అమెరికాలోని ప్ర‌తినిధుల స‌భ‌లో `దివాళి డే’ బిల్లు

దీపాల పండుగ దీపావళిని జాతీయ సెలవు దినంగా ప్రకటించే విధంగా `దివాళి డే యాక్ట్’ పేరిట కాంగ్రెస్ స‌భ్యురాలు గ్రేస్ మేంగ్ అమెరికాలోని ప్ర‌తినిధుల స‌భ‌లో బిల్లుని ప్ర‌వేశ‌పెట్టారు. దాంతో దీనిపై అమెరికాలో సర్వత్రా హర్షం వ్యక్తమ‌యింది. ప్రపంచంలోని కోట్లాది మందికి దీపావళి ఎంతో ముఖ్యమైన పర్వదినం.
అమెరికాలోనూ కొన్ని వేల కుటుంబాలు ఈ పండుగ జరుపుకుంటాయ‌ని మేంగ్ మీడియా సమావేశంలో తెలిపారు. ఈ రోజుకున్న ప్రాముఖ్యతపై అమెరికన్లలో అవగాహన పెంచేందుకు తొలి అడుగుగా ఈ బిల్లును సిద్ధంగా చేశానని ఆమె తెలిపారు.
 
ఈ బిల్లుపై న్యూయార్క్ అసెంబ్లీ సభ్యురాలు జెన్నీఫర్ రాజ్‌కుమార్ సంతోషం వ్యక్తం చేశారు. “దీపావళి ప్రాముఖ్యాన్ని, దక్షిణాసియా వారిని గుర్తిస్తూ ఓ రాష్ట్రం మొత్తం ఈ ఏడాది ఏకతాటిపైకి రావడం మనం చూశాం. ఈ స్ఫూర్తిని కాంగ్రెస్ సభ్యురాలు మెంగ్ జాతీయ స్థాయికి తీసుకెళ్లారు. దీపావళిని జాతీయ సెలవుదినంగా ప్రకటించేందుకు చారిత్రక బిల్లును ప్రవేశపెట్టారు” అని కొనియాడారు.
 
 న్యూయార్క్‌ స్టేట్ సెనేటర్ జెరెమీ కూనీ కూడా మెంగ్‌ను ప్రశంసించారు. దీపావళిని సెలవుగా ప్రకటిస్తే ఈ పండుగ నిర్వహించుకునే వారిని గౌరవించినట్టు అవుతుంది. అంతేకాకుండా, అమెరికన్లకు పెద్ద సంప్రదాయానికి ప్రచారం కల్పించినట్టు అవుతుంద‌ని పేర్కొన్నారు.  ఈ బిల్లును అమెరికా చట్టసభలు ఆమోదిస్తే అధ్యక్షుడు ఆమోదముద్ర వేస్తారు.
దీంతో, దీపావళికి అమెరికాలో 12వ దేశవ్యాప్త సెలవు దినంగా గుర్తింపు దక్కుతుంది. ఈ బిల్లుకు అమెరికా కాంగ్రెస్ ఆమోదం కోసం గట్టి కృషి చేస్తానని బిల్లును ప్రతిపాదించిన గ్రేస్ మెంగ్ తెలిపారు. హౌస్ ఫారిన్ అఫైర్స్ కమిటీ ఛైర్మన్, కాంగ్రెస్ సభ్యుడు గ్రెగొరీ మీక్స్ ఈ చట్టానికి మద్దతు ఇస్తూ అమెరికన్ సమాజం దీపావళి స్ఫూర్తిని పంచుకోవాలని కోరారు.

 
ఈ బిల్లు గురించి కీలక ప్రకటన చేస్తూ, కాంగ్రెస్ మహిళ మలోనీ దీపావళి వంటి వేడుకలు అమెరికా ప్రజల సంతోషానికి దారి తీసేందుకు  సహాయపడతాయని చెప్పారు. “ఈ వారం దీపావళి డే యాక్ట్‌ను కాంగ్రెస్  లో ప్రవేశపెడుతున్నందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. సంతోషిస్తున్నాను. ఇది దీపావళిని సమాఖ్య సెలవుదినంగా చట్టంగా రూపొందిస్తుంది” అని అమెరికా కాపిటల్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొంటూ మలోనీ తెలిపారు.
 
2021లో ఈ దీపాల పండుగ కరొనకు వ్యతిరేకంగా దేశం జరిపిన పోరాటానికి, మహమ్మారి కారణంగా ఏర్పడిన చీకటి నుండి దాని ప్రయాణానికి ప్రతీక అని మలోనీ తెలిపారు. “దీపావళి వంటి వేడుకలు మన దేశం సంతోషం, స్వస్థత, అభ్యాసం, కాంతి, అనిశ్చిత సమయాలకు దారిచూపేలా ఉండాలని మనమందరం కోరుకునే ప్రధానాంశాన్ని తెలియజేస్తాయి” అని ఆమె పేర్కొన్నారు.
 
ఈ భయంకరమైన చీకటి మహమ్మారి నేపథ్యం కన్నా దీపావళిని సమాఖ్య సెలవుదినంగా మార్చడానికి మంచి సమయం లేదని నేను విశ్వసిస్తున్నట్లు సహోద్యోగులు, భారతీయ-అమెరికన్ కమ్యూనిటీ నాయకులకు ఆమె తెలిపారు.
ఇలా ఉండగా, భారతీయ-అమెరికన్ కాంగ్రెస్ సభ్యుడు రాజా కృష్ణమూర్తి ఈ చర్యను సమర్థిస్తూ దీపావళి పండుగను సమాఖ్య సెలవుదినం చేయాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. “ఈ దీపావళి పర్వదినాన మనం చెప్పాలి. మీరు ప్రపంచంలో చూడాలనుకునే వెలుగుగా ఉండండి. చీకటిని పారద్రోలడానికి అవసరమైన మీ సంఘంలో వెలుగుగా ఉండండి. నిస్సహాయులకు ఆశలు కలిగించే ఈ సమాజంలో వెలుగుగా ఉండండి. చిన్నవారికి, చివరివారికి సహాయపడే వెలుగుగా ఉందాం. అదే దీపావళి. అందుకే దీపావళి ఫెడరల్ సెలవుదినం కావాలి, ”అని కృష్ణమూర్తి పిలుపిచ్చారు.