గజం స్థలం సేకరించలేని దద్దమ్మలు

గజం స్థలం సేకరించలేని దద్ధమ్మలు బీఆర్ఎస్ నాయకులు అని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ మండిపడ్డారు. గద్వాల పట్టణంలోని దౌదర్పల్లి దర్గా దగ్గర ఉన్న డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను మంగళవారం పరిశీలించిన సందర్భంగా అరుణ మాట్లాడుతూ తాను మంత్రిగా ఉన్న సమయంలో పేద ప్రజలకు పట్టాలిస్తే లాక్కొని డబుల్ బెడ్ రూమ్ లు ఇస్తానని చెప్పి ప్రజలను మోసం చేశారని ధ్వజమెత్తారు.
 
డిప్పు తీసిన లబ్ధిదారులకు ఇంతవరకు డబుల్ బెడ్ రూమ్ లు ఎందుకు ఇవ్వలేదని ఆమె ప్రశ్నించారు.  పేద ప్రజలకు కట్టిస్తున్నటువంటి డబుల్ బెడ్ రూమ్ ఇండ్లలో కూడా నాసిరకం పనులు చేపట్టి కమిషన్లు తీసుకొని నాసిరకంగా ఇండ్లు కట్టారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. 
 
నాసిరకంతో కట్టిన ఇండ్లు ఎంతకాలం ఉంటాయో ఎప్పుడు కూలిపోతాయో అని పేర్కొంటూ ఇందులో నివాసం ఉండలేని పరిస్థితి ఉందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. పేద ప్రజలకు ఇచ్చిన పట్టాలు లాక్కొని నర్సింగ్ కాలేజీ కడుతున్నారని పేర్కొంటూ ఈ బీఆర్ఎస్ దద్దమ్మల కు 10 ఎకరాల స్థలం దొరకలేదా? అని ఆమె ప్రశ్నించారు.
 
 పేదలకు డబుల్ బెడ్ రూమ్ లు, ఇచ్చిన హామీలను నెరవేర్చాలని, కట్టిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను పేదలకు వెంటనే ఇవ్వాలని ఆమె డిమాండ్ చేశారు. లేనియెడల భారతీయ జనతా పార్టీ తరఫున 24వ తేదీన ధర్నా చేపడతామని డీకే అరుణ హెచ్చరించారు.