నింగిలోకి దూసుకెళ్లిన పీఎస్‌ఎల్వీ-సీ56

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో అప్రతిహతంగా దూసుకుపోతున్నది. ఒకే నెలలో రెండు ప్రయోగాలను విజయవంతంగా చేపట్టింది. ఈ నెల 14న చంద్రయాన్‌లో భాగంగా ఎల్‌వీఎం-3 రాకెట్‌ను జాబిల్లిపైకి పంపించింది. తాజాగా పీఎస్‌ఎల్వీ సీ-56 రాకెట్‌ను విజయవంతంగా ప్రయోగించింది. ఆదివారం ఉదయం 6.30 గంటలకు ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీహరికోటలో ఉన్న షార్‌ నుంచి పీఎస్‌ఎల్వీ- సీ56 రాకెట్‌ నింగిలోకి దూసుకెళ్లింది.
నాలుగు దశల్లో జరిగిన ఈ ప్రయోగం ద్వారా సింగపూర్‌కు చెందిన 7 ఉపగ్రహాలను భూ కక్షలోకి ప్రవేశపెట్టింది. ఈ ఏడాది ఇస్రోకు ఇది మూడో వాణిజ్యం ఉపగ్రహ ప్రయోగం. 44.4 మీటర్ల పొడవు, 228 టన్నుల బరువున్న పీఎస్‌ఎల్వీ-సీ56 ఉప్రగహాలను 535 కిలోమీటర్ల ఎత్తులోని ఎర్త్‌ ఆర్బిట్‌లో విడిచిపెడుతుంది. తొలుత ఈ ప్రయోగాన్ని జూలై 26నే చేయాలనుకున్నప్పటికీ సాంకేతిక కారణాలతో నేటిని వాయిదా వేశారు. దీనికి సంబంధించిన కౌంట్‌డౌన్‌ శనివారం ఉదయం 5.01 గంటలకు ప్రారంభించారు.
 
దీనిద్వారా 7  విదేశీ ఉపగ్రహాలను నిర్దేశిత కక్షలోకి పంపించింది ఇందులో సింగపూర్‌కు చెందిన డీఎస్‌టీఏ ఎస్టీ ఇంజినీరింగ్‌ సంస్థకు చెందిన డీఎస్‌ ఎస్‌ఏఆర్‌ ఉపగ్రహంతోపాటు నాన్యాంగ్‌ టెక్నలాజికల్‌ యూనివర్సిటీకి చెంచిన వెలాక్స్‌-ఏఎం, ఆర్కేట్‌, స్కూబ్‌-2, న్యూలియాన్‌, గెలాసియా-2, ఓఆర్‌బీ-12 శాటిలైట్‌లు ఉన్నాయి. ఇవన్నీ సింగపూర్‌కు చెందినవే కావడం విశేషం.

పీఎస్‌ఎల్వీ-సీ 56 ద్వారా సింగపూర్‌కు చెందిన 420 కిలోల బరువున్న 7 ఉపగ్రహాలను నింగిలోకి పంపించింది. ఇందులో డీఎస్‌-సార్‌ ప్రధానమైన శాటిలైది. ఇది సింగపూర్‌ ప్రభుత్వంలోని వివిధ ఏజెన్సీలకు ఉపగ్రహ చిత్రాలను తీసి పంపిస్తుంది. తాజా ప్రయోగంతో ఇస్రో శాస్త్రవేత్తల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. శాస్త్రవేత్తలను ఇస్రో చైర్మన్‌ సోమ్‌నాథ్‌ అభినందించారు.

పీఎస్‌ఎల్వీ-సీ 56 రాకెట్‌ ప్రయోగం విజయవంతమైందని సోమ్‌నాథ్‌ ప్రకటించారు. ఏడు ఉపగ్రహాలను నిర్దేశిత కక్ష్యలోకి రాకెట్‌ చేర్చిందని వెల్లడించారు. ఇస్రోపై నమ్మకం ఉంచిన సింగపూర్‌ ప్రభుత్వానికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. పీఎస్‌ఎల్వీ శ్రేణిలో మరిన్ని ప్రయోగాలు చేపడుతున్నామని తెలిపారు. ఆగస్టు లేదా సెప్టెంబర్‌లో మరో పీఎస్‌ఎల్వీ ప్రయోగం ఉంటుందని వెల్లడించారు. గగన్‌యాన్‌, ఎస్‌ఎస్‌ఎల్వీ, జీఎస్‌ఎల్వీ మార్క్‌-3 ప్రయోగాలకు సిద్ధమవుతున్నామని చెప్పారు.