వికారాబాద్ లో పదవ తరగతి తెలుగు పేపర్ లీకేజీ కావడం పట్ల ఆవేదన వ్యక్తం చేస్తూ అందుకు బాధ్యత వహిస్తూ విద్యామంత్రి సబితా ఇంద్రారెడ్డి వెంటనే రాజీనామా చేయాలని రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ డిమాండ్ చేశారు.
ప్రశ్నపత్రాల లీకేజికి ఆస్కారం లేకుండా పదవి తరగతి పరీక్షలను నిర్వహించడంలో తెలంగాణ ప్రభుత్వం ఘోరంగా విఫలమైనదని ఆయన విమర్శించారు. కేసీఆర్ ప్రభుత్వంలో పరీక్షల లీకేజీ సర్వసాధారణంగా మారినట్లు కన్పిస్తొందని చెబుతూ తెలంగాణలో పరీక్షలు వస్తే లీకేజీల జాతర నడుస్తోందని ఎద్దేవా చేశారు.
పరీక్షలు కూడా సక్రమంగా నిర్వహించలేని చేతగాని ప్రభుత్వం ఇంకా కొనసాగుతుండటం సిగ్గుచేటని విమర్శించారు. ప్రభుత్వ చేతగానితనం విద్యార్థుల జీవితాలకు శాపంగా మారిందని ధ్వజమెత్తారు.
కొన్ని కార్పొరేట్, ప్రైవేట్ యాజమాన్యాలకు ప్రభుత్వం తొత్తుగా మారి ఇలాంటి నీచపు చర్యలకు పాల్పడుతున్నట్లు అనుమానాలు కలుగుతున్నాయని సంజయ్ ఆరోపించారు. ఈ లికేజీతో ప్రభుత్వ, చిన్న చిన్న ప్రైవేట్ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదం ఏర్పడిందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
టెక్నాలజీని పేపర్ లీకేజీ కోసం ఉపయోగించుకుంటున్నా నియంత్రించడంలో ప్రభుత్వం విఫలమైందని అంటూ పేపర్ లికేజ్ కి ప్రభుత్వమే బాధ్యత వహించాలని స్పష్టం చేశారు. ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలు విద్యార్థుల జీవితాలను దెబ్బతీస్తున్నాయని చెప్పారు.
టెన్త్ పరీక్షలు 90 శాతం సిలబస్ తో ఒకే పేపర్ గా పరీక్ష నిర్వహించడంవల్ల విద్యార్థుల్లో ఇప్పటికే ఒత్తిడి కన్పిస్తొందని అంటూ ఈ లికేజ్ ఘటనతో విద్యార్థుల్లో మరింత గంధరగోళం నెలకొందని ఆయన చెప్పారు. మిగిలిన పరీక్షలైనా ప్రశాంత వాతావరణంలో విద్యార్థులు రాసేలా పకడ్బందీగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని కోరారు.
More Stories
హైదరాబాద్ లో బిజెపి ఓట్లు తొలగించారు
హైదరాబాద్ జూలో మగ తెల్లపులి మృత్యువాత
నిశ్శబ్ద విప్లవ ఫలితం జూన్ 4న తెలుస్తుంది