జగిత్యాల స్ట్రాంగ్ రూమ్ తాాళాల మిస్సింగ్ పై ఈసీ విచారణ

2018 అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి జగిత్యాల నియోజకవర్గ ఈవీఎంలను భద్రపరచిన స్ట్రాంగ్ రూమ్ తాళాలు కనిపించక పోవడంపై కలకలం చెలరేగుతుంది. తెలంగాణ హైకోర్టు ఆదేశంపై ఈ విషయమై భారత ఎన్నికల కమీషన్ విచారణ చేపట్టింది. జగిత్యాలకు కేంద్ర ఎన్నికల సంఘం ప్రత్యేక అధికారి సోమవారం చేరుకున్నారు. 
 
గత ఎన్నికల ఫలితాల్లో అవకతవకలు జరిగాయని ఓటమి చెందిన కాంగ్రెస్ అభ్యర్థి లక్ష్మణ్ హైకోర్టును ఆశ్రయించారు. దీంతో స్ట్రాంగ్ రూమ్ తెరవాలని గతంలో కోర్టు ఆదేశాలు జారీ చేయగా, ఇటీవల స్ట్రాంగ్ రూమ్ తెరిచేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. కానీ స్ట్రాంగ్ రూమ్ తాళాలు కనిపించక పోవడంతో ఇంకా తెరుచుకోలేదు. ఈ ఘటనపై ఈసీ ప్రత్యేక అధికారి నేడు విచారణ చేపట్టనున్నారు.
 
 హైకోర్ట్ ఆదేశాల మేరకు ఢిల్లీ నుంచి విచారణకు అధికారుల బృందం వచ్చింది. నాచుపల్లి జేఎన్టీయూ కళాశాల ప్రాంగణంలో విచారణకు అధికారులు సిద్దం చేశారు. జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌తో పాటు రిటర్నింగ్ ఆఫీసర్, నాటి ఎన్నికల సిబ్బంది విచారణకు హాజరు కావాలంటూ ఇప్పటికే నోటీసులు జారీ చేశారు. విచారణ అనంతరం ఈ నెల ఏప్రిల్ 26 లోపు హైకోర్టుకు సీఈసీ నివేదిక సమర్పించనుందని తెలుస్తోంది.
 
స్ట్రాంగ్ రూమ్ తాళాలు కనిపించకపోయిన తర్వాత జరుగుతున్న విచారణ కావడంతో దీనిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.  గత వారం క్రితం విచారణ సందర్భంగా స్ట్రాంగ్ రూమ్ తాళాలు దొరకడం లేదని కోర్టుకు నివేదించారు. తాళాలు లేకపోవడం వల్ల స్ట్రాంగ్ రూం తెరుచుకోలేదనే విషయాన్ని ఈ నెల 14న కాంగ్రెస్ అభ్యర్థి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ హైకోర్టుకు నివేదించారు.
 
తాళాలు మాయమవ్వడంపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. స్ట్రాంగ్ రూం తాళాలు లేకపోవడంపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి నివేదిక అందించాల్సిందిగా చీఫ్ ఎలక్షన్ కమిషన్‌ను ఇటీవల హైకోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలో సోమవారం నాచుపల్లిలోని జేఎన్టీయూ యూనివర్సిటీ కాలేజీలో ఉదయం 11 గంటలకు సంబంధిత పత్రాలతో విచారణకు హాజరు కావాలని సీఈసీ ఆదేశించింది.
 
అప్పటి జిల్లా ఎన్నికల అధికారి, డిప్యూటీ ఎన్నికల అధికారికి ఈసీ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో వారందరూ నేడు విచారణకు హాజరుకానున్నారు. దీంతో సీఈసీ ఎలాంటి నివేదిక ఇస్తుందనేది ఇప్పుడు ఈ కేసులో కీలకంగా మారనుంది. ఈసీ నివేదికను పరిశీలించి హైకోర్టు తదుపరి ఆదేశాలు జారీ చేయనుంది.