట్టింగ్ బిజెపి ఎంపి శంకర్ లాల్వానీ (62)పై కాంగ్రెస్ ఎన్నికల రంగంలో కొత్త వ్యక్తి అయిన బామ్ (45)ని పోటీకి దింపింది.

నామినేషన్ పరిశీలన సమయంలో అక్షయ్ కాంత్ బామ్ నామినేషన్‌పై బీజేపీ లీగల్ సెల్ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఆయనపై 17 ఏళ్ల కిందట నమోదయిన భూవివాదం కేసును అఫిడ్‌విట్‌లో పెట్టలేదని ఆరోపించింది. అయితే, వారి వాదనలను రిటర్నింగ్ అధికారి తోసిపుచ్చి, నామినేషన్ ఆమోదించారు. మరోవైపు, మధ్యప్రదేశ్ మాజీ మంత్రి, విదిశ నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి శివరాజ్ సింగ్ చౌహాన్ సైతం కాంగ్రెస్‌ పార్టీకి చురకలు వేశారు. అభ్యర్థులు సైతం పార్టీలో ఇమడలేని పరిస్థితిలో గ్రాండ్ ఓల్డ్ పార్టీ (కాంగ్రెస్)లో ఉందని ఆయన విమర్శించారు.

ఇండోర్‌లో మే 13న పోలింగ్ జరగనుంది. ఓటర్ల సంఖ్య పరంగా రాష్ట్రంలోనే అతిపెద్ద నియోజకవర్గమైన ఇండోర్‌లో 25.13 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. ఈ సారి 8 లక్షల ఓట్ల తేడాతో గెలుపొందడం ఖాయమని బీజేపీ ధీమా వ్యక్తం చేసింది. గుజరాత్‌లోని సూరత్‌ కాంగ్రెస్‌ అభ్యర్థి నామినేషన్‌ తిరస్కరణకు గురవడం, మిగిలిన వారు నామినేషన్లు ఉపసంహరించుకోవడంతో బీజేపీ అభ్యర్థి ఏకగ్రీవంగా ఎన్నికైన విషయం తెలిసిందే. గుజరాత్‌లోని సూరత్ స్థానం నుంచి ఆ పార్టీ అభ్యర్థి ముకేశ్‌ దలాల్‌ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు అధికారులు ప్రకటించారు.

 కాంగ్రెస్‌ అభ్యర్థి నీలేశ్‌ కుంభానీ నామినేషన్‌ పత్రాలపై ప్రతిపాదకులుగా సంతకాలు చేసిన ముగ్గురు అవి తమవి కాదని చెప్పడంతో.. అది తిరస్కరణకు గురైంది. కాంగ్రెస్‌ డమ్మీ అభ్యర్థి నామినేషనూ చెల్లలేదు. ఆ వెంటనే ఇండిపెండెంట్లు కూడా బరి నుంచి వైదొలగడంతో ముకేశ్‌ దలాల్‌ విజేత అయ్యారు.