పేపర్ లీకేజీపై రంగంలోకి దిగిన ఈడీ

టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ పై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) కేసు నమోదు చేసి రంగంలోకి దిగింది. పబ్లిక్ డొమైన్ లో ఉన్న ఆధారాలతో కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. పేపర్ లీక్ పై సిట్ తో పాటుగా ఈడీ అధికారులు విచారణ చేపట్టబోతున్నారు. పేపర్ లీక్ లో హవాలా ద్వారా నగదు లావాదేవీలు జరిగినట్లుగా ఈడీ భావిస్తుంది.
 
అయితే సిట్ కేవలం పేపర్ లీకేజి గురించి మాత్రమే విచారణ జరుపుతుండగా, తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుండి, ఉమ్మడి రాష్ట్రంలోని పబ్లిక్ సర్వీస్ కమీషన్ రెండుగా విడిపోయినప్పటి నుండి అందులో జరుగుతున్న పరిణామాల గురించి లోతైన దర్యాప్తు జరుపనున్నట్లు చెబుతున్నారు. ముఖ్యంగా అక్రమ ఆర్ధిక లావాదేవీలపై దృష్టి సారింపనున్నారు.
 
పేపర్ లీక్ కేసులో ఇప్పటికే అరెస్ట్ అయిన 15 మందిని ఈడీ తిరిగి విచారించనుంది. అవసరమైన పక్షంలో టీఎస్పీఎస్సీ సభ్యులు, సెక్రెటరీని విచారించే అవకాశం ఉంది. తెలంగాణలో ఈడీ తాజాగా రెండు ముఖ్యమైన వ్యవహారాలపై కేసులు నమోదు చేసింది. ఇప్పటికే వ్యక్తిగత డేటా చోరీ పైనా  కేసు నమోదు చేసిన ఈడీ బ్యాంకులతోపాటు పలు సంస్థలకు నోటీసులు ఇవ్వనుంది.
 
కమిషన్‌ చైర్మన్‌ జనార్దన్‌రెడ్డిని సోమవారం సిట్‌ చీఫ్‌ ఏఆర్‌ శ్రీనివాస్‌ నేతృత్వంలోని బృందం ప్రశ్నించింది. కమిషన్‌ విధి విధానాలు, పేపర్‌ లీకేజీ అంశాలపై మూడున్నర గంటలపాటు వివరాలు సేకరించింది. పేపర్‌ లీకేజీలో టీఎస్‌పీఎస్సీ కార్యదర్శి అనితా రామచంద్రన్‌ పీఏ ప్రవీణ్‌కుమార్‌, సిస్టమ్‌ అడ్మిన్‌ రాజశేఖర్‌రెడ్డి కీలకంగా వ్యవహరించారు.
 
వీరి నుంచి గ్రూప్‌-1 పేపర్‌ కమిషన్‌ సభ్యుడు లింగారెడ్డి పీఏ రమేశ్‌కు వెళ్లింది. దీంతో కార్యదర్శి, కమిషన్‌ సభ్యుడిని సిట్‌ విచారించి, పలు విషయాలను సేకరించింది.  టీఎస్‌పీఎస్సీ ర్యదర్శి పీఏ ప్రవీణ్‌కుమార్‌, సిస్టమ్‌ అడ్మిన్‌ రాజశేఖర్‌రెడ్డికి సంబంధించి ఆరోపణలున్నాయా? మీ దృష్టికి వచ్చాయా? అనే విషయాలను తెలుసుకున్నారు.
 
పేపర్లకు శంకరలక్ష్మి బాధ్యతగా ఉంటారని మీరు భావించారా? గతంలో ఇలాంటి సమస్యలు కార్యాలయంలో అంతర్గతంగా చర్చించడం జరిగిందా? అనే విషయాలను అడిగినట్టు తెలిసింది. సిట్‌ ప్రశ్నలకు సవివరంగా టీఎస్‌పీఎస్సీ చైర్మన్‌ సమాధానాలు చెప్పినట్టు సమాచారం. పేపర్‌ లీకేజీ ఘటనపై సిబ్బంది నిర్లక్ష్యంపై కూడా అంతర్గతంగా విచారణ జరుపుతున్నామని సిట్‌కు చెప్పినట్టు తెలిసింది.