బిజెపి శ్రేణులపై అక్రమ కేసులతో పోలీసుల వేధింపులు మానుకోవాలని ఆ పార్టీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ హెచ్చరించారు. పొలీసులు బిఆర్ఎస్ తొత్తులుగా వ్యవహరిస్తూ బిజెపి నాయకులను, కార్యకర్తల పై అక్రమ కేసులతో పోలీసుల వేదింపులు మానుకోవాలని ఆయన హితవు చెప్పారు.
హుజూరాబాద్ నియోజకవర్గంలో పోలీసుల వేధింపులు, అక్రమ కేసులకు నిరసనగా హుజురాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో ఆదివారం చేపట్టిన బీజేపీ ధర్నాలో ఎమ్మెల్యే ఈటల రాజేందర్ పాల్గొన్నారు. ఆయనతోపాటు బీజేపీ కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు కృష్ణారెడ్డి, నియోజకవర్గ బీజేపీ నేతలు కార్యకర్తలు హాజరయ్యారు. కరీంనగర్ జిల్లా హుజురాబాద్ పట్టణ బీజేపీ అద్యక్షుడు గంగిషెట్టి రాజు ఆధ్వర్యంలో నిరసన దీక్ష, ధర్నా నిర్వహించారు.
చెల్పూర్ గ్రామ సర్పంచ్ నేరెళ్ల మహేందర్గౌడ్, వార్డ్ మెంబర్ మహ్మద్ ఇబ్రహీంపై పోలీసులు అక్రమంగా కేసులు నమోదు చేశారని నిరసన వ్యక్తం చేశారు. థర్డ్ డిగ్రీ ప్రయోగించి శారీరకంగా హింసించిన హుజురాబాద్ సీఐ బొల్లం రమేష్ పై చర్యలు తీసుకుని సస్పెండ్ చేయాలి అని డిమాండ్ చేశారు.
పొలీసులు బీఆర్ఎస్ తొత్తులుగా వ్యవహరిస్తూ బీజేపీ నాయకులను, కార్యకర్తల పై అక్రమ కేసులతో పోలీసుల వేధింపులు మానుకోవాలని ఈటెల స్పష్టం చేశారు. నియోజకవర్గంలో పోలీసుల వేధింపులు ఆపకుంటే గ్రామస్థాయిలో ఆందోళనలు ఉధృతం చేస్తామని ఈటల హెచ్చరించారు.
తనను గెలిపించిన హుజురాబాద్ గడ్డ మీద కక్ష కట్టారని అంటూ తనపై కోపంతో మానేరు నదిని చెరబట్టారని, వేల టన్నుల ఇసుక తరలించి ఈ ప్రాంతాన్ని ఎడారి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం హుజూరాబాద్లో 3500 కుటుంబాలకు దళితబంధు ఇవ్వలేదని ధ్వజమెత్తారు. వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు.
కల్యాణలక్ష్మీ చెక్కులు ఇవ్వడం లేదని అంటూ రెండేళ్లుగా నియోజకవర్గంలో ఇబ్బందులను భరిస్తూ ఉన్నానని చెప్పుకొచ్చారు. “నా పంచాయతీ ఇక్కడ కాదు.. నా పంచాయతీ నాలుగు కోట్ల ప్రజలను ఐక్యం చేసే పంచాయతీ” అని స్పష్టం చేశారు. దీక్షలో జాతీయ బిసి కమిషన్ మాజీ సభ్యులు ఆచారి, మాజీ ఎమ్మెల్యేలు ధర్మారావు, బొడిగే శోభ, రావు పద్మ, ప్రదీప్ రావు, రాకేశ్ రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు ఎర్రబెల్లి సంపత్రావు, కన్వీనర్ మాడ గౌతంరెడ్డి, నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
More Stories
బిఆర్ఎస్ ఎంఎల్సి దండె విఠల్ ఎన్నిక చెల్లదు
ఈసీ ఒప్పుకున్నా పంట పరిహారంపై స్పందించని రేవంత్
తెలంగాణాలో 8,10 తేదీల్లో ప్రధాని ప్రచారం