* ఆర్టికల్ 370 రద్దయి ఏడేళ్లలో ప్రజాస్వామ్యం బలోపేతం
ఆర్టికల్ 370 రద్దయి దాదాపు ఏడేళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో జమ్మూకశ్మీర్ లో ఉగ్రదాడులు దాదాపు 75 శాతం తగ్గడంతో పాటు రాళ్ల దాడులు ఘటనలు ఏకంగా 90 శాతం మేర క్షీణించినట్లు జమ్మూకశ్మీర్ పోలీసులు వెల్లడించారు. అయితే ఉగ్రవాదం మాత్రం పూర్తిగా అంతరించిపోలేదని, దాని వ్యూహం మాత్రమే మారిందని భద్రతా సంస్థలు హెచ్చరిస్తూనే ఉన్నాయి.
గతంలో కశ్మీర్ లోయలో పెద్ద ఎత్తున దాడులు, ఎన్కౌంటర్లు, నిరసనలు కనిపించేవి. ప్రస్తుతం మాత్రం రాజౌరీ, పూంఛ్, రియాసీ, కథువా, దోడా, కిష్ట్వార్, ఉదంపూర్ వంటి జమ్మూ ప్రాంతంలోని కొండలు, అటవీ ప్రాంతాల్లో చిన్న చిన్న ఉగ్రవాద బృందాలు దాడులకు పాల్పడుతున్నాయి. పెద్ద ఎత్తున దాడులకు బదులుగా ఇప్పుడు చిన్న బృందాలు లక్ష్యిత దాడులు, ఆకస్మిక దాడులకు పాల్పడుతున్నాయి.
భారీ నిరసనలు, బంద్లు, భద్రతా బలగాలపై మూకదాడులు ఇప్పుడు చాలా అరుదుగా మారాయి. అంత్యక్రియలు, ప్రజా సమూహాల్ని ఉగ్రవాద సంస్థలు వినియోగించుకునే పరిస్థితులు కూడా తగ్గాయి. జమ్మూకశ్మీర్ పోలీసుల వివరాల ప్రకారం 2022లో 151 ఉగ్రదాడులు నమోదవగా, ఇది 2025 నాటికి 35 కు తగ్గుముఖం పట్టాయి. ఇదే సమయంలో భద్రతా బలగాల ఆపరేషన్లలో హతమైన ఉగ్రవాదుల సంఖ్య 193 నుంచి 46 కు పడిపోయింది.
భద్రతా సిబ్బంది మరణాలు కూడా 30 నుంచి 17 కు పడిపోగా, పౌరుల ప్రాణ నష్టం కూడా గతంతో పోలిస్తే గణనీయంగా తగ్గింది. అధికారిక గణాంకాల ప్రకారం 2009 నుంచి 2019 ఆగస్ట్ 4 వరకు జమ్మూకశ్మీర్లో మొత్తం 1435 ఉగ్రదాడులు జరిగాయి. ఈ ఘటనల్లో 382 మంది పౌరులు, 672 మంది భద్రతా సిబ్బంది మరణించగా, 1827 మంది ఉగ్రవాదులు హతమయ్యారు.
అదే ఆర్టికల్ 370 రద్దయిన 2019 ఆగస్ట్ 5 తేదీ నుంచి చూస్తే ఈ 2026 ఆగస్ట్ 1 వరకు ఏడేళ్ల కాలంలో 652 ఉగ్రదాడులు జరిగాయి. ఈ కాలంలో 191 మంది మంది పౌరులు ప్రాణాలు కోల్పోగా, 213 మంది భద్రతా సిబ్బంది అమరులయ్యారు. ఇదే సమయంలో భారత సైన్యం 858 మంది ఉగ్రవాదుల్ని మట్టుబెట్టింది. 2026 ఏడాదిలో చూస్తే ఇప్పటివరకు కేవలం 12 ఉగ్రదాడులు జరిగాయి. ఏప్రిల్, జూన్ నెలల్లో ఎలాంటి ఉగ్రదాడులు నమోదు కాలేదు. ఈ ఏడాది జరిగిన ఘటనల్లో ఇద్దరు పౌరులు, ఇద్దరు భద్రతా సిబ్బంది మరణించగా 11 మంది ఉగ్రవాదులు హతమయ్యారు.
కాగా, శుక్రవారం రోజు కుల్గామ్ జిల్లాలో ఇద్దరు వలస కార్మికులపై జరిగిన దాడి కూడా ఉగ్రవాదుల కొత్త వ్యూహానికే ఉదాహరణ. ప్రజల్లో భయాందోళనలు సృష్టించాలన్న దురుద్దేశంతో బలహీన వర్గాల్ని లక్ష్యంగా చేసుకొని దాడులు చేస్తున్నారు. అయినప్పటికీ మెరుగైన నిఘా వ్యవస్థ, ఇంటెలిజెన్స్ ఆధారిత ఆపరేషన్ల వల్ల ఉగ్రవాదులు దీర్ఘకాలికంగా ఉగ్ర కార్యకలాపాలు నిర్వహించే అవకాశాలు గణనీయంగా తగ్గినట్లు చెబుతున్నారు.
ఆర్టికల్ 370ని తరచుగా గుర్తింపు, ప్రత్యేక హోదాకు చిహ్నంగా ప్రచారం చేశారు. అయితే, ఆచరణలో ఇది దేశంలోని మిగిలిన ప్రజలు అనుభవిస్తున్న సమాన అవకాశాలు, రాజ్యాంగ హక్కులను సాధారణ పౌరులకు దూరం చేస్తూ, ప్రధానంగా కొన్ని ప్రాంతీయ వంశపారంపర్య రాజకీయ పార్టీలకు మాత్రమే ప్రయోజనం చేకూర్చింది. ఇది దాదాపు ఏడు దశాబ్దాల పాటు విభజనవాద, వేర్పాటువాద వాదనలు వృద్ధి చెందడానికి వీలు కల్పించింది.
జమ్మూ & కాశ్మీర్లో ఉగ్రవాదం, రాడికలైజేషన్, అస్థిరతను రెచ్చగొట్టడానికి పాకిస్తాన్ అప్పటి రాజకీయ పరిస్థితులను పదేపదే ఉపయోగించుకుంది. నేడు, జమ్మూ & కాశ్మీర్ యువత శాంతి, విద్య, దేశ నిర్మాణ మార్గాన్ని అధిక సంఖ్యలో స్వీకరించారు. రాళ్ల దాడి, బంద్ల రాజకీయాల స్థానంలో డాక్టర్లు, ఇంజనీర్లు, పారిశ్రామికవేత్తలు, క్రీడాకారులు, శాస్త్రవేత్తలు, ఆవిష్కర్తలు మరియు సివిల్ సర్వెంట్లు కావాలనే ఆకాంక్షలు వెల్లివిరిశాయి.
యువ కాశ్మీరీలు భారతదేశ ప్రగతి, అభివృద్ధికి తాము కూడా దోహదపడతామని ఎక్కువగా గుర్తిస్తున్నారు. ఈ పరివర్తన ప్రతి రంగంలోనూ కనిపిస్తుంది. విద్యాసంస్థలు ఇప్పుడు ఏడాది పొడవునా ఎలాంటి అంతరాయం లేకుండా పనిచేస్తున్నాయి. విద్యార్థులు ఆత్మవిశ్వాసంతో తమ కలలను సాకారం చేసుకుంటూ, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో విజయవంతంగా పోటీ పడుతున్నారు.
అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన విశ్వవిద్యాలయాలు, కళాశాలలు, వైద్య సంస్థలు, బలమైన భారతదేశ నిర్మాణానికి కట్టుబడి ఉన్న నైపుణ్యం గల వృత్తి నిపుణుల తరాన్ని సృష్టిస్తున్నాయి. క్రీడా మౌలిక సదుపాయాలు విప్లవాత్మకమైన వృద్ధిని సాధించాయి. జమ్మూ & కాశ్మీర్ అంతటా ఆధునిక స్టేడియంలు, ఆట స్థలాలు, క్రీడా అకాడమీలు అభివృద్ధి చేస్తున్నారు. వేలాది మంది యువతీ యువకులు క్రీడా కార్యకలాపాలలో పాల్గొంటూ, జాతీయ, అంతర్జాతీయ పోటీలలో భారతదేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
జమ్మూ & కాశ్మీర్కు చెందిన పలువురు యువ క్రీడాకారులు ఇప్పుడు అత్యున్నత స్థాయిలలో పోటీ పడుతున్నారు, శాంతి నెలకొన్నప్పుడు ప్రతిభ వికసిస్తుందని ఇది నిరూపిస్తోంది. పర్యాటకం అపూర్వమైన శిఖరాలను చేరుకుంది, వేలాది కుటుంబాలకు ఉపాధి, ఆర్థిక అవకాశాలను కల్పించింది. జమ్మూ & కాశ్మీర్ భారతదేశంలోని అత్యంత ఆకర్షణీయమైన పర్యాటక ప్రదేశాలలో ఒకటిగా మారింది. ప్రతి సంవత్సరం లక్షలాది మంది సందర్శకులను స్వాగతిస్తోంది.
మెరుగైన రోడ్లు, సొరంగాలు, జాతీయ రహదారులు, అనుసంధాన ప్రాజెక్టులు మారుమూల ప్రాంతాలను ప్రధాన ఆర్థికాభివృద్ధికి చేరువ చేశాయి. కొత్త వైద్య కళాశాలలు, ఆధునిక ఆసుపత్రులు, మెరుగైన ఆరోగ్య సంరక్షణ సౌకర్యాల స్థాపనతో ఆరోగ్య సంరక్షణ మౌలిక సదుపాయాలు గణనీయంగా మెరుగుపడ్డాయి. భారత ప్రభుత్వం ప్రారంభించిన అతిపెద్ద సంక్షేమ, ఆరోగ్య సంరక్షణ కార్యక్రమాలలో కొన్నింటి నుండి జమ్మూ & కాశ్మీర్ ప్రజలు నేడు ప్రయోజనం పొందుతున్నారు.
అయితే, స్థానిక ప్రజలు విలక్షణమైన సాంస్కృతిక ప్రతిపత్తిని కొనసాగిస్తూ, గతంలో లోయ నుండి ప్రాణభయంతో ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిన కాశ్మీర్ పండిట్ లు తిరిగి చేరుకొని, ఇక్కడ జీవించగల పరిస్థితులు నెలకొల్పడంలో ఇంకా మరెంతో చేయాల్సి ఉంది. నిరాశ్రయులై, స్థానికంగా దుర్భర జీవనం సాగిస్తున్న కాశ్మీరీ పండిట్ లకు అర్ధవంతమైన పునరావాసం కల్పించేదిశగా ప్రయాణించాలి. గతంలో ప్రధాని నరేంద్ర మోదీ హామీ ఇచ్చిన పూర్తిస్థాయి రాష్ట్ర హోదా పునరుద్దరణకు వేగవంతమైన చర్యలు చేపట్టాల్సి ఉంది.
కేవలం లక్షల సంఖ్యలో భద్రతా దళాలను మోహరింపచేయడం ద్వారా పూర్తి శాంతియుత వాతావరణం పునరుద్ధరించడం సాధ్యం కాదు. స్థానిక ప్రజలలో విశ్వాసం చూరగొనేందుకు పాలనా యంత్రంగం అర్ధవంతమైన చర్యలు చేపట్టాలి.

More Stories
ఇథనాల్ ఉత్పత్తి విస్తరణకు రైతు నాయకుల మద్దతు
ఆపరేషన్ త్రిశూల్ తో స్వదేశంకు 36 దేశాల నుంచి 274 మంది నేరస్థులు
సునేత్రా పవార్ పై “”గుంగీ గుడియా” వాఖ్యల రాజకీయ దుమారం