బీఆర్ఎస్ ఎమ్మెల్యేపై జాతీయ మహిళా కమిషన్‌కు ఫిర్యాదు

మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి బీఆర్ఎస్ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యతో ప్రాణహాని ఉందని ఓ మహిళ జాతీయ మహిళా కమిషన్ కు ఫిర్యాదు చేసింది. సెజల్ అనే మహిళ ఆరిజిన్ డెయిరీ కో డైరెక్టర్ గా పనిచేస్తోంది. అయితే ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య తమను బ్లాక్ మెయిల్ చేస్తూ,  పోలీసులతో వేధింపులకు గురి చేస్తున్నాడని ఆమె తెలిపింది.

ఎమ్మెల్యేపై తెలంగాణ పోలీసులకు చాలా సార్లు ఫిర్యాదు చేసినా, ఎమ్మెల్యే తన అధికారాన్ని అడ్డుపెట్టుకొని ఫిర్యాదును నమోదుకానివ్వకుండా చేశాడని ఆ మహిళ సోమవారం ఢిల్లీలోని మహిళా కమిషన్ కు చేసిన ఫిర్యాదులో పేర్కొన్నది. తనకు తగిన న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని కమిషన్ హామీ ఇచ్చిందని బాధితురాలు వెల్లడించింది.

ఆ  మహిళ ఈ విషయాన్ని ఓ వీడియో ద్వారా తన ఫిర్యాదు గురించి వెల్లడించింది. “తప్పు చేసింది ఎమ్మెల్యే అయినా,  ఎవరైనా వదిలిపెట్టేదిలేదు గుర్తుపెట్టుకోండి. ఇకనైనా ఎమ్మెల్యేగారు మీ అనుచరులతో బెదించండం, వేధింపులకు గురిచేయడం ఆపితే మీకే మంచిది” అని బాధితురాలు హెచ్చరించింది.గతంలో ఆమె తమపై లైంగిక వేధింపులకు ఎమ్యెల్యే దిగుతున్నట్లు ఆరోపించారు.

గతంలో కూడా ఎమ్మెల్యే చిన్నయ్యపై ఆమె పలు ఆరోపణలు చేశారు.బాధితురాలి ఫిర్యాదుతో ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యను విచారించేందుకు మహిళా కమిషన్ నోటీస్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య గతంలో టోల్ సిబ్బందిపై దాడి చేసిన ఘటన సంచలనంగా మారింది.

 
మందమర్రి టోల్ ప్లాజా సిబ్బందిపై ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య దాడికి దిగారు. ఓ ఉద్యోగి చెంప పగులగొట్టారు. తన కారును అడ్డుకోవడమే దీనికి కారణమని తెలుస్తోంది. హైదరాబాద్ నుంచి బెల్లంపల్లికి వెళ్తోన్న సమయంలో మార్గమధ్యలో మందమర్రి టోల్ ప్లాజా వద్ద ఆయన కారును అక్కడి సిబ్బంది అడ్డుకున్నారు.

 
టోల్ ఫీజున వసూలు చేయడానికి వారు ఆయన కారును ఆపడంతో దుర్గం చిన్నయ్య ఆగ్రహానికి గురయ్యారు. ఆయన అనుచరులు వారిస్తున్నప్పటికీ వినిపించుకోలేదు. ఈ వ్యవహారం అంతా టోల్ ప్లాజా వద్ద అమర్చిన సీసీటీవీ ఫుటేజీల్లో రికార్డయింది.