అన్ని దేశాల సహకారం లేకుండా క్రిప్టో కరెన్సీలను నియంత్రించినా ప్రయోజనం ఉండబోదని కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. అంతవరకు వీటిపై భారతదేశం ఎలాంటి చర్యలు తీసుకోబోదని ఆమె స్పష్టం చేశారు. క్రిప్టోలపై ప్రతి ఒక్కరూ కలిసి పని చేయాలని, లేకుంటే నియంత్రణ సరిగ్గా ఉండదని ఆమె చెప్పారు.
బెంగళూరులో ‘థింకర్స్ ఫోరమ్, కర్ణాటక’ అనే సంస్థ ఏర్పాటు చేసిన ఇంటరాక్షన్ సందర్భంగా డిజిటల్ లేదా క్రిప్టో కరెన్సీని నియంత్రించడంపై అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిస్తూ క్రిప్టోలను కంట్రోల్ చేయడం అంటే ‘డిస్ట్రిబ్యూటెడ్ లెడ్జర్ టెక్నాలజీ’ని నియంత్రించడం కాదని, ఇది ఎంతో మంచి టెక్నాలజీ అని పేర్కొన్నారు.
“ప్రస్తుతం భారతదేశానికి జీ20 అధ్యక్ష పదవి ఉంది. క్రిప్టోల నియంత్రణ అంశాన్ని మేం ఎజెండాలో చేర్చాం. ఐఎంఎఫ్ క్రిప్టోపై ఒక డాక్యుమెంలట్ను ఇచ్చింది. ఇది స్థూల ఆర్థిక స్థిరత్వాన్ని ప్రభావితం చేస్తుంది. జీ20 ఏర్పాటు చేసిన ఫైనాన్షియల్ స్టెబిలిటీ బోర్డ్ (ఎఫ్ఎస్బీ), ఆర్థిక స్థిరత్వంపై కూడా దృష్టి సారించే నివేదికను ఇవ్వడానికి అంగీకరించింది” అని ఆమె వివరించారు.
ఎఫ్ఎస్బీ, ఐఎంఎఫ్ రిపోర్టుల గురించి ఈ ఏడాది జులైలో ఆర్థిక మంత్రులు, సెంట్రల్ బ్యాంక్ గవర్నర్లు చర్చిస్తారని ఆమె వెల్లడించారు. ఇదే ఏడాది సెప్టెంబర్లో భారత్ లోనే జీ20 దేశాల ప్రధానమంత్రుల, అధ్యక్షుల సమావేశం జరుగుతుందని సీతారామన్ తెలిపారు.
జీ20 ఇండియన్ ప్రెసిడెన్సీలో మొదటి జీ20 ఆర్థిక మంత్రులు సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ల (ఎఫ్ఎంసీజీ) సమావేశం ఫిబ్రవరి 24-–25 మధ్య బెంగళూరులో జరిగింది. డిజిటల్ కరెన్సీలు పూర్తిగా డిజిటలైజ్ అయ్యాయన చెబుతూ టెక్నాలజీతో నడిచే క్రిప్టోలను ఏ ఒక్క దేశం కూడా దానిని సమర్థవంతంగా నియంత్రించలేదని ఆర్ధిక మంత్రి స్పష్టం చేశారు.
జీ20, ఓఈసీడీ (ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కో-ఆపరేషన్ అండ్ డెవలప్మెంట్) ఐఎంఎఫ్, ప్రపంచ బ్యాంక్ మొదలైన ఇతర సంస్థలతో కలిసి క్రిప్టోలపై ఒక విధానాన్ని రూపొందించాల్సి ఉంటుందని ఆమె పేర్కొన్నారు. అయితే, పోంజీ మొబైల్ యాప్లను అరికట్టేందుకు తమ శాఖ కేంద్ర ఎలక్ట్రానిక్స్ ఐటీ మంత్రిత్వశాఖ (మైటీ), ఆర్బీఐ లతో కలిసి పనిచేస్తోందని నిర్మల తెలిపారు.
పెట్టుబడిదారులు కష్టపడి సంపాదించిన డబ్బును ఇవి మోసపూరితంగా లాక్కుంటున్నాయని ఆమె చెప్పారు. పోంజీ యాప్ల విషయంలో జాగ్రత్తగా ఉండాలని పెట్టుబడిదారులను హెచ్చరించిన ఆమె, యాప్స్ ఇచ్చే ఆకర్షణీయమైన ప్రకటనలకు ఆకర్షితులు కావొద్దని ఆమె సూచించారు.
ఫలానా మొత్తం పెట్టుబడి పెడితే ‘అంత వస్తుంది.. ఇంత వస్తుంది’ అంటూ ఊరించే ప్లాట్ఫారమ్స్కు దూరంగా ఉండాలని ఆమె హితవు చెప్పారు. సోషల్ ఇన్ఫ్లుయెన్సర్లు, ఫైనాన్షియల్ ఇన్ఫ్లుయెన్సర్లు ఏం చెప్పినా, మనం తీసుకునే జాగ్రత్తలు మనం తీసుకోవాలని, పెట్టుబడుల విషయంలో ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకోవాలని ఆర్ధిక మంత్రి స్పష్టం చేశారు.
ఇన్ఫ్లుయెన్సర్లను నియంత్రించడానికి ప్రస్తుతం ఎటువంటి ప్రతిపాదనా లేదని ఒక ప్రశ్నకు సమాధానంగా ఆమె చెప్పారు. ఇద్దరో ముగ్గురో ఇన్ఫ్లుయెన్సర్లు మంచి సలహాలే ఇచ్చినా, మిగతా ఏడుగురు ఇవ్వకపోవచ్చని ఆమె తెలిపారు.
క్రమబద్ధీకరణ లేని డిపాజిట్ పథకాలను నిషేధిస్తూ ప్రభుత్వం 2019లోనే చట్టం తెచ్చిందని ఆమె గుర్తు చేశారు. గుర్తింపులేని సంస్థలు డిపాజిట్లను సేకరించకుండా ఇది అడ్డుకుంటుందని అన్నారు. “పోంజీ పథకం అంటే ఒక మోసపూరిత పెట్టుబడి విధానం. ఇందులో మొదట చేరిన వారికి తర్వాత చేరిన ఇన్వెస్టర్లు పెట్టిన డబ్బును చెల్లిస్తుంటారు. ఇది పిరమిడ్ స్కీమ్ మాదిరి ఉంటుంది” అంటూ ఆర్ధిక మంత్రి హెచ్చరించారు.
More Stories
చదువుల్ని లోకకల్యాణం కోసం ఉపయోగించాలి
రిజర్వేషన్లకు ఆర్ఎస్ఎస్ వ్యతిరేకం కాదు
మణిపూర్ లో 6 పోలింగ్ స్టేషన్లలో రీపోలింగ్