‘అధిక సంతానం’ ముస్లింల గురించి కాదు.. పేదల గురించి

* హిందూ- ముస్లిం అంటూ మాట్లినరోజు ప్రజాజీవితంలో ఉండలేను
 
సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ తాను చేసిన ‘అధిక సంతానం ఉన్నవారు’ వ్యాఖ్యలపై చెలరేగిన దుమారంపై తాజాగా వివరణ ఇచ్చారు. తాను కేవలం మస్లింలను ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేయలేదని, ఎక్కువ మంది పిల్లలతో ఇబ్బందులు పడుతోన్న పేదల గురించి మాట్లాడానని స్పష్టత ఇచ్చారు. 
 
ఒకవేళ హిందూ, ముస్లిం అంటూ తాను వేరు చేసి మాట్లాడిన రోజే ప్రజాజీవితంలో కొనసాగడానికి అర్హత కోల్పోతానని  తేల్చి చెప్పారు. వారణాసి లోక్‌సభ స్థానానికి మంగళవారం నామినేషన్ వేసిన అనంతరం ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అధిక సంతానం కలిగిన పేద కుటుంబాలు తమ పిల్లలకు ఆహారం, బట్టలు, విద్యను అందించడం అనేది సమస్య అని, తాను అదే విషయాన్ని ప్రస్తావించానని చెప్పారు.
 
చిన్నతనంలో పొరుగున ఉన్న ముస్లిం కుటుంబాలతో తన సంబంధాలు, వారి ఆచారాలు, సంప్రదాయాలను తాను అనుసరించిన విషయాన్ని ఈ ఇంటర్వ్యూలో వివరించారు. ‘ఇతర పండుగల మాదిరిగానే మా ఇంట్లో ఈద్ వేడుకలు జరుపుకునేవాళ్లం.. ఈ రోజున పొరుగున ఉండే ముస్లింల ఇళ్లలోనే మాకు విందు.. మొహర్రం సమయంలో బయటకు వెళ్తే తాజియా కింద నుంచి వెళ్లాల్సి ఉంటుందని తెలుసు.. ఆ సమాజంలోనే నేను పెరిగాను.. నాకు చాలా మంది ముస్లిం స్నేహితులు ఉన్నారు.. నేను వాటి గురించి ఎప్పుడూ బయటపెట్టను’ అని మోదీ తెలిపారు.

‘మోదీ ముస్లింలకు చెందినవాడు కాదు’ అనే అభిప్రాయం తప్పని నిరూపించలేకపోవడాన్ని మీరు అంగీకరిస్తారా? అని ప్రశ్నకు ‘ఈ సమస్య ముస్లింలకు సంబంధించినది కాదు. .. మోదీకి వ్యక్తిగతంగా ముస్లింలు ఎంతగా మద్దతు ఇస్తున్నారనే దానితో సంబంధం లేకుండా 2002 గోద్రా అల్లర్ల తర్వాత నా ప్రతిష్టను ఉద్దేశపూర్వకంగా దెబ్బతీశారు’ అని సమాధానం ఇచ్చారు.
 
‘నేను ముస్లింల పట్ల ప్రత్యేక ప్రేమను వ్యక్తం చేయను. ఓటు బ్యాంకు రాజకీయాల కోసం నేను ఆ పనిచేయలేను. సబ్‌కా సాత్.. సబ్‌కా వికాస్ అనే సిద్ధాంతాన్ని నమ్ముతాను. కానీ నా వెంటరాని మాటలు అన్నట్లు ప్రచారం కావడం నన్ను దిగ్భ్రాంతికి గురిచేసింది. అధిక సంతానం ఉన్న పేదల గురించి నేను మాట్లాడితే అది ముస్లింలను ఉద్దేశించే అని ఎవరు అన్నారు?’ అంటూ ప్రశ్నించారు. 
 
 “పేద కుటుంబాలన్నింటిలోనూ ఈ పరిస్థితి ఉంది. పేదరికం ఉన్న చోట మతంతో సంబంధం లేకుండా ఎక్కువ మంది సంతానం సమస్య ఉంటుంది. నేను హిందువు లేదా ముస్లిం పేరు ప్రస్తావించలేదు. ఎంతమంది బాగోగులను చూసుకోగలరో అంతమంది పిల్లలను కనాలి. ప్రభుత్వమే మీ పిల్లల మంచిచెడులు చూసుకోవాలనే పరిస్థితి కల్పించకూడదు” అని మోదీ హితవు చెప్పారు.
 
ఇక, ప్రస్తుత ఎన్నికల్లో ముస్లింలు మీకు ఓటు వేస్తారని అనుకుంటున్నారా? అనే ప్రశ్నకు మోదీ తనదైన శైలిలో సమాధానం ఇచ్చారు. దేశ ప్రజలంతా తనకు ఓటు వేస్తారని చెప్పుకొచ్చారు. హిందూ ముస్లింలంటూ వేరు చేసి మాట్లాడిన రోజున ప్రజాజీవితంలో కొనసాగే అర్హతను కోల్పోతానని ఉద్ఘాటించారు. అందుకే హిందూ, ముస్లిం పేరుతో రాజకీయాలు చేయనని, ఇది తన ప్రతిజ్ఞ అని ప్రధాని చెప్పుకొచ్చారు.
 
కాగా, గత నెల రాజస్థాన్‌లో ఎన్నికల ప్రచారం సందర్భంగా ఒకవేళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ప్రజల సంపదను చొరబాటుదారులకు, అధిక సంతానం ఉన్న వారికి పంచిపెడుతుందన్న ప్రధాని వ్యాఖ్యలపై తీవ్ర దుమారం రేగింది. అంతేకాదు, మన అమ్మలు, సోదరీమణుల మెడలోని మంగళసూత్రం సహా బంగారం అంతా కాంగ్రెస్ లాక్కుంటుందని ఆరోపించారు. ఈ వ్యాఖ్యలపై విపక్షాలు దుమ్మెత్తిపోశాయి. ప్రధాని విభజన రాజకీయాలు చేస్తున్నారని, ప్రజల్లో విద్వేషాలను రెచ్చగొడుతున్నారని దుయ్యబట్టాయి.