బయ్యారం స్టీల్ ప్లాంట్ మాట కేసీఆర్ నిలబెట్టుకోవాలి

వైజాగ్ స్టీల్ప్లాంట్ గురించి మాట్లాడే హక్కు బీఆర్ఎస్కు లేదని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. బయ్యారం స్టీల్ఫ్లాంట్ ఏర్పాటు హామీని సీఎం కేసీఆర్ నిలబెట్టుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. మూతపడిన పరిశ్రమలను తెరిపిస్తామన్న కేసీఆర్ నోరు విప్పాలని హితవు చెప్పారు. స్టీల్ఫ్లాంట్ పేరుతో కల్వకుంట్ల కుటుంబం ఫోజులు కొడుతోందని దుయ్యబట్టారు. బయ్యారం ఉక్కు పరిశ్రమపై బిఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని ఖమ్మం జిల్లా ప్రజలు, తెలంగాణ సమాజం ప్రశ్నించాలని కిషన్ రెడ్డి కోరారు. 
కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించడమే కేసీఆర్ ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్నారని కిషన్ రెడ్డి మండిపడ్డారు. వారం రోజులుగా విశాఖ స్టీల్ ప్లాంట్ పై రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రచారం నేల విడిచి సాము చేస్తున్నట్లుగా ఉందని విమర్శించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ కొంటామని సింగరేణి ఆధికారులను ఆఘమేఘాల మీద అక్కడికి పంపించి రాజకీయ డ్రామకు తెర తీశారని పేర్కొన్నారు.
బిఆర్‌ఎస్ మంత్రులు తప్పుడు ప్రకటనలు చేశాసారని విమర్శించారు. అవకాశం లేదని కేంద్రం చెప్పినా రాజకీయ లబ్ధికోసం అనవసర రాద్ధాంతం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. తెలంగాణను గాలికొదిలేసిని కేసీఆర్ ప్రభుత్వం బీఆర్‌ఎస్ పేరుతో దేశాన్ని ఉద్దరిస్తాననటం‌ హాస్పాస్పదంగా ఉందని కేంద్ర మంత్రి ఎద్దేవాచేశారు.
 
వంద రోజుల్లో నిజాం‌ ఘగర్ ఫ్యాక్టరీని తెరిపిస్తామని, తొమ్మిదేళ్లు అవుతున్న ఎందుకు పట్టించుకోవడం లేదని కిషన్ రెడ్డి దుయ్యబట్టారు. రాష్ట్రంలో మూతబడ్డ అన్నీ ఫాక్టరీలు తెరుస్తామని అసెంబ్లీ సాక్షిగా ప్రకటించింన కేసీఆర్ ఇప్పుడు ఎందుకు నోరు మెదపట్లేదో ప్రశ్నించారు.  నాలుగేండ్లయినా బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ నిర్మాణం మొదలుపెట్టలేదని, తొమ్మిదేండ్లయినా హామీలిచ్చిన పనుల్లో ఒక్క కూడా అడుగు ముందుకు పడలేదని కిషన్ రెడ్డి మండిపడ్డారు. 

తెలంగాణ పాలనను కేసీఆర్ గాలికొదిలేసిన కేసీఆర్.. తన వైఫల్యాలను కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో ఒక్క పరిశ్రమైనా తెరిచారా చెప్పాలని కేసీఆర్ ను ప్రశ్నించారు. అంబేద్కర్ విగ్రహానికి ఏనాడూ నివాళులు అర్పించని కేసీఆర్.. ఎన్నికల కోసమే ముందుకు వచ్చి పనులు చేస్తున్నారపి విమర్శించారు. తొమ్మిదేళ్ల తరువాత అంబేద్కర్ జయంతి రోజున సిఎం బయటకు వచ్చారని చెబుతూ ఇది రాజకీయ ఎత్తుగడే తప్ప అంబేడ్కర్‌పై ప్రేమ లేదని విమర్శించారు. 

ఇఫ్తార్ వెళ్లేందుకు ఉన్న సమయం.. భద్రాచలం వెళ్లేందుకు సమయం ఉండదని అన్నారు. అవినీతి పై ఆరోపణలు వస్తే దర్యాప్తు జరపొద్దని రాజ్యాంగంలో రాసి ఉందా అని కిషన్‌రెడ్డి ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతున్న రాష్ట్రం సహకరించక పోవడంతో ముఖ్యమంత్రికి లేఖలు రాస్తూ తెలంగాణ సమాజం దృష్టికి తెస్తున్నామని వెల్లడించారు.

సిబిఐపై కడప ఎంపీ అవినాశ్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై కిషన్‌రెడ్డి స్పందిస్తూ వ్యక్తులు ఎవరైనా సరే చట్టం తనపని తాను చేసుకుంటూ పోతుందని స్పష్టం చేశారు. అతీక్ అహ్మద్ హత్యపై స్పందిస్తూ పాతబస్తీలో ఆస్తులు అమ్ముకొని ప్రజలు కట్టు బట్టలతో వెళ్తున్నారని దానికి కారణం ఎవరో అలాంటి వాటిపై ఒవైసీ మాట్లాడితే బాగుంటుందని హితవు చెప్పారు. అతీక్ హత్య జరిగిన వెంటనే కమిటీని వేశామని గుర్తు చేస్తూ వందల కేసులు ఉన్న వ్యక్తి చనిపోయాడని, అయితే అలా జరగాల్సింది కాదని పేర్కొన్నారు.