అరుణాచల్ పై ‘జీ20’ సాక్షిగా చైనాకు భారత్ ఝలక్

అరుణాచల్ ప్రదేశ్‌ను దక్షిణ టిబెట్‌గా చెబుతూ, తమ దేశంలో భాగమని వాదిస్తున్న చైనాకు జి20 అధ్యక్ష హోదాలో భారత్ ఝలక్ ఇచ్చింది. చైనా కూడా భాగస్వామ్యమైన జి20 సమావేశం ఒకదానిని అక్కడ జరపడం ద్వారా ఆ ప్రాంతం భారత్ లో అంతర్భాగమే అంటూ స్పష్టం చేసింది. ఈ సమావేశానికి హాజరుకాని చైనా బహిరంగంగా స్పందించకపోవడం గమనార్హం.
 
అరుణాచల్ ప్రదేశ్‌కు చెందిన అధికారులకు వీసాలు ఇవ్వొద్దని కూడా చైనా డిసైడయ్యింది. అంతే కాదు ఆ మధ్య అరుణాచల్ ప్రదేశ్ వాసులకు మామూలు వీసాల బదులు కాగితపు వీసాలను జారీ చేసింది. రాష్ట్రపతి, ప్రధానమంత్రి వంటి భారతదేశ అత్యున్నత హోదాగలవారు అరుణాచల్ ప్రదేశ్ లో పర్యటనలు జరిపినా అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ వచ్చింది.
 
అరుణాచల్ ప్రదేశ్ భూభాగంలోకి చైనా సైనికులు చొచ్చుకొని వచ్చిన సందర్భాలూ ఉన్నాయి. అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దుల్లో చైనా సైనికులు మోహరించడం, పలు నిర్మాణాలు చేపట్టడం కూడా జరుగుతుంది. ఈ నేపథ్యంలో నరేంద్ర మోదీ సర్కారు ఇచ్చిన ఝలక్ చైనాను నివ్వెరపోయేటట్లు చేసిందని చెప్పవచ్చు.

భారత్ జీ20 అధ్యక్ష హోదాలో ఢిల్లీలో సెప్టెంబర్ నెలలో నిర్వహించనున్న జీ20 సదస్సుకు ముందు దేశంలోని 50 నగరాల్లో పదుల సంఖ్యలో జీ20కి సంబంధించిన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా అరుణాచల్ ప్రదేశ్ రాజధాని ఈటానగర్‌లో జీ20 సమావేశాన్ని పెద్దగా ప్రచారంలేకుండా నిర్వహించింది.

 
ఇందులో 50 మందికిపైగా ప్రతినిధులు పాల్గొన్నారు. కానీ చైనా మాత్రం ఈ భేటీకి దూరంగా ఉంది. అంతేకాకుండా, ఈ సమావేశం విషయమై చైనా విదేశాంగ శాఖ నోరు మెదపలేదు.  ‘రీసెర్చ్ ఇన్నోవేషన్ ఇనిషియేటివ్, గేథరింగ్’ థీమ్‌తో నిర్వహించిన ఈ జీ20 భేటీకి మీడియాను దూరంగా ఉంచారు.
 
సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగం ఈ సమావేశాన్ని నిర్వహించింది. ఈ సదస్సుకు హాజరైన వారికి అరుణాచల్ ప్రదేశ్ అసెంబ్లీతోపాటు, అక్కడి బౌద్ధ మఠాలను చూపించింది. ఈటానగర్‌ స్థానిక రుచులను అతిథులకు రుచి చూపించింది. ఈ సమావేశం విషయమై చైనా తన నిరసనను భారత్‌కు వ్యక్తం చేసిందా లేదా అనేది తెలియరాలేదు.
 
తవాంగ్ సెక్టార్లో కొద్ది నెలల క్రితమే భారత్, చైనా సైనికులు ఘర్షణకు దిగిన నేపథ్యంలో భారత్ అరుణాచల్ ప్రదేశ్‌లో ఈ భేటీ నిర్వహించడం ప్రాధాన్యం సంతరించుకుంది. అరుణాచల్ ప్రదేశ్‌లోని తవాంగ్, యాంగ్జే ప్రాంతాలు టిబెటన్ బుద్ధిజానికి కీలకమైనవి. సాంస్కృతికంగా ఈ ప్రాంతానికి టిబెట్‌తో అనుబంధం ఉంది.
 
ఆరో దలైలామా త్సయాంగ్ గ్యాత్సో జన్మించింది ఇక్కడే. 14 వేల నుంచి 17 వేల అడుగుల ఎత్తు, 15 కిలోమీటర్ల పొడవు, పది కిలోమీటర్ల వెడల్పు ఉన్న యాంగ్జే పీఠభూమి తవాంగ్ ప్రాంత రక్షణకు కీలకమైంది. ఈ ప్రాంతం వల్ల చైనా సైన్యంపై ఆధిపత్యం చెలాయించడం భారత సైన్యానికి సులువు అవుతోంది.
 
అందుకే ఈ ప్రాంతాన్ని చేజిక్కించుకోవడానికి చైనా ఎప్పటికప్పుడు కుటిల ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పుడు అదే అరుణాచల్ ప్రదేశ్‌లో జీ20 స్థాయి భేటీ నిర్వహించడం ద్వారా ఈ ప్రాంతం తమ దేశ అంతర్భాగం అని భారత్ స్పష్టం చేసినట్లయింది.