ఇథనాల్ ఉత్పత్తి విస్తరణకు రైతు నాయకుల మద్దతు

ఇథనాల్ ఉత్పత్తి విస్తరణకు రైతు నాయకుల మద్దతు
కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌తో  మంగళవారం కృషి భవన్‌లో జరిగిన సమావేశంలో, దేశవ్యాప్తంగా ఉన్న రైతు నాయకులు ఇథనాల్ ఉత్పత్తి విస్తరణకు తమ బలమైన మద్దతును తెలిపారు. రైతుల ఆదాయాన్ని పెంచడానికి, భారతదేశ ఇంధన భద్రతను బలోపేతం చేయడానికి ఇది ఒక ప్రధాన అవకాశమని వారు అభివర్ణించారు. 
 
పంజాబ్, హర్యానా, మహారాష్ట్ర, ఉత్తర ప్రదేశ్, మధ్యప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, ఇతర రాష్ట్రాల ప్రతినిధులతో కూడిన అఖిల భారత కిసాన్ సమన్వయ కమిటీ (ఎఐకెసిసి) ప్రతినిధి బృందం, ఇథనాల్, రైతుల ఆదాయం, కనీస మద్దతు ధర (ఎం ఎస్ పి), వ్యవసాయ మార్కెట్లు, ప్రతిపాదిత జాతీయ వ్యవసాయ విధానానికి సంబంధించిన అంశాలపై మంత్రితో సవివరంగా చర్చించింది. 
 
ఈ విధానం రైతు కేంద్రీకృతంగా ఉండి, మధ్యవర్తులు లేదా కంపెనీలకు కాకుండా ప్రయోజనాలు నేరుగా రైతులకు చేరేలా నిర్ధారిస్తే, ఇథనాల్ ఉత్పత్తికి తాము మద్దతు ఇస్తామని రైతు నాయకులు తెలిపారు. ఇథనాల్‌ను వ్యవసాయానికి ఒక కొత్త అవకాశంగా వారు అభివర్ణించారు. దేశ ఇంధన, శక్తి రంగానికి సరఫరా చేయడం ద్వారా చెరకు, మొక్కజొన్న, వరి వంటి పంటలు సాంప్రదాయ వ్యవసాయ మార్కెట్లకు మించి అదనపు మార్కెట్‌ను పొందగలవని వారు పేర్కొన్నారు. 
 
ప్రతినిధి బృందం ప్రకారం, ఇథనాల్ ఉత్పత్తిని విస్తరించడం వల్ల వ్యవసాయ ఉత్పత్తులకు ఎక్కువ మంది కొనుగోలుదారులు ఏర్పడతారు, రైతులకు మెరుగైన ధర లభిస్తుంది. నిల్వ, పంట పాడైపోవడం వంటి సమస్యలు తగ్గుతాయి. తాము ఇథనాల్‌కు వ్యతిరేకం కాదని, అయితే ముడి పంటలకు సరసమైన ధరలకు హామీ ఇచ్చే, రైతుల ప్రయోజనాలను కాపాడే విధానాన్ని కోరుకుంటున్నామని నాయకులు నొక్కి చెప్పారు. 
 
సోషల్ మీడియా, ఇతర వేదికలపై ఇథనాల్ గురించి ప్రచారంలో ఉన్న తప్పుడు సమాచారంపై కూడా ప్రతినిధి బృందం ఆందోళన వ్యక్తం చేసింది. వ్యవసాయానికి ఇథనాల్ వల్ల కలిగే ప్రయోజనాలు, అధిక నీటి వినియోగం గల పంటల నుండి కరువును తట్టుకునే ప్రత్యామ్నాయాల వైపు మళ్లడాన్ని ప్రోత్సహించడంలో దాని పాత్రతో సహా, ఇథనాల్ గురించి వాస్తవ సమాచారాన్ని వ్యాప్తి చేయడానికి రైతు సంఘాలతో కలిసి పనిచేయాలని కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖను రైతు ప్రతినిధులు కోరారు. 
 
ముఖ్యంగా యువ రైతులలో ఉన్న అపోహలను తొలగించడానికి డిజిటల్ కంటెంట్, లఘు వీడియోలు, క్షేత్రస్థాయి అవగాహన ప్రచారాలను ఉపయోగించాలని వారు సూచించారు. ఈ సూచనలపై స్పందిస్తూ, ఇథనాల్ కార్యక్రమం వల్ల కలిగే ప్రయోజనాలు మొత్తం విలువ గొలుసులోని అందరికీ చేరేలా చూడటానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఇందులో రైతులకు అత్యధిక వాటా లభిస్తుందని చౌహాన్ భరోసా ఇచ్చారు. 
 
విధాన రూపకల్పనలో రైతులను భాగస్వాములుగా ఆయన అభివర్ణించారు. కృషి భవన్ ద్వారాలు వారికి ఎల్లప్పుడూ తెరిచే ఉంటాయని పునరుద్ఘాటించారు. దేశ ఇంధన భద్రతను, రైతుల ఆదాయాలను బలోపేతం చేసే సామర్థ్యం ఇథనాల్‌కు ఉందని చౌహాన్ తెలిపారు.  ఇథనాల్‌కు సంబంధించిన విధానాలను సమీక్షించేటప్పుడు ప్రభుత్వం రైతుల అభిప్రాయాలను జాగ్రత్తగా పరిగణనలోకి తీసుకుంటుందని, అలాగే మొక్కజొన్న, వరి, చెరకు, ఇతర పశుగ్రాస పంటలను పండించే రైతుల ప్రయోజనాలు, పంట ధరలు, డిమాండ్ మధ్య సమతుల్యతను కాపాడటానికి కృషి చేస్తుందని ఆయన ప్రతినిధి బృందానికి హామీ ఇచ్చారు. 
 
ఇథనాల్‌కు సంబంధించి వ్యాపిస్తున్న తప్పుడు సమాచారాన్ని ఎదుర్కోవడానికి ప్రభుత్వం శాస్త్రీయ అధ్యయనాలు, సాంకేతిక ఆధారాలపై ఆధారపడుతుందని, ఈ విషయంపై వాస్తవ ఆధారిత చర్చలను ప్రోత్సహించడానికి రైతు సంఘాలతో సంప్రదింపులు కొనసాగిస్తుందని కూడా మంత్రి తెలిపారు.  సమావేశాన్ని ముగిస్తూ, ఏఐకేసీసీ ప్రతినిధులు మాట్లాడుతూ, తాము ప్రభుత్వ సందేశాన్ని దేశవ్యాప్తంగా ఉన్న గ్రామాలకు తీసుకువెళ్తామని, ఇథనాల్‌పై మరింత అవగాహన కల్పించడానికి అధికారులతో కలిసి పనిచేస్తామని, స్వచ్ఛమైన, మరింత సురక్షితమైన ఇంధన వనరుల వైపు భారతదేశ పరివర్తనకు మద్దతునిస్తూ రైతుల ఆదాయాన్ని పెంచే లక్ష్యంతో ఉన్న విధానాలను బలోపేతం చేస్తామని చెప్పారు.