ప్రధాని మోదీకి ఫ్రాన్స్ అత్యున్నత పురస్కారం!

భారత దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి మరో అరుదైన గౌరవం దక్కింది. ఫ్రాన్స్​ పర్యటనలో ఉన్న మోదీని ఆ దేశ అత్యున్నత పురస్కారం వరించింది. ఈ మేరకు “గ్రాండ్​ క్రాస్​ ఆఫ్​ ది లిజియన్​ ఆఫ్​ హానర్”​ను మోదీకి అందించారు ఆ దేశాధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్​ మేక్రాన్​.  ఫ్రాన్స్​ మిలిటరీ, పౌర పురస్కారాల్లో ఇదే అత్యుత్తమమైనది. 

ఇక ఓ భారత ప్రధానికి ఈ గౌరవం దక్కడం ఇదే తొలిసారి. ఎలిసీ ప్యాలెస్​లో  గురువారం మోదీకి ప్రైవేట్​ డిన్నర్​ ఇచ్చారు మేక్రాన్​​. ఈ నేపథ్యంలో ఫ్రాన్స్​ అత్యున్నత పురస్కారాన్ని అందజేశారు. ఈ నేపథ్యంలో ఆయనకు ప్రధాని కృతజ్ఞతలు తెలిపారు. “ఫ్రాన్స్​ దేశ ఆత్యున్నత పురస్కారమైన గ్రాండ్​ క్రాస్​ ఆఫ్​ ది లిజియన్​ ఆఫ్​ హైనర్​ను ప్రధాని మోదీకి ఇమ్మాన్యుయేల్​ మేక్రాన్​​ అందించారు. కోట్లాది మంది భారతీయుల తరఫున మేక్రాన్​​కు మోదీ కృతజ్ఞతలు తెలిపారు,” అని భారత విదేశాంగశాఖ ట్వీట్​ చేసింది.

గతంలో కేవలం కొంతమంది ప్రముఖులకే ఈ అత్యున్నత పురస్కారం దక్కింది. దక్షిణాఫ్రికా మాజీ అధ్యక్షుడు నెల్సన్​ మండేలా, కింగ్​ ఛార్లెస్​, ఫ్రాన్స్​ మాజీ ఛాన్స్​లర్​ ఏంజెలా మెర్కెల్, మాజీ యూఎన్​ ప్రధాన కార్యదర్శి బుట్రోస్​ బుట్రోస్​ ఘాలిలు ఈ జాబితాలో ఉన్నారు. 2023లో మోదీకి ఇప్పటికే నైల్​ ఆఫ్​ ఈజిప్ట్​, ఆర్డర్​ ఆప్​ పపువా గినియా, కంపానియన్​ ఆఫ్​ ఫిజీ, రిపబ్లిక్​ ఆఫ్​ పాలౌ నుంచి ఇబక్​ అవార్డ్​ వంటి అరుదైన పురస్కారాలు దక్కాయి. వీటితో పాటు మరెన్నో పురస్కారాలను గత కొన్నేళ్లలో మోదీ దక్కించుకున్నారు. 

ఫ్రాన్స్​ పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ గురువారం భారత సమాజంతో సమావేశమైన సందర్భంగా భారతదేశం వైవిధ్యానికి ఒక నమూనా, దాని ప్రజాస్వామ్యం అత్యంత శక్తివంతమైన అంశం అని తెలిపారు. భారత్-ఫ్రాన్స్ భాగస్వామ్యానికి ప్రజల మధ్య అనుసంధానమే బలమైన పునాది అని ప్రధాని మోదీ చెప్పారు. భారతదేశం, ఫ్రాన్స్ 21వ శతాబ్దపు అనేక సవాళ్లను ఎదుర్కొంటున్నాయని చెబుతూ అందువల్ల, ఈ కీలక సమయంలో, మన దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం ప్రాముఖ్యత మరింత పెరిగిందని తెలిపారు. శుక్రవారం నాటి జాతీయ దళ్‌పై ఫ్రాన్స్ ప్రజలకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు.

ఈ నేపథ్యంలో యుపిఐపై కీలక విషాయన్ని వెల్లడించారు. “ఫ్రాన్స్​లో యూపీఐని వినియోగించాలని ఇరు దేశాలు నిర్ణయించాయి. రానున్న రోజుల్లో ఈఫిల్​ టవర్​ నుంచి యూపీఐ సేవలు ప్రారంభమవుతాయి. అంటే.. ఇక్కడ పర్యటనకు వచ్చే భారతీయులు.. ఇండియన్​ కరెన్సీలో డబ్బులు చెల్లించవచ్చు,” అని మోదీ తెలిపారు.  భూటాన్​, యూఏఈ, నేపాల్​లో ఇప్పటికే యూపీఐ సేవలు అందుబాటులో ఉంది. అమెరికా, పశ్చిమాసియా, యూరోప్​లలోనూ యూపీఐ సేవలను విస్తరించాలని భారత దేశం భావిస్తోంది.

“నగదు లేకుండా భారతదేశానికి రండి, కేవలం మొబైల్ ఫోన్ తీసుకెళ్లండి, ఒక్క పైసా నగదు లేకుండా మీరు భారతదేశంలో జీవించగలుగుతారు” అని ప్రవాస భారతీయులను ఉద్దేశించి ప్రధాని మోదీ పేర్కొన్నారు. అతి త్వరలో, భారతీయ పర్యాటకులు పారిస్‌లోని ఈఫిల్ టవర్‌లో మొబైల్ ఫోన్ ద్వారా రూపాయల్లో చెల్లించగలరని ప్రధాని మోదీ వెల్లడించానారు. ఫ్రాన్స్‌లో మాస్టర్స్ చదివే భారతీయ విద్యార్థులకు 5 సంవత్సరాల లాంగ్ టర్మ్ పోస్ట్ స్టడీ వీసా ఇవ్వాలని నిర్ణయించినట్లు ప్రధాని ఈ సందర్భంగా ప్రకటించారు.