కర్నాటకలో కాంగ్రెస్‌కు వెన్నుల్లో భయం

కర్నాటకలో కాంగ్రెస్‌కు వెన్నుల్లో భయం పట్టుకుందని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. రాష్ట్రంలో ఎన్నికల ప్రచార దశలో ఈ పార్టీ వల్లించిన అసత్యాలు పని చేయకుండా పొయ్యాయి. దీనితో దిక్కుతోచని స్థితిలో పార్టీ ప్రముఖ నేత సోనియా గాంధీని ఒప్పించి ప్రచారానికి తీసుకువచ్చారని ఆయన ధ్వజమెత్తారు. కర్నాటకలోని శివమొగ్గలో ఆదివారం జరిగిన ఎన్నికల బహిరంగ సభలో ప్రధాని మాట్లాడుతూ తాను ఇక్కడికి రావడానికి ముందు బెంగళూరులో జరిపిన రోడ్‌షోకు జనం నుంచి వ్యక్తం అయిన ఆదరణ తనను కదలించిందని తెలిపారు.

కాంగ్రెస్ వారి అబద్ధాల గాలిబుడగలు పేలిపొయ్యాయి. వారి ప్రచారం పనికిరాకుండా పోయిందని తెలిపిన ప్రధాని ఈ దశలో ఈ పార్టీకి ఇప్పుడు పార్టీ ప్రముఖ నేత ప్రచార సభలే దిక్కయ్యాయని దయ్యబడ్డారు.  విచిత్ర రీతిలో కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు కనీసం ప్రచారానికి కూడా వెళ్లని నేతలను ఎంపిక చేసుకుందని, వారితో పార్టీ ఏ విధంగా ముందుకు సాగుతున్నదో అర్థం చేసుకోవాలని మోదీ చెప్పారు. ఎన్నికల ప్రచార గడువు మరో రెండు రోజులలో ముగుస్తుందనగా కర్నాటకకు ఎన్నికల ప్రచార సభకోసం సోనియా గాంధీ హుబ్లీకి తరలివచ్చిన విషయాన్ని ప్రధాని ఈ సందర్భంగా గుర్తు చేశారు.

“తమ అబద్ధాలు పని చేయడం లేదని కాంగ్రెస్ ఆందోళన చెందుతోంది, భయపడుతోంది. అందుకే ప్రచారంలో భాగంగా లేని వారిని కూడా ఇక్కడికి తీసుకొచ్చింది. ఓటమి బాధ్యతను ఒకరిపై ఒకరు వేసుకునే పనిని ఇప్పటికే కాంగ్రెస్ ప్రారంభించింది” అని ప్రధాని మోదీ ఎద్దేవా చేశారు.

రాష్ట్ర హేమాహేమీలైన కాంగ్రెస్ నేతల ప్రచారం పసలేనిదని తేలింది. దీనితో పార్టీ గందరగోళంలో పడిందని ప్రధాని ఎద్దేవా చేశారు. అనారోగ్య కారణాలతో సోనియా గాంధీ 2019 లోక్‌సభ ఎన్నికల నాటి నుంచి ఎక్కడ కూడా ప్రచారానికి వెళ్లడం లేదు. కర్ణాటకలో హుబ్లీ సభలో పాల్గొనడమే ఇటీవలి కాలంలో ఆమెకు తొలి బహిరంగ సభ అయింది.

కాంగ్రెస్ ఇప్పుడు ఇక్కడే కాకుండా పలు చోట్ల పరస్పర కుమ్ములాటల పార్టీ అయి కూర్చుంది. పార్టీ నేతలు ఇక్కడ ఎగరేసిన గాలిపటాలు చతికిలపడి పోతున్నాయని ప్రధాని తెలిపారు. ఎన్నికల ఫలితాలు కూడా ఇదే విధంగా ఉంటాయని జోస్యం చెప్పారు.

కాంగ్రెస్ అబద్ధాల బెలూన్‍ను ప్రజలు పేల్చేశారని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. ఆ పార్టీ అబద్ధాలు ఏ మాత్రం కూడా ప్రభావం చూపలేవని చెప్పారు. ప్రజలు కర్ణాటకలో మరోసారి బీజేపీనే గెలిపిస్తారని మోదీ విశ్వాసం వ్యక్తం చేశారు. చేతిలో హనుమంతుడి విగ్రహం, తలపై కషాయ రంగు శివాజీ తలపాగాతో బహిరంగ సభకు మోదీ వచ్చారు. ఆ సమయంలో ప్రజలు “జై శ్రీరామ్”, “బజరంగ్ బలీ కీ జై” అని నినాదాలు చేశారు.