తీన్మార్ మల్లన్నకు బెయిల్ మంజూరు

తీన్మార్ మల్లన్నకు మల్కాజ్ గిరి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. తీన్మార్ మల్లన్నతో పాటు మరో నలుగురికి బెయిల్ మంజూరు చేసింది. ఒక్కొక్కరికి రూ.20వేలు ష్యూరిటీ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు న్యాయమూర్తి. రెండు కేసుల్లో రెగ్యూలర్ బెయిల్ ఇచ్చింది.  తీన్మార్ మల్లన్న బెయిల్ పిటిషన్ పై తుది తీర్పును మల్కాజ్ గిరి కోర్టు ఏప్రిల్ 17కు వాయిదా వేసిన విషయం తెలిసిందే.

సెకండ్ కేసు బెయిల్ పిటిషన్ పై పూర్తి వివరాలు కోర్టుకు సమర్పించిన మల్లన్న న్యాయవాది అదే రోజే అంటే (ఏప్రిల్ 12న) ఉత్తరువులు ఇవ్వాలని కోరారు. ఏప్రిల్ 13న ఒక్కరోజే వర్కింగ్ డే అని పబ్లిక్ ప్రాసిక్యూటర్ కోర్టుకు తెలియచేశారు. ఈ క్రమంలో తీర్పును ఏప్రిల్ 17.. అంటే సోమవారానికి వాయిదా వేస్తూ ఆదేశాలు జారీ చేశారు.

ఏప్రిల్ 11న తీన్మార్ మల్లన్న బెయిల్ పిటిషన్ పై కోర్టు విచారణ చేపట్టగా నాన్ బెయిలబుల్ సెక్షన్ అసలు మల్లన్నపై వర్తించదని మల్లన్న తరపు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. బెయిల్ అడ్డుకోవడానికి పాత వారెంట్స్ తెర మీదకు తెస్తున్నారని ఆరోపించారు. సాంకేతిక కారణాలు చూపించి బెయిల్ అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని  మల్లన్న న్యాయవాది వాదించారు.  

తీన్మార్‌ మల్లన్నపై ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా 90 కేసులు నమోదయ్యాయి. నోటీసు ఇవ్వకుండా తన భర్తను అరెస్ట్‌ చేశారని మల్లన్న భార్య మమత ఏప్రిల్‌ 3వ తేదీన హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు.