రూ 500 నోట్ల అదృశ్యం ప్రచారం కొట్టిపారేసిన ఆర్బీఐ

అంతుబట్టని రీతిలో రూ.88,032.50 కోట్ల విలువైన రూ.500 నోట్లు అదృశ్యమైనట్లు జరుగుతున్న ప్రచారాన్ని భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ) కొట్టిపారేసింది. నాసిక్ కరెన్సీ నోట్ ముద్రణాలయంలో ముద్రితమైన ఈ నోట్లు ఆర్బీఐకి చేరలేదని సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) ప్రకారం చేసిన దరఖాస్తుకు సమాధానం వచ్చిందని ప్రచారం జరిగింది.

ఆర్టీఐ దరఖాస్తుకు వచ్చిన సమాధానంలో, నాసిక్ కరెన్సీ నోట్ల ముద్రణాలయంలో కొత్త డిజైన్‌తో రూ.500 నోట్లు 375.450 మిలియన్ల నోట్లు (37 కోట్ల 54 లక్షల 50 వేల నోట్లు) ముద్రితమయ్యాయని, వీటిలో 345.000 మిలియన్ల నోట్లు (34 కోట్ల 50 లక్షల నోట్లు) మాత్రమే ఆర్బీఐ రికార్డుల్లో కనిపిస్తున్నాయని పేర్కొన్నారని ప్రచారం జరిగింది.

2015 ఏప్రిల్ నుంచి 2016 డిసెంబరు మధ్య కాలంలో ఈ నోట్లు ఆర్బీఐకి ఈ ముద్రణాలయం నుంచి చేరాయని తెలిపారని ప్రచారం జరిగింది. దీనిపై ఆర్బీఐ శనివారం స్పందిస్తూ ఈ నివేదిక పూర్తిగా తప్పు అని, సమాచారాన్ని తప్పుగా వివరించారని స్పష్టం చేసింది.  ముద్రణాలయాల నుంచి ఆర్బీఐకి సరఫరా అయిన అన్ని బ్యాంక్‌నోట్లు సరైన విధంగా లెక్కల్లోకి వచ్చాయని తేల్చి చెప్పింది. అయితే, ముద్రణాలయాల నుంచి ఆర్టీఐ చట్టం, 2005 ప్రకారం సేకరించిన సమాచారాన్ని తప్పుగా అర్థం చేసుకుని, వివరించారని తెలిపింది.

బ్యాంక్‌నోట్ల లెక్కలు సక్రమంగా ఉండేలా చేసే పటిష్ట వ్యవస్థ ఆర్బీఐకి ఉందని హామీ ఇచ్చింది.  ముద్రణాలయాల్లో బ్యాంక్‌నోట్ల ముద్రణ, నిల్వ, వాటిని ఆర్బీఐకి సరఫరా చేయడం వంటి వాటికి సంబంధించిన కఠినమైన నిబంధనలు, విధానాలు అమల్లో ఉన్నాయని వివరించింది. ఆర్బీఐ ఎప్పటికప్పుడు వెల్లడించే సమాచారాన్ని ప్రజలు విశ్వసించాలని కోరింది.

మనోరంజన్‌ రాయ్‌ అనే వ్యక్తి సమాచార హక్కు చట్టం(ఆర్టీఐ) కింద దరఖాస్తు చేసుకోగ ఆర్బీఐ ఇచ్చిన సమాచారంలో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. బెంగళూరులోని భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌ నోట్‌ ముద్రణ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, నాసిక్‌లోని కరెన్సీ నోట్‌ ప్రెస్‌, మధ్యప్రదేశ్‌ దేవస్‌లోని బ్యాంక్‌ నోట్‌ ప్రెస్‌లో రూ.500 కరెన్సీ అచ్చవుతుంది.

2016 నవంబరు 8న పెద్ద నోట్ల రద్దు జరగ్గా, అంతకు ముందు నుంచే నాసిక్‌ ప్రెస్‌లో కొత్త రూ.500 నోట్ల ముద్రణ జరిగింది. 2015 ఏప్రిల్‌–2016 డిసెంబరు మధ్యకాలంలో ఈ ప్రెస్‌లో ముద్రితమైన నోట్లకు, ఆర్బీఐకి చేరిన నోట్ల సంఖ్యకు మధ్య వ్యత్యాసం బయటపడిందని రాయ్‌ వివరించారు.  ‘‘2015 ఏప్రిల్‌ నుంచి 2016 డిసెంబరు వరకు నాసిక్‌ ప్రెస్‌లో 37.54 కోట్ల మేర రూ. 500 నోట్లు ప్రింట్‌ అయ్యాయి. వాటిల్లో 34.5 కోట్ల నోట్లు మాత్రమే ఆర్బీఐకి చేరాయి. ఈ స్థాయిలో నోట్లు మిస్సవ్వడం మామూలు విషయం కాదు. అది దేశ ఆర్థిక వ్యవస్థకే ప్రమాదకరం’’ అని ఆయన పేర్కొన్నారు.