నవంబర్ 1-8 వరకు విశాఖపట్నంలో ఐసీఐడీ సదస్సు

వ్యవసాయరంగంలో నీటి ఎద్దడిని సమర్ధవంతంగా ఎదుర్కోవటం అనే అంశంపై విశాఖపట్నంలో ఈ ఏడాది నవంబర్ 1 నుంచి 8 వరకు  ఎంతో ప్రతిష్టాత్మకంగా 25వ అంతర్జాతీయ ఐసీఐడీ (ఇంటర్నేషనల్ కమిషన్ ఆన్ ఇరిగేషన్ అండ్ డ్రైనేజ్) సదస్సును నిర్వహిస్తున్నట్లు జల వనరుల  శాఖ మంత్రి అంబటి రాంబాబు తెలిపారు.  
 
ఐసీఐడీ సదస్సు బ్రోచర్ ను మంత్రి విడుదల చేస్తూ ప్రపంచవ్యాప్తంగా 80 దేశాలు నీటి ఎద్దడి, నీటి యాజమాన్యం, నీటి వినియోగం తదితర అంశాలపై ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి  ఐసీఐడీ మేథోమధనం జరుగుతుందని చెప్పారు.  ఐసీఐడీ సదస్సును కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా నిర్వహిస్తున్నాయని తెలిపారు.  
 
1951లో మనదేశం ప్రోద్భలంతో 11 దేశాల భాగస్వామ్యంతో ప్రారంభమైన ఐసీఐడీ సదస్సు 1966లో మన దేశంలో నిర్వహించారని, మరలా 57 సంవత్సరాల తరువాత ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి చొరవతో ఈ ఏడాది మన వైజాగ్ లో నిర్వహించటం గొప్ప విషయమని పేర్కొన్నారు. ఈ సదస్సుకు ప్రధాన మంత్రి, రాష్ట్రపతులను ప్రత్యేకంగా ఆహ్వానించామని తెలిపారు. 
 
ఈ సదస్సుకు దాదాపు 80 దేశాల నుంచి 500 మందికి పైగా విదేశీ ప్రతినిధులు, మన దేశం నుంచి 700 మంది ప్రతినిధులు పాల్గొననున్నారని తెలిపారు.  సదస్సులో నీటి పారుదల, డ్రైనేజీపై ఎగ్జిబిషన్ ఉంటుందని తెలిపారు. వ్యవసాయరంగంలో నీటి ఎద్దడిని ఎదుర్కోవటం అనే అంశంపై ప్రధానంగా నిపుణులు చర్చిస్తారని వివరించారు.
 
ఐసీఐడీ సదస్సులు ప్రతి మూడు సంవత్సరాలకు ఒక దేశంలో నిర్వహించటం ఆనవాయితీ అని మంత్రి అంబటి రాంబాబు వివరించారు. 2020లో జరగాల్సిన అంతర్జాతీయ సదస్సు కరోనా విపత్తు వల్ల ఆలస్యంగా గతేడాది ఆస్ట్రేలియాలో జరిగిందని, ఈ సదస్సులో సర్ ఆర్థర్ కాటన్ బ్యారేజ్ (ధవళేశ్వరం) వరల్డ్ హెరిటేజ్ ఇరిగేషన్ స్ట్రక్చర్ అవార్డు స్వంతం చేసుకుందని చెప్పారు. 
 
ఈ ఏడాది హెరిటేజ్ అవార్డుకు ప్రకాశం బ్యారేజీ పేరును ప్రతిపాదనలు పంపామని తెలిపారు. నీటి యాజమాన్యంలో మెరుగైన పద్దతులు పాటించిన దేశాలకు ప్రోత్సాహకంగా అవార్డులు అందచేస్తారని చెప్పారు.  ఇప్పటి వరకు మన దేశానికి 14 అవార్డులు వస్తే వాటిలో 4 అవార్డులు మన రాష్టానికే రావటం అభినందనీయమని తెలిపారు.
 
నాగార్జున సాగర్ కుడి కాలువకు తాగునీటి ఎద్దడి నివారణ లో భాగంగా 5 టీఎంసీల నీటిని విడుదల చేస్తున్నామని మంత్రి తెలిపారు. పులిచింతల నుంచి కృష్ణా డెల్టాకు నీరు విడుదల చేస్తే భవిష్యత్ లో ఇబ్బందులు రావచ్చు అని పట్టిసీమను రీస్టార్ట్ చేసి కృష్ణా డెల్టాకు నీరు అందించనున్నామని చెప్పారు.  
 
గోదావరి నది వరద నీరు  పోలవరం వద్ద 5 లక్షల క్యూసెక్ లు స్పిల్ వే నుంచి కిందకు వెళుతున్నాయని చెప్పారు. పోలవరం డయాఫ్రం వాల్ యూ ఆకారంలో ప్యాచ్ వర్క్ పూర్తి చేయాలా లేదా కొత్తగా డయాఫ్రం వాల్ నిర్మాణం చేయాలా అనే అంశాలను పరిశీలించి ఉన్నత స్థాయిలో ఒక నిర్ణయం తీసుకోనున్నామని మంత్రి తెలిపారు.