సీబీఐకి చిక్కిన పరారీలో ఉన్న సిగ్నల్ ఇంజనీర్‌ అమీర్‌ఖాన్‌

దేశవ్యాప్తంగా తీవ్ర విషాదాన్ని మిగిల్చిన ఒడిశా రైలు ప్రమాద ఘటన దర్యాప్తులో పరారీలో ఉన్న సిగ్నల్ జూనియర్ ఇంజనీర్‌ అమీర్‌ఖాన్‌ను సీబీఐ అధికారులు పట్టుకున్నారు. అనంతరం తదుపరి విచారణను జరుపుతున్నారు.  కేసు విచారణలో భాగంగా గతంలో అమీర్‌ఖాన్‌ను ప్రశ్నించిన అధికారులు మరోసారి విచారణ జరిపేందుకు వెళ్లగా ఇంటికి తాళం వేసి ఉంది. దీంతో ఆ ఇంటిని సీజ్ చేసిన సీబీఐ అధికారులు వేట కొనసాగించి ఎట్టకేలకు అమీర్‌ఖాన్‌ ఆచూకీ గుర్తించారు.
 
అసలు రైలు ప్రమాదం జరగడానికి కారణాలేంటి? దానికి సంబంధించిన పూర్తి వివరాల కోసం గతంలోనే అమీర్‌ఖాన్‌ను సీబీఐ ప్రశ్నించింది. అయితే ఆ తర్వాత అమీర్‌ఖాన్‌పై సీబీఐ బృందానికి పలు అనుమానాలు ఉండగా, అతని కదలికలపై నిఘా వేసింది. దీంతో మరోసారి ప్రశ్నించేందుకు వెళ్లగా, అతను కుటుంబంతో సహా పారిపోయాడని గుర్తించారు.
 
దీంతో సోరో ప్రాంతంలో అన్నపూర్ణ రైలు మిల్లు వద్ద ఉన్న అమీర్‌ఖా‌న్ అద్దె ఇల్లును సీజ్ చేశారు. అమీర్ ఖాన్ స్వస్థలం సహా మిగిలిన వ్యక్తిగత వివరాలను సీబీఐ అధికారులు బయటికి వెల్లడించడం లేదు. అనంతరం సోరో ప్రాంతంలోని తెంటెయ్‌ ఛక్‌లో ఉన్న బాహానాగా స్టేషన్‌ మాస్టర్‌ ఇంటికి సైతం సీబీఐ బృందం వెళ్లింది.
 
ఒడిశాలోని బాలాసోర్ జిల్లా బహనాగా రైల్వే స్టేషన్‌లో అమీర్‌ఖాన్ సిగ్నల్ జూనియర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడు. రైళ్ల రాకపోకల విషయంలో సిగ్నల్ ఇంజనీర్ల పాత్ర కీలకంగా ఉంటుంది. సిగ్నల్స్, ట్రాక్ సర్క్యూట్‌లు, పాయింట్ మెషీన్‌లు, ఇంటర్‌ లాకింగ్ సిస్టమ్‌లతో సహా సిగ్నలింగ్ పరికరాల రిపేరింగ్, నిర్వహణ వంటి వాటిని ఈ సిగ్నల్ ఇంజనీర్లు నిరంతరం పర్యవేక్షిస్తూనే ఉంటారు.
 
దీంతో దర్యాప్తులో కీలకంగా భావిస్తున్న సిగ్నల్ ఇంజనీర్‌ను సీబీఐ అధికారులు విచారణ జరుపుతున్నారు. ఈ క్రమంలోనే అమీర్‌ఖాన్ పారిపోవడంతో ఇప్పటికే అతనిపై సీబీఐ అధికారులకు ఉన్న అనుమానాలు మరింత తీవ్రం అవుతున్నాయి.