కరోనా కేసులపై రాష్ట్రాలను అప్రమత్తం చేసిన కేంద్రం

చాపకింద నీరులా రోజురోజుకు కరోనా వైరస్ విస్తరిస్తూ దేశంలో కేసులు పెరుగుతుండడంతో కేంద్ర ప్రభుత్వం ఎనిమిది రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు అప్రమత్తం చేస్తూ శుక్రవారం లేఖలు రాసింది. కరోనా మహమ్మారి నివారణకు తీసుకోవాల్సిన చర్యల గురించి వివరిస్తూ ఢిల్లీ, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, హర్యానా, కర్ణాటక, కేరళ, మహారాష్ట్ర, రాజస్థాన్ రాష్ట్రాలకు లేఖలు రాసింది.

ఎనిమిది రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, ప్రిన్సిపల్ సెక్రటరీలకు కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్ లేఖలు రాశారు. కరోనా వైరస్ నిర్మూళనకు అన్ని రకాల చర్యలు తీసుకోవాలని లేఖలో స్పష్టం చేశారు.  మార్చి, 2023 నుంచి దేశంలో కరోనా కేసులు పెరుగుతుండడం సర్వత్రా ఆందోళన కల్గిస్తోంది.

గత వారం రోజులుగా రోజువారీ కరోనా కేసులు 10వేలకు పైగా నమోదు అవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా గడిచిన వారంలో కరోనా పాజిటివిటీ రేటు పెరిగింది. అంతకుముందు వారం 4.7గా ఉన్న పాజిటివిటీ రేటు ఈ వారం 5.5శాతానికి పెరగడం ఆందోళనకు గురిచేస్తోంది. అయితే కరోనా సోకిన వారు ఆస్పత్రిలో చేరడం, మరణాల సంఖ్య తక్కువగా ఉన్నట్లు రాజేశ్ భూషణ్ తెలిపారు

దేశవ్యాప్తంగా ఇంకా కేసులు పెరిగే అవకాశం ఉందని లేఖలో హెచ్చరించారు. కొన్ని రాష్ట్రాలు, జిల్లాల్లో అధికసంఖ్యలో కరోనా కేసులు నమోదు అవుతున్నందున కమ్యూనిటీ వ్యాప్తి పెరిగే అవకాశం ఉంది. కాబట్టి ఆయా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో అవసరమైన ప్రజారోగ్య చర్యలు చేపట్టడం అవసరమని కేంద్రం భావించింది.

ప్రారంభ దశలోనే ఇటువంటి ప్రమాదాలను గుర్తించి, నియంత్రించినట్లయితే కరోనాను కట్టడి చేయొచ్చని రాజేష్ భూషణ్ సూచించారు. కరోనా వైరస్ నియంత్రణకు ఐదు రెట్లు వ్యూహాన్ని అనుసరించాలని, అంటే టెస్ట్, ట్రాక్, ట్రీట్, వ్యాక్సినేషన్ తో పాటు పబ్లికే స్వతహాగా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకునేలా చూడాలని రాష్ట్రాలకు సూచించారు. తాము జారీ చేసిన అన్ని రకాల మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలని లేఖలో కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్ కోరారు

కరోనా వైరస్ వ్యాప్తి ముగియలేదని, ఇంకా తీవ్రస్థాయిలో విజృంభిస్తోందని హెచ్చరించారు. వైరస్ నిర్మూళనలో అలసత్వం వహించకుండా.. ప్రజల్లోనూ అవగాహన పెంచేలా చూడాలని కోరారు.  భారతదేశంలో కొత్తగా 11,692 కరోనా కేసులు నమోదయ్యాయి. క్రియాశీల కేసులు 66,170కి పెరిగాయని శుక్రవారం కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. గడిచిన 24 గంటల్లో28 మంది చనిపోయారు. దీంతో ఇప్పటి వరకూ మరణాల సంఖ్య 5,31,258కి పెరిగింది.

ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెబ్‌సైట్ ప్రకారం, జాతీయ రికవరీ రేటు ప్రస్తుతం 98.67 శాతంగా ఉంది. సంక్రమణల్లో 0.15 శాతం క్రియాశీలక కేసులు ఉన్నాయి. 10780 మంది రికవర్ అయ్యారు. దేశవ్యాప్తంగా రికవరీల సంఖ్య 44272256కు చేరుకుంది. దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ డ్రయివ్ కింద ఇప్పటి వరకు దేశంలో 220.66 కోట్ల కోవిడ్ వ్యాక్సిన్లు ఇచ్చారు. గత 24 గంటల్లో 3647 డోసులు ఇచ్చారు.