తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు గతంలో మాదిరిగా డిసెంబర్ లో కాకుండా నవంబర్ లోనే జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.. వాస్తవానికి ప్రస్తుత అసెంబ్లీ గడుపు డిసెంబర్ ఏడో తేది వరకూ ఉంది. ఆ లోగానే ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. దీంతో ఎన్నికల కమిషన్ నవంబర్ లోనే ఎన్నికలు నిర్వహించాలనే యోచనలో ఉన్నట్లు వెల్లడించింది.
ఎన్నికల సంసిద్ధతకు సంబంధించి రాష్ట్రంలో మూడు రోజుల పాటు పర్యటించిన ఈసీ బృందం ఉన్నతాధికారులతో వరుస భేటీలు నిర్వహించింది. టైం ప్రకారం ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని సూచించినట్లు సమాచారం. దీంతో గత ఎన్నికల కంటే ముందే ఎన్నికలు జరుగుతాయని కూడా అధికారులకు వెల్లడించింది.. రాష్ట్రంలో పర్యటించిన ఎలక్షన్ కమిషన్ బృందంలో సీనియర్ డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ ధర్మేంద్ర శర్మ, ఆర్ కే గుప్తా, సంజయ్ కుమార్, అండర్ సెక్రటరీ అవినాశ్ కుమార్, ప్రిన్సిపల్ సెక్రటరీ హిర్దేశ్ కుమార్, ఇతర డిప్యూటీ కమిషనర్లు ఉన్నారు. ఈ బృందం మూడు రోజుల కిందట హైదరాబాద్ కు వచ్చింది.
రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి, కలెక్టర్లు, ఐటీ, పోలీసు ఉన్నతాధికారులతో రెండు రోజుల పాటు వరుస సమావేశాలు నిర్వహించింది. రాష్ట్రంలో ఎన్నికల నిర్వహణకు సంబంధించి చర్చించింది. ఎన్నికల కమిషన్ కొత్తగా తీసుకువచ్చిన సాంకేతికత, కొత్త అప్లికేషన్ల వాడకంపై అధికారులకు అవగాహన కల్పించింది.
ఓటర్ జాబితా, నోటిఫికేషన్, ఎన్నికల కోడ్ అమలు, పోలీస్ చెక్ పాయింట్ల ఏర్పాటు, ఈవీఎంల భద్రత తదితర అంశాలపై రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులతో ఈసీ బృందం చర్చించింది.
అదేవిధంగా ఎన్నికల ఏర్పాట్లలో భాగంగా మూడేండ్లు ఒకే చోట ఉన్న అధికారుల బదిలీలు తొందరగా చేపట్టాలని ఆదేశించింది. ఈ ప్రక్రియ ఆగస్ట్ లోనే పూర్తి చేయాలని కోరింది. దాంతో అక్టోబర్ లోనే ఎన్నికల షెడ్యూల్ పై ఒక ప్రకటన వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. దీంతో ఆక్టోబర్ నుంచే ప్రభుత్వ కార్యకలాపాలు, కొత్త సంక్షేమ పథకాలకు బ్రేక్ పడే అవకాశం ఉంది.
More Stories
హిమాచల్లో సుఖు సర్కారు కుప్పకూలిపోవచ్చు
ఇంగ్లాండ్ మ్యాచ్లో రికార్డులు సృష్టిస్తున్న జైస్వాల్
రెండు చోట్లా ఓటు ఉంటే క్రిమినల్ చర్యలు