ఇందిరా ఎమర్జెన్సీ విధింపు వెనుక సోవియట్ యూనియన్!

 టి వి గోవిందరావు

నేటికి మన దేశంలో అత్యవసర పరిస్థితి విధించి 48 సంవత్సరాలైంది. నాడు ప్రధాన మంత్రి ఇందిరా గాంధీ తన పదవిని  కాపాడుకోవడానికి భారత దేశమంతటా అత్యవసర పరిస్థితిని విధించారు. అపుడు నేను 8వ తరగతి చదువుకుంటున్నాను. రావులపాలెం జిల్లా పరిషత్ హైస్కూల్ లో ఉదయం పూట 9 గంటలకు పదిహేను నిమిషాల పాటు అసెంబ్లీ జరిగేటప్పుడు ప్రతీ రోజు నాటి ప్రధానోపాధ్యాయులు భమిడిపాటి రామచంద్రుడు తన ప్రసంగంలో చీటికీ మాటికీ ఎమర్జెన్సీ బీ కేర్ ఫుల్ అనేవారు. అప్పట్లో నాకు అర్ధం కాలేదు. తర్వాత కాలంలో అర్ధమైంది.

రాజ్యాంగంలోని 356 అధికరణం అత్యవసర పరిస్థితిని విధించే అధికారం కేంద్ర మంత్రిమండలికి కట్టబెడుతున్నది. చాలా మందికి తెలియని విషయం అప్పటికే 352 అధికరణం ప్రకారం ఒక రకం అత్యవసర పరిస్థితి అప్పటికే అమలులోనే ఉంది. అదే ఎక్స్‌టర్నల్‌ ఎమర్జెన్సీ. 1971 పాకిస్తాన్‌ ‌యుద్ధం సమయంలో విధించారు. అంటే 1975 నాటి అత్యవసర పరిస్థితి కరవులో అధికమాసం వంటిదే.

ఏమైనా రాజ్యాంగంతో ముడిపడి ఉన్న అంశం కాబట్టి ప్రధాని సలహా సంప్రదింపులు చేయడం సహజం. అయితే నాటి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సిద్దార్థ శంకర్‌రే ఒక్కరి సలహాతోనే ఇందిర అంత పెద్ద నిర్ణయం తీసుకున్నారా? అంతటి అవాంఛనీయమైన అడుగు వేశారా? గడచిన 48 సంవత్సరాల నుంచి ఈ ప్రశ్న నలుగుతూనే ఉంది. నాటి జాతీయ, అంతర్జాతీయ పరిస్థితులను బట్టి ఆ నిర్ణయం గురించిన పలు వాదాలు వినిపిస్తూనే ఉన్నాయి.

‘శ్రీమతి ఇందిరాగాంధీ సోవియెట్‌ ‌నాయకుల సలహాతో దేశంలో అత్యవసర పరిస్థితి విధించినట్లు అర్ధమైంది. సోవియెట్‌లో అసంతృప్తిని ఏ మాత్రం సహించలేరు. అసంతృప్తిని వ్యక్తం చేసిన వారిని ఇక ఎన్నటికీ తిరిగిరాని విధంగా సైబీరియాకు పంపిస్తారు. ఇక్కడా ప్రతిపక్షాల వారిని అదే విధంగా జైళ్ల పాలు చేశారు…’

ఈ వాక్యాలు ‘క్వెస్ట్ ‌ఫర్‌ ‌ఫ్రీడమ్‌ : ‌స్టోరీ ఆఫ్‌ ఏన్‌ ఎస్కేప్‌’ ‌గ్రంథం (తెలుగులో స్వేచ్ఛ కోసం: ఒక విహంగయాత్ర, అను: డాక్టర్‌ ‌జె. చెన్నయ్య, తెలుగు అకాడమి, తెలుగు విశ్వవిద్యాలయం ప్రచురణ, 2003, పే.34) లోనివి. అకాలీదళ్‌ ‌ప్రముఖుడు, పంజాబ్‌ ‌మాజీ ముఖ్యమంత్రి, మాజీ కేంద్రమంత్రి, మాజీ గవర్నర్‌ ‌సుర్జీత్‌ ‌సింగ్‌ ‌బర్నాలా ఈ గ్రంధం రాశారు.
ఆయన కూడా అత్యవసర పరిస్థితిలో అరెస్టయి పంజాబ్‌ ‌జైళ్లలో దుర్భర జీవితం అనుభవించారు. అత్యవసర పరిస్థితి విధింపులో సోవియెట్‌ ‌రష్యా ప్రమేయం ఉందని ఇంత నేరుగా ఎవరూ ఆరోపించక పోయినా, ఇదే వాస్తవాన్ని ధ్వనింప చేసే పలు అధారాలు ఇంకొందరు అప్పుడప్పుడూ బయట పెట్టారు.
 
కాలిఫోర్నియా విశ్వవిద్యాలయానికి చెందిన రాజన్‌ ‌మేనన్‌ ‘ఇం‌డియా అండ్‌ ‌ది సోవియెట్‌ ‌యూనియన్‌:ఏ ‌న్యూ స్టేజ్‌ ఆఫ్‌ ‌రిలేషన్స్’ ‌పత్రంలో (1978) రాసిన అంశాలు కూడా బార్నాలా వెల్లడించిన అభిప్రాయానికి సమీపంగా ఉంటాయి.  ఇందిరాగాంధీ విధించిన అత్యవసర పరిస్థితి గురించి సోవియెట్‌ ‌రష్యా పత్రికలు అత్యుత్సాహం ప్రదర్శించాయి అనడానికి తగ్గట్టుగానే వ్యవహ రించాయని మేనన్‌ ‌రాశారు.
 
అత్యవసర పరిస్థితిని తొలగించి, మార్చి 21, 1977న లోక్‌సభకు ఎన్నికలు జరిగినప్పుడు కూడా జనతా పార్టీ నాయకులను మితవాదులుగా, తిరోగమన శక్తులుగానే సోవియెట్‌ ‌రష్యా భావించిందని మేనన్‌ ‌చెబుతారు. మొరార్జీ దేశాయ్‌ ‌ప్రధాని కావడం కూడా ఆ దేశానికి రుచించని విషయంగానే కనిపిస్తుంది. ఇందుకు సంబంధించి మొరార్జీ- కృశ్చేవ్‌ల ఉపాఖ్యానం ఒకటి ప్రసిద్ధి చెందింది. మొదటి నుంచి మొరార్జీ వామపక్ష వాదానికి వ్యతిరేకులని పేరు.
 
1960లో మొరార్జీ రష్యాలో పర్యటించినప్పుడు ‘మిస్టర్‌ ‌దేశాయ్‌! ‌మీరు కమ్యూనిజాన్ని వ్యతిరేకిస్తారు. అలా వ్యతిరేకించడం కంటే, మీరనుకుంటున్న దెయ్యాలు ఇక్కడ ఏం చేస్తున్నాయో ఒకసారి పరిశీలిస్తే నిజం మీకే తెలుస్తుంది’ అని మాటామంతీ సందర్భంగా మొరార్జీతో సాక్షాత్తు కృశ్చేవ్‌ అన్నారు (ఈ విషయాన్ని మొరార్జీ ఆత్మకథ ‘ది స్టోరీ ఆఫ్‌ ‌మై లైఫ్‌’‌లో రాసుకున్నారు).
 
ఇందిరను ఒప్పించిన కెజిబి
 
సోవియెట్‌ ‌రష్యా పాలకుల సలహాతో ఇందిర అత్యవసర పరిస్థితిని విధించారు అనుకోవడం వేరు. ఆ దేశ వివాదాస్పద గూఢచారి సంస్థ కేజీబీ ఇందిరను అందుకు ఒప్పించి, విపక్ష నేతలందరినీ జైళ్లలో వేయించింది అనడం వేరు. కానీ ఒకటి నుయ్యి, రెండు గొయ్యి. కేజీబీ తమ ఏజెంట్లను ప్రయోగించి ఆ పని చేసిందన్న వాదన ఉంది. ‘ది మిత్రొఖిన్‌ ఆర్కైవ్స్ 2: ‌ది కేజీబీ అండ్‌ ‌ది వరల్డ్’ ‌పుస్తకం ఇదే చెబుతోంది.
 
రచయిత వాజిలి మిత్రొఖిన్‌. ఇతడు కేజీబీ పత్రాల పరిశోధనలో అపార అనుభవం కలిగినవాడు. ఈ గ్రంథం ప్రకారం ఇందిర హయాంలో కేజీబీ భారతీయ పాలనా వ్యవస్థలో ఎంతగా చొరబడిందంటే, లంచాలు పడేసి కేంద్ర మంత్రుల నుంచి రహస్యాలు కొనుక్కునేది. ఇందులో కేజీబీ జనరల్‌ ఒలెఫ్‌ ‌కులుగిన్‌ ‌చెప్పిన విషయాలు ఎక్కువ.  భారత్‌లో కార్యకలాపాల కోసం కులుగిన్‌ను 1970లో ఆ సంస్థ నియమించింది.
 
‘ఇందిరాగాంధీ 1975లో భారత్‌లో అత్యవసర పరిస్థితిని విధించేటట్టు చేయడంలో మా ఏజెంట్లు విజయవంతంగా పని చేశారు. అదే విపక్షాల నాయకులను జైళ్లకు పంపించడానికి ఆమె ప్రభుత్వానికి అధికారం కల్పించింది. పౌర హక్కులను రద్దు చేయడానికీ, పత్రికల మీద 19 మాసాల పాటు సెన్సార్‌షిప్‌ ‌విధించడానికి అవకాశం చూపింది’ అని కులుగిన్‌ ‌చెప్పాడు.
 
ఇతడు చెప్పినది సత్యదూరం కాదని అనుకోవడానికి కావలసిన పరిస్థితులు నాడు భారత్‌లో ఉన్నాయనే అనిపిస్తుంది. ‘ది మిత్రొఖిన్‌ ఆర్కైవ్స్ 2: ‌ది కేజీబీ అండ్‌ ‌ది వరల్డ్’ ‌పుస్తకంలోని విషయాల ఆధారంగా ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌ ‌సెస్టెంబర్‌ 18, 2005‌లో ఒక లోతైన వార్తా కథనం ప్రచురించింది.
 
ఇందిర హయాంలో కేజీబీ జోక్యం తక్కువేమీ కాదు. కులుగిన్‌ ‌చెప్పిన అనుభవాలను బట్టి, మిత్రొఖిన్‌ ‌భారత్‌ ‌మీద ఒక దారుణమైన వ్యాఖ్య చేశాడు. ‘చూడబోతే దేశం మొత్తం అమ్ముడుపోవడానికి సిద్ధంగా ఉన్నట్టు అనిపించింది’ అన్నాడాయన. కేంద్రమంత్రులే దేశ రహస్యాలను అమ్మకానికి పెడితే ఎవరైనా ఇంకెలాంటి అభిప్రాయానికి రాగలరు? మూడో ప్రపంచ దేశాలలోకి ఎలా చొచ్చుకుపోవచ్చునో భారత్‌ ఒక నమూనాగా ఉంటుందని అతడి అభిప్రాయం.
 
అంతేనా! తన ప్రత్యర్థి, అమెరికా నిఘా సంస్థ సిఐఏను మించి కేజీబీ భారతీయ ఉన్నతాధి కారులలో తమ మనుషులను చొప్పించగలిగిందని కూడా అతడు చెప్పాడు. ఇందిరా హయాంలో ఒక అంటువ్యాధిలా ప్రబలి ఉన్న అవినీతిని కేజీబీ శక్తికొద్దీ ఉపయోగించుకున్నదని ఈ పుస్తకం ప్రకటిస్తుంది.
 
ఇందిరాకు కెజిబి నుండి ముడుపులు!
 
భారత ప్రభుత్వంలో నిఘా విభాగంలో, రక్షణ, విదేశ వ్యవహారాల శాఖలలో, పోలీసు యంత్రాంగంలో తమకు సాయం చేయడానికి (సోర్స్) ఉన్నారని కూడా కులుగిన్‌ ‌చెప్పాడు. ఒక సందర్భంలో రూ. 20 లక్షలు   రహస్య కానుక రష్యా నుంచి నేరుగా ఇందిరాకు అందిందని ఈ పుస్తకంలో రాశారు. పార్టీ కార్యకలాపాల కోసం నిరంతరం ప్రధాని నివాసానికి సూట్‌కేసులతో డబ్బు చేరేదని కూడా రాశారు.
 
`మాస్కోలోని భారత రాయబార కార్యాలయంలో కేజీబీ హనీ ట్రాప్‌ ‌ద్వారా (మహిళలను ఎరవేయడం) ఎంతగా చొచ్చుకు పోతున్నదో నెహ్రూగాని, ఇంటెలిజెన్స్ ‌బ్యూరోగాని గ్రహించలేదు’ అని మిత్రొఖిన్‌ ‌పుస్తకంలోని విషయాలు ఆధారంగా రాసిన విశ్లేషణలో ‘ది టెలిగ్రాఫ్‌ ఆన్‌లైన్‌’ (‌సెప్టెంబర్‌ 9, 2005) ‌పేర్కొన్నది.
 
నిజానికి ఈ విశ్లేషణ ప్రధానంగా హనీట్రాప్‌ ‌కోణాన్ని ఆవిష్కరించింది. స్టాలిన్‌ ‌మరణం తరువాత 1953లో ఇందిర తొలిసారి రష్యాలో పర్యటించినప్పుడే కేజీబీ కన్ను ఆమె మీద పడింది. అక్కడ నుంచి రాసిన లేఖను బట్టి ఆమె కూడా కేజీబీ వలలో పడిపోయారనే అనిపిస్తుంది. ఈ అంశం కూడా టెలిగ్రాఫ్‌ ‌వెలువరించింది.

మరి, అవినీతికి వ్యతిరేకంగా లోక్‌నాయక్‌ ఉద్యమిస్తే ఎందుకు ఆయన మీద దేశ వ్యతిరేక ముద్ర వేయడం? సోవియెట్‌ ‌రష్యా పట్ల భారత్‌ ఎం‌త అణుకువగా ఉండేదంటే, అఫ్ఘానిస్తాన్‌ ‌మీద దాడిని కూడా ఖండించలేదు. ఈ విషయాలని యథా ప్రకారం అటు కాంగ్రెస్‌, ఇటు సీపీఐ ఖండించాయి. అయితే కాంగ్రెస్‌ ‌ప్రతినిధి అభిషేక్‌ ‌సింఘ్వి చిత్రమైన వ్యాఖ్య చేశారు- ‘ఈ విషయాలను ఎవరూ నిరూపించలేరు. ఎందుకంటే వారెవరూ ఇప్పుడు మన మధ్య లేరు.’

యూపీఏ ప్రధాని డాక్టర్‌ ‌మన్మోహన్‌ ‌సింగ్‌ ‌కార్యదర్శి సంజయ్‌ ‌బారు రాసిన వ్యాసం (జూన్‌ 6, 2018, ‌డెయిలీ ఓ)లో ఇంకొన్ని ఆసక్తికరమైన అంశాలు ప్రతిపాదించారు. ఇవి కూడా వామపక్షం, ఇందిరకు సంబంధించిన అంశాలే. అత్యవసర పరిస్థితి నేపథ్యంలోనివే. నెహ్రూ అలీన విధానాన్ని నమ్మారు. తాను ఏ దేశ కూటమికి చెందని దేశంగా భారత్‌ను నిలబెట్టానని ఇందిర తనను తాను నమ్మించుకున్నారు. కానీ ఆమె చేసింది- ప్రచ్ఛన్న యుద్ధం నేపథ్యంలో భారత్‌ను సోవియెట్‌ ‌శిబిరంలోకి చేర్చడమే అన్నారు సంజయ్‌ ‌బారు.

 
అటకెక్కించిన అలీన విధానం
 
1971లో సోవియెట్‌ ‌రష్యాతో చేసుకున్న ఒప్పందం నెహ్రూ ప్రతిపాదిత అలీన విధానాన్ని అటకెక్కించిందనే అనుకోవాలి. అత్యవసర పరిస్థితి అంటే నెహ్రూ విదేశాంగ విధానం మార్పులో వచ్చిన అగాధమేనని సంజయ్‌ ‌నిష్కర్షగానే చెప్పారు. చిలీ పాలకుడు సాల్వెడార్‌ అలెండి తరువాత నిన్నే అమెరికా లక్ష్యంగా చేసుకుంది అంటూ క్యూబా అధ్యక్షుడు ఫైడెల్‌ ‌కాస్ట్రో చేసిన హెచ్చరికతోనే ఇందిరాగాంధీ అగమేఘాల మీద అత్యవసర పరిస్థితిని విధించారన్న వాదన గురించి సంజయ్‌ ‌బారు ప్రస్తావించారు.
 
కాస్ట్రో సలహా అనేది ఒక వాదనగానే ఆయన ప్రతిపాదించినప్పటికి ఆ రోజుల్లో ఇందిర ప్రతి చిన్న విషయానికి తనను హత్య చేసి, భారత్‌ను అస్థిరం చేయడానికి విదేశీ హస్తం పని చేస్తోందని ఆరోపించేవారు. ఈ అంశానికి ఆయన ఇచ్చిన కొసమెరుపు చిత్రంగానే ఉంటుంది.
 
‘కాస్ట్రో ఇచ్చిన సలహా అత్యవసర పరిస్థితిని విధించేందుకు (ఇందిరను) ప్రేరేపిస్తే, అప్పుడే ఎన్నికైన అమెరికా అధ్యక్షుడు జిమ్మి కార్టర్‌ ఇచ్చిన సలహా అది ఎత్తివేయడానికి మార్గం చూపింది’. ఇవే కాకపోయినా అత్యవసర పరిస్థితి విధింపు వెనుక అనేక అంశాలు ఉన్న మాటను కాదనలే మని సంజయ్‌ ‌బారు అన్నారు.
 
 కానీ ఇందిర ప్రచార సలహాదారు హెచ్‌వై శారదాప్రసాద్‌ ‌చేసిన వ్యాఖ్య మాత్రం అద్భుతమే. అది, ‘తన ప్రధానమంత్రి పదవి నుంచి తననే కూల్చడానికి ఇందిరాగాంధీ స్వయంగా చేసుకున్న కుట్ర’. మిగతా వాదాలన్నింటి కంటే చరిత్రలో రుజువైన వాదన ఇదే అనిపిస్తుంది.
అరెస్టయిన వారిలో (1975 జూన్‌ 25 ‌రాత్రి)  ‘అమెరికా అనుకూలురు’ ఎక్కువగా కనిపించడం యాదృచ్ఛికమే అయినా, రష్యాకు అనుకూలంగా ఉండే సీపీఐ నుంచి ఒక్కరు కూడా అరెస్టు కాలేదన్న విషయం గమనార్హమే.
 
భారతదేశంలోని నాటి కొన్ని పరిస్థితులు అత్యవసర పరిస్థితి విధింపునకు దోహదం చేశాయని నమ్మించాలని చూసినా, దేశానికి బయట ఉన్న వాతావరణం కూడా తోడైంది. అదే ప్రచ్ఛన్నయుద్ధం. మరొక యాదృచ్ఛిక అంశం కూడా ఉందని అనుకోవచ్చు. 1977 మార్చి ఆఖరున జనతా ప్రభుత్వం ఏర్పడింది. మొదటి నుంచి జనతాను, ఆ నాయకులను సోవియెట్‌ ‌రష్యా పత్రికలు మితవాదులు, తిరోగమనవాదులనే భావించాయి.

ఈ నేపథ్యంలోనే మొరార్జీ ప్రధాని కాగానే 1978 జనవరిలో జిమ్మి కార్టర్‌ ‌భారత్‌లో పర్యటించారు. ఆ సమయంలో నాటి విదేశ వ్యవహారాల మంత్రి అటల్‌ ‌బిహారీ వాజపేయి చేసిన వ్యాఖ్య ఎన్నతగినది. భారత్‌ ఇప్పుడే ‘నిజమైన అలీన విధానం’ పాటిస్తున్నదని అన్నారాయన. అంటే ఇందిర అనుసరించిన వామపక్ష అలీన విధానం కాదని చెప్పడమే. కాబట్టి అత్యవసర పరిస్థితి వేళ ఇందిర రష్యా నుంచి సలహాలు స్వీకరించే పరిస్థితిలోనే ఉన్నారనుకోవచ్చు.

కమ్యూనిస్టులకు ఒక లక్షణం ఉంది. జరిగిన తప్పును కొన్ని ముసుగులతో, తాత్త్విక తొడుగులతో కొన్ని జన్మల తరువాతైనా అంగీకరిస్తారు. కలకత్తా డేట్‌లైన్‌తో జూన్‌ 27, 2015‌న ది హిందూలో వెలువడిన వార్త అలాంటిదే.

1975 సమయంలో రాజకీయ పరిస్థితిని అంచనా వేయడంలో పార్టీ విఫలమైందని అత్యవసర పరిస్థితిని సమర్ధించడం రాజకీయ తప్పిదమని సీపీఐ జనరల్‌ ‌సెక్రటరీ సురవరం సుధాకరరెడ్డి ఇచ్చిన ప్రకటన అది. అది చాలా పెద్ద రాజకీయ తప్పిదమని గురుదాస్‌ ‌దాస్‌గుప్తా కూడా అన్నారు. తప్పులు ఒప్పు కుంటున్నా రహస్యాలు మాత్రం కాపాడుకుంటూనే ఉన్నారు.

భారతదేశంలో 3 సార్లు జాతీయ అత్యవసర పరిస్థితిని ప్రకటించారు.

*1962 నుండి 1968 వరకు: భారతదేశం-చైనా యుద్ధం సమయంలో, “భారతదేశం యొక్క భద్రత” “బాహ్య దురాక్రమణతో బెదిరింపు”గా ప్రకటించబడినప్పుడు.
* 1971: ఇండో-పాకిస్తాన్ యుద్ధ సమయంలో. అప్పట్లో వి.వి.గిరి రాష్ట్రపతి.
* 1975 నుండి 1977 వరకు: రాజకీయ అస్థిరత యొక్క వివాదాస్పద పరిస్థితుల్లో. “అంతర్గత భంగం” ఆధారంగా అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. మూడో ఎమర్జెన్సీ సమయంలో ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ అధ్యక్షుడిగా ఉన్నారు.