అమెరికా – భారత్ ల మధ్య వాణిజ్యం పెరుగుతోంది. 2022–23 ఆర్థిక సంవత్సరంలో భారత్ కు అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా అమెరికా నిలిచింది. వాణిజ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన డేటా ప్రకారం, భారత్ – అమెరికాల మధ్య వాణిజ్యం కిందటి ఆర్థిక సంవత్సరంలో 128.55 బిలియన్ డాలర్లకు చేరుకుంది.
అంతకు ముందు ఆర్థిక సంవత్సరంలో రికార్డయిన 119.5 బిలియన్ డాలర్లతో పోలిస్తే 7.65 శాతం వృద్ధి సాధించింది. 2020–21 లో ఇరు దేశాల మధ్య 80.51 బిలియన్ డాలర్ల వాణిజ్యం జరిగింది. అమెరికాకు చేసిన ఎగుమతులు ఏడాది ప్రాతిపదికన 2.81 శాతం వృద్ధి సాధించి 78.31 బిలియన్ డాలర్లకు ఎగిశాయి. 2021–22 ఆర్థిక సంవత్సరంలో ఇది 76.18 బిలియన్ డాలర్లుగా ఉంది.
మరోవైపు అమెరికా నుండి భారత్ కు అవుతున్న దిగుమతుల విలువ 16 శాతం పెరిగి 50.24 బిలియన్ డాలర్లకు చేరుకుంది. భారత్ కు వాణిజ్య మిగులు ఉన్న కొన్ని దేశాల్లో అమెరికా కూడా ఉంది. 2022-–23లో 28 బిలియన్ డాలర్ల మిగులు నమోదయ్యింది.
మరోవైపు చైనాతో జరుగుతున్న వాణిజ్యం కిందటి ఆర్థిక సంవత్సరంలో కొద్దిగా తగ్గింది. 2022–23 ఆర్థిక సంవత్సరంలో భారత్ –చైనాల మధ్య వాణిజ్యం ఏడాది ప్రాతిపదికన 1.5 శాతం తగ్గి, 113.83 బిలియన్ డాలర్లుగా రికార్డయ్యింది. అంతకు ముందు ఆర్థిక సంవత్సరంలో ఇది 115.42 బిలియన్ డాలర్లుగా ఉంది.
చైనాకు చేస్తున్న ఎగుమతులు ఏకంగా 28 శాతం పడిపోయాయి. కానీ, ఈ దేశం నుంచి జరుపుకుంటున్న దిగుమతులు మాత్రం 4.16 శాతం పెరిగాయి. 2022–23 ఆర్థిక సంవత్సరంలో చైనాకు జరిపిన ఎగుమతులు 15.32 బిలియన్ డాలర్లుగా, ఈ దేశం నుంచి జరిగిన దిగుమతులు 98.51 బిలియన్ డాలర్లుగా రికార్డయ్యాయి. దీంతో చైనాతో ఇండియా వాణిజ్య లోటు 83.2 బిలియన్ డాలర్లకు చేరుకుంది. 2021–22 లో ఇది 72.91 బిలియన్ డాలర్లుగా ఉంది.
ఇలా ఉండగా, భారత్ – అమెరికాల మధ్య వాణిజ్యం మరింత బలపడుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఫార్మాస్యూటికల్స్, ఇంజినీరింగ్, జెమ్స్ అండ్ జ్యువెలరీ ఉత్పత్తులు అమెరికాకు ఎక్కువగా ఎగుమతయ్యాయని ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఎక్స్పోర్ట్ ఆర్గనైజేషన్ (ఎఫ్ఐఈఓ) ప్రెసిడెంట్ శక్తివేల్ తెలిపారు. భారత్ – అమెరికాల మధ్య వాణిజ్యం రానున్న నెలల్లో మరింత బలపడుతుందని చెప్పారు.
‘గ్లోబల్ కంపెనీలకు భారత్ నమ్మదగ్గ ట్రేడింగ్ భాగస్వామిగా మారింది. కంపెనీలు సరఫరాల కోసం పూర్తిగా చైనాపై ఆధారపడడాన్ని తగ్గించుకుంటున్నాయి. భారత్ వంటి దేశాలపై ఆధారపడుతూ తమ వ్యాపారాలను వైవిధ్యం చేసుకుంటున్నాయి’ అని ఎఫ్ఐఈఓ వైస్ ప్రెసిడెంట్ ఖలీద్ ఖాన్ పేర్కొన్నారు. ప్రపంచంలోనే మూడో అతిపెద్ద కన్జూమర్ మార్కెట్ కావడం, ఎకానమీ వేగంగా వృద్ధి చెందుతుండడంతో వాణిజ్యానికి భారత్ తో అమెరికాకు బోలెడు అవకాశాలు ఉన్నాయని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లాంటేషన్ మేనేజ్మెంట్ (ఐఐపీఎం) డైరెక్టర్ రాకేష్ మోహన్ జోషి చెప్పారు.
‘పెట్రోలియం ప్రొడక్ట్లు, పాలిష్ చేసిన డైమండ్స్, ఫార్మాస్యూటికల్ ప్రొడక్ట్లు, జ్యువెలరీ, లైట్ ఆయిల్స్ అండ్ పెట్రోలియం, గడ్డకట్టిన రొయ్యలు వంటివి భారత్ నుంచి యూఎస్కు ఎక్కువగా ఎగుమతి అవుతున్నాయి. క్రూడ్ పెట్రోలియం, రఫ్ డైమండ్స్, లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్, గోల్డ్, బొగ్గు , ఆల్మండ్స్ వంటివి అమెరికా నుంచి భారత్ కు ఎక్కువగా దిగుమతి చేసుకుంటోంది’ అని జోషి వివరించారు.
కాగా, 2013–14 నుంచి 2017–18 మధ్య, ఇంకా 2020–21లో భారత్ కు అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా చైనా నిలిచింది. అంతకు ముందు యూఏఈ అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా ఉంది. 2022–23లో భారత్, యూఏఈ మధ్య 76.16 బిలియన్ డాలర్ల విలువైన వాణిజ్యం జరిగింది. ఈ దేశం భారత్ మూడో అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా ఉంది. 52.72 బిలియన్ డాలర్లతో నాలుగో స్థానంలో సౌదీ అరేబియా, 35.55 బిలియన్ డాలర్లతో ఐదో స్థానంలో సింగపూర్ ఉన్నాయి.
More Stories
సీఎం జగన్పై రాయి దాడి కేసులో సతీష్ అరెస్ట్
ఐరాస సంస్కరణలకు అమెరికా మద్దతు
రూ 100 కోట్ల శిల్పాశెట్టి భర్త ఆస్తుల ఈడీ జప్తు