విద్య అన్నది ప్రపంచాన్ని తెలుసుకునే మార్గం అని తేల్చి చెబుతూ ఈ చదువుల్ని లోక కళ్యాణం కోసం ఉపయోగించాలని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సర్ సంఘచాలక్ డా. మోహన్ భగవత్ సూచించారు. శ్రీ సరస్వతీ విద్యాపీఠం ఆధ్వర్యంలో సీబీఎస్ఈ పాఠశాలగా రూపుదిద్దుకున్న నాదర్ గుల్ లోని విద్యాభారతి విజ్ఞాన కేంద్రం భవనాలను ఆదివారం పరమహంస పరివ్రాజకారాచర్య త్రిదండి చిన శ్రీమన్నారాయణ చిన జీయర్ స్వామితో కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ 1952 లో శ్రీ సరస్వతీ శిశుమందిర్ ఒక చిన్న గదిలో ప్రారంభమై ఇప్పుడు దేశ వ్యాప్తంగా వేలాది పాఠశాలలు నడుస్తున్నాయని డా. భగవత్ వివరించారు. విలువలతో కూడిన విద్యను అందిస్తూ సమాజానికి సేవలు అందిస్తోందని చెప్పారు. ఇప్పుడు ఇంటర్నేషనల్ స్కూల్స్ ప్రారంభించినప్పటికీ దేశ భక్తి, విలువలతో కూడిన విద్యకు పెద్దపీట వేయటం జరుగుతోందని స్పష్టం చేశారు.
విదేశాలకు విహార యాత్రకు వెళ్లే ముందు, అయోధ్య వంటి పుణ్య స్థలాలను సందర్శిస్తే దేశ భక్తి మరింత పెరుగుతుందని ఆయన సూచించారు. స్వయంసేవక్ లు చివరి శ్వాస దాకా సమాజం కోసమే పనిచేస్తారని ఆయన స్పష్టం చేశారు. మనమంతా రాముని బాటలో నడవాలని ఆయన పిలుపు ఇచ్చారు. సోషల్ మీడియాను మంచి కోసం ఉపయోగించుకోవాలని సూచించారు. కుత్రిమ మేధస్సు వంటి సౌకర్యాలను సమాజహితం కోసం వాడుకోవాలని పేర్కొన్నారు. ఇటీవల కాలంలో సంఘ్ మీద కూడా తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన విచారం వ్యక్తం చేశారు.
చిన జీయర్ స్వామి అనుగ్రహ భాషణం చేస్తూ దేశం సమస్యల్లో ఉన్నప్పుడు ప్రధానమంత్రి నరేంద్రమోదీ మార్గదర్శనం చేశారని తెలిపారు. భారత్ ను విశ్వ గురు స్థానంలో నిలిపేందుకు ఆయన ఎనలేని కృషి చేస్తున్నారని కొనియాడారు. తాను రాజకీయ నాయకుడిని కాదని, కేవలం ఒక భారతీయుడుగా తన వాదనలు వినిపిస్తున్నానని చిన జీయర్ స్వామి స్పష్టం చేశారు.
విద్య అన్నది పొట్ట కూటి కోసం కానే కాదని, సమాజంలో సక్రమమైన పౌరుడిగా తయారు చేసుకొనేందుకు అని వివరించారు. అటువంటి విలువలతో కూడిన విద్యను శిశుమందిర్ లు అందిస్తున్నాయని ఆయన ప్రశంసించారు. విలువలు గల విద్యను అందించటంలో దేశవ్యాప్తంగా పేరెన్నిక గన్న విద్యాభారతి అఖిల భారత శిక్షా సంస్థాన్ కు అనుబంధంగా తెలుగు రాష్ట్రాల్లో శ్రీ సరస్వతీ విద్యాపీఠం నిలుస్తోంది.
గడచిన 50 సంవత్సరాలుగా రెండు రాష్ట్రాల్లోనూ 400కు పైగా శిశుమందిర్ లను నిర్వహిస్తూ విద్యాసేవలు అందిస్తోంది. ఈ క్రమంలో అత్యున్నత ప్రమాణాలతో విద్యాలయాలు ఏర్పరుస్తున్న క్రమంలో అనుభవజ్నులైన అధ్యాపకులు, నాణ్యమైన విద్యా వసతులతో ఆధునిక హంగులతో రెండవ సీబీఎస్ఈ పాఠశాలగా ఇది రూపుదిద్దుకుంది.
ఈ కార్యక్రమంలో సంఘ్ అఖిల భారతీయ ప్రచార ప్రముఖ్ సునీల్ అంబేకర్, క్షేత్ర ప్రచారక్ సుధీర్, క్షేత్ర సహ ప్రచారక్ భరత్, ప్రాంత ప్రచారక్ లింగం శ్రీధర్, విద్యాభారతి క్షేత్ర అధ్యక్షులు డాక్టర్ చామర్తి ఉమామహేశ్వరరావు, సంఘటన కార్యదర్శి లింగం సుధాకర్ రెడ్డి, ప్రాంత ఉపాద్యక్షులు పసర్తి మల్లయ్య, కార్యదర్శి ముక్కాల సీతారాములు, సంఘటన కార్యదర్శి పతకమూరి శ్రీనివాస్, పాఠశాల అధ్యక్షులు తేలుకుంట్ల రమేష్ గుప్తా, కార్యదర్శి విష్ణు వర్ధన్ రాజు తదితరులు పాల్గొన్నారు.
విజ్ఞానకేంద్రం ఏర్పాటుకి భూమి, వస్తు రూపంలో తోడ్పాటు అందించిన దాతలను ఆత్మీయంగా సత్కరించారు. పిల్లల సాంస్క్రతిక కార్యక్రమాలు అలరించాయి.
More Stories
లోక్సభ నాలుగో విడత 5 గంటల వరకు 62.31% ఓటింగ్
పోలీసుల అదుపులో తెనాలి, తాడిపత్రి వైసిపి ఎమ్యెల్యేలు
హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్ధి మాధవీలతపై కేసు నమోదు