తెలంగాణాలో రాగల ఐదురోజుల పాటు అతి నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరిస్తూ రెడ్ అలెర్ట్ జారీ చేసింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి మంగళవారం రాత్రి ఆయా జిల్లాల కలెక్టర్లు, ముఖ్య అధికారులతో మాట్లాడారు.
సీనియర్ అధికారులతో పాటు కొత్తగూడెం, జనగాం, కామారెడ్డి, కరీంనగర్, ఖమ్మం, మహబూబాబాద్, ములుగు, పెద్దపల్లి, సిద్దిపేట, వరంగల్, హన్మకొండ, కలెక్టర్లతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. వాతావరణశాఖ హెచ్చరికల నేపథ్యంలో అధికారులను సీఎస్ శాంతికుమారి అలెర్ట్ చేశారు. ఎలాంటి ప్రాణనష్టం జరుగకుండా చూడాలని సూచించారు.
లోతట్టు ప్రాంతాలను గుర్తించాలని, పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని కలెక్టర్లను ఆదేశించారు. ఎప్పటికప్పుడు ముందుజాగ్రత్త చర్యలు తీసుకోవాలని, కలెక్టరేట్లు, మండల కేంద్రాల్లో కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేయాలని చెప్పారు. అన్నిశాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని, నీటి పారుదలశాఖ అధికారులు పూర్తి అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. భారీ వర్షాల నేపథ్యంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్టు తెలిపారు. కంట్రోల్ రూమ్ నెంబర్ 08744–241950ని అందరికీ తెలియజేయాలని పేర్కొన్నారు. అన్ని మండలాల్లో అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ఇక అవసరమైతేనే ప్రజలు ఇంట్లోనుంచి బయటకు రావాలని కలెక్టర్ సూచించారు
More Stories
నేటి నుండి తెలంగాణాలో థియేటర్ల మూసివేత
హైదరాబాద్ లో రీ పోలింగ్ కు బీజేపీ అభ్యర్థి డిమాండ్
ఉమ్మడి రాజధాని గడువు ముగింపుతో ఏపీ ఆస్తుల స్వాధీనం!