నితీశ్ కుమార్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీజేపీ ప్రదర్శన తలపెట్టింది. ఇది ఉద్రిక్తంగా మారింది. పోలీసుల జులుంతో అదేపనిగా జరిపిన లాఠీల ప్రయోగంతో జెహ్నాబాద్ జిల్లా బిజెపి ప్రధాన కార్యదర్శి విజయ్ సింగ్ మృతి చెందారని పార్టీ సీనియర్ నేతలు పాట్నాలో తెలిపారు. పోలీసుల పాశవిక లాఠీఛార్జ్ పట్ల బిజెపి అధ్యక్షుడు జెపి నడ్డాతో పాటు ఆ పార్టీ అగ్రనేతలు ఆగ్రవేశాలు వ్యక్తం చేస్తున్నారు.
బీహార్ లో అధికారంలో ఉన్న మహాగత్ బంధన్ ప్రభుత్వంకు ఇవే చివరి రోజులంటూ నడ్డా మండిపడ్డారు. తన ఉపముఖ్యమంత్రి తేజస్వి యాదవ్ పై “ఉద్యోగాలకు భూమి” కుంభకోణంలో సిబిఐ ఛార్జ్ షీట్ దాఖలు చేయడంతో ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తన నైతికతను విస్మరిస్తున్నారని అంటూ ఆయన ఎద్దేవా చేశారు.
రాష్ట్రంలోని అవినీతి , అరాచకాల ప్రభుత్వానికి వ్యతిరేకంగా బిజెపి చేపట్టిన సత్యాగ్రహాన్ని పోలీసు బలగాలు విచ్ఛిన్నం చేసేందుకు యత్నించాయని , ఈ క్రమంలో విజయ్సింగ్ బలిదానం చేశారని, పలువురు తీవ్రంగా గాయపడ్డారని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, బీజేపీ రాష్ట్ర శాఖ మాజీ అధ్యక్షులు నిత్యానంద్ రాయ్ విలేకరుల సమావేశంలో తెలిపారు.
వేలాది మంది బిజెపి కార్యకర్తలు గాయపడ్డారని, వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉందని చెప్పారు. పలు కుంభకోణాలలో రాష్ట్ర ఉపముఖ్యమంత్రి తేజీస్వీ యాదవ్ ప్రమేయం ఉందని ఆరోపించారు. ఇటీవల పాత కేసుల్లో కూడా ఆయనపై ఛార్జీషీటు దాఖలు అయిందని, లాలూ అవినీతి కుటుంబం బీహార్ను దోచుకుందని, ఇకపై కూడా దోచుకునేందుకు సిద్ధమైందని కేంద్ర మంత్రి మండిపడ్డారు.
వీరి ఆగడాల నుంచి రాష్ట్రాన్ని విముక్తం చేసేందుకు బిజెపి కంకణం కుట్టుకుందని తెలిపారు. అయితే ఈ నేత మృతికి కారణాలు పూర్తిగా నిర్థారణ కాలేదని, గాయాలతో ఆయన ఆసుపత్రిలో చేరారని అయితే చికిత్స దశలో మృతి చెందారని, పోస్టుమార్టం నివేదిక తరువాతనే పూర్తి స్థాయిలో విషయం స్పష్టం కాదని పాట్నా మెడికల్ కాలేజీ, హాస్పిటల్ (పిఎంసిహెచ్) సూపరిండెంట్ తెలిపారు. అనుమతి లేకుండా నిరసన ప్రదర్శన చేపట్టడంతో జోక్యం చేసుకోవలసి వచ్చిన్నట్లు పోలీస్ ఉన్నతాధికారులు సమర్ధించుకొంటున్నారు.
More Stories
చదువుల్ని లోకకల్యాణం కోసం ఉపయోగించాలి
రిజర్వేషన్లకు ఆర్ఎస్ఎస్ వ్యతిరేకం కాదు
ఒక్క సీటు కోసం ఉగ్రవాద సంస్థకు కాంగ్రెస్ మద్దతు