లండన్‌ భారత హైకమిషన్‌పై దాడి నిందితుడి అరెస్ట్

లండన్‌లోని భారత హైకమిషన్‌పై హింసాత్మక దాడి, తదుపరి నిరసనల సమయంలో చట్టవిరుద్ధమైన చర్యలకు సంబంధించిన 2023 కేసులో కీలక నిందితుడిని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) గురువారం అరెస్టు చేసింది. మార్చి 22, 2023 న జరిగిన నిరసనల సందర్భంగా చట్టవిరుద్ధమైన కార్యకలాపాలకు పాల్పడినందుకు ఇంగ్లాండ్ లోని హౌన్స్లో నివాసి ఇంద్రపాల్ సింగ్ గాబాను అరెస్టు చేసినట్లు ఏజెన్సీ విడుదల చేసిన ప్రకటన తెలిపింది.
 
గత ఏడాది మార్చి 19, 22 తేదీల్లో లండన్‌లో జరిగిన సంఘటనలు భారతీయ మిషన్లు, దాని అధికారులపై దుర్మార్గపు దాడులకు పాల్పడే పెద్ద కుట్రలో భాగమని ఈ కేసులో ఇప్పటివరకు  ఎన్ఐఏ దర్యాప్తులో తేలింది. మార్చి 18, 2023న ఖలిస్తానీ అనుకూల వేర్పాటువాది అమృతపాల్ సింగ్‌పై పంజాబ్ పోలీసులు తీసుకున్న చర్యకు ప్రతీకారంగా మార్చి 2023లో లండన్‌లో దాడులు జరిగినట్లు తేలింది.
 
ఈ కేసులో తదుపరి విచారణ కొనసాగుతోందని ఆ ప్రకటనలో తెలిపారు. పంజాబ్ పోలీసులు అమృతపాల్ సింగ్‌ను పట్టుకోవడానికి విస్తృతమైన వేటను ప్రారంభించారు. అతన్ని పారిపోయిన వ్యక్తిగా ప్రకటించారు. ఒక నెల తరువాత, అతను పంజాబ్‌లోని మోగా పోలీసులకు లొంగిపోగా అరెస్ట్ చేశారు.
 
మార్చి 19న వేర్పాటువాద ఖలిస్థానీ జెండాలు చేతబూని, ఖలిస్తానీ అనుకూల నినాదాలు చేస్తూ నిరసనకారుల బృందం లండన్‌లోని భారత హైకమిషన్ పైన ఎగురుతున్న త్రివర్ణ పతాకాన్ని పట్టుకుంది. అనేక మంది నిరసనకారులు పసుపు, నలుపు రంగుల ఖలిస్తాన్ జెండాను పట్టుకుని రాడికల్ సిక్కు బోధకుడు,  ఖలిస్తాన్ సానుభూతిపరుడు అమృతపాల్ సింగ్‌ను “విముక్తి” చేయాలని పిలుపునిచ్చినట్లు సంఘటన వీడియోలు చూపించాయి.
 
నిరసనకారులలో ఒకరు బాల్కనీపైకి దూసుకెళ్లి, ఇతర వ్యక్తులను ఉత్సాహపరిచేందుకు హైకమిషన్ ముందు ఉన్న స్తంభం నుండి భారత జెండాను క్రిందికి లాగడం కూడా వీడియోలలో కనిపించింది. బ్రిటీష్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని నిరసనకారులను భారత హైకమిషన్ ప్రవేశ ద్వారం వద్దకు రాకుండా అడ్డుకున్నారు.
 
ఏప్రిల్ 2023లో, హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖలోని కౌంటర్ టెర్రరిజం, కౌంటర్ రాడికలైజేషన్ (సీటీసీఆర్) విభాగం ఈ కేసును  ఎన్ఐఏకి అప్పగించింది. ఏప్రిల్ నెలలో ఇంగ్లాండ్  ప్రతినిధులతో జరిగిన సమావేశం తరువాత హోం మంత్రిత్వ శాఖ కేసును  ఎన్ఐఏకి అప్పగించాలని నిర్ణయం తీసుకుంది. సైబర్ నేరాలు,  మానవ అక్రమ రవాణా మాత్రమే కాకుండా విదేశాలలో భారతీయులకు, భారతీయ ప్రయోజనాలకు వ్యతిరేకంగా ఉగ్రవాద కార్యకలాపాలపై దర్యాప్తు చేయడానికి ఏజెన్సీకి అధికారం కల్పిస్తూ కేంద్రం ఆగస్టు 2019లో ఎన్ఐఏ చట్టాన్ని కూడా సవరించింది.
 
హోం మంత్రిత్వ శాఖ (ఎంహెచ్‌ఏ) ఆదేశాల మేరకు యాంటీ టెర్రర్ ఏజెన్సీ ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ (ఎఫ్‌ఐఆర్) నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించింది. చట్టవిరుద్ధ కార్యకలాపాల నిరోధక చట్టం (యూఏపీఎ) కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన ఢిల్లీ పోలీసుల నుండి ఏజెన్సీ కేసును స్వీకరించింది.  ప్రస్తుతం దానిపై దర్యాప్తు చేస్తోంది.