అరెస్ట్ చేయొద్దన్న కవిత అభ్యర్థనకు `సుప్రీం’ తిరస్కరణ

ఎమ్మెల్సీ కవితకు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. ఈడీ తనను అరెస్ట్ చేయొద్దన్న కవిత అభ్యర్థనను సుప్రీంకోర్టు తిరస్కరించింది. దీనిపై మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు అత్యున్నత న్యాయస్థానం నిరాకరించింది. ఢిల్లీ మద్యం కేసులో ఈడీ సమన్లపైనా కోర్టు ఎలాంటి స్టే ఇవ్వకపోవడం చర్చనీయాంశంగా మారింది.

పీఎంఎల్ఎ కింద మహిళలను ఈడీ కార్యాలయంలో ప్రశ్నించడంపై విచారణకు సుప్రీం అంగీకరించింది. ఇదే తరహా వినతితో ఉన్న నళిని చిదంబరం పిటిషన్ తో కవిత పిటిషన్ ను జత చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఆ తర్వాత కేసు విచారణను 3 వారాలకు వాయిదా వేసింది.

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఎమ్మెల్సీ కవితను ఈడీ మార్చి 11న తొలిసారి విచారించింది. ఆ తర్వాత 16న మరోసారి హాజరుకావాలని నోటీసులు జారీ చేసింది. అయితే  చట్టప్రకారం మహిళలను వారి ఇంటిదగ్గరే విచారించాల్సి ఉన్నా ఈడీ కార్యాలయానికి తనను పిలవడాన్ని సవాల్‌చేస్తూ కవిత మార్చి 14న సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు.

దీనిపై అత్యవసర విచారణ చేపట్టాలని ఆమె తరఫు న్యాయవాదులు 15న సీజేఐ జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ ధర్మాసనాన్ని కోరారు. సీజేఐ మాత్రం అందుకు తిరస్కరించి ఈ నెల 24న విచారిస్తామని చెప్పారు. కానీ ఆరోజు కేసు విచారణకు రాలేదు. దీంతో మార్చి 27వ తేదీన జస్టిస్‌ అజయ్‌రస్తోగి, జస్టిస్‌ బేలా ఎం.త్రివేది ధర్మాసనం ఈ కేసు విచారణ చేపట్టింది.

ఢిల్లీ లిక్కర్ స్కాం విచారణను ఈడీతో కాకుండా కోర్టు పర్యవేక్షణలోని సిట్ ఏర్పాటు చేసి, విచారణ చేయాలంటూ ఎమ్మెల్సీ కవిత సుప్రీంకోర్టును కోరారు. ఈడీ విచారణను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ లో అభ్యర్థించారు. ఈడీ సమన్లు రద్దు చేయాలని, మహిళలను ఇంటి వద్దే విచారణ చేయాలని, తనను అరెస్ట్ చేయకుండా ఆదేశాలివ్వాలని  పిటిషన్ వేశారు.

కవిత పిటిషన్‌పై సోమవారం జస్టిస్ అజయ్ రస్తోగి, జస్టిస్ బేలా త్రివేది ధర్మాసనం విచారణ జరిపింది. కవిత తరపున కపిల్ సిబల్ వాదనలు వినిపించారు. లిఖితపూర్వక వాదనలు సమర్పించాలని ఈడీ, కవితకు సుప్రీం ఆదేశాలు జారీ చేసింది.

మహిళలను ఈడీ ఆఫీస్‌కు పిలిచి విచారించే విషయంలో గతంలో దాఖలైన నళినీ చిదంబరం పిటిషన్‌ను సుప్రీం ట్యాగ్ చేసింది. అయితే అడిషనల్ సొలిసిటర్ జనరల్ దీనిని వ్యతిరేకించారు. ఈడీ తరఫున సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా, అదనపు సొలిసిటర్‌ జనరల్‌ ఎస్వీ రాజు వాదనలు వినిపించారు.

విజయ్ మండల్‌ జడ్జిమెంట్‌ పీఎంఎల్‌ఏ కేసుల్లో వర్తించదని, పీఎంఎల్‌ఏ చట్టం కింద ఎవరినైనా విచారణకు పిలిచే అధికారం ఈడీకి ఉంటుందని.. పీఎంఎల్‌ఏ సెక్షన్‌ 160 ఇక్కడ వర్తించదని ఈడీ వాదించింది. ఆపై లిఖిత పూర్వక వాదనలు సమర్పించాలని ఈడీ, కవితలను ఆదేశిస్తూ  ధర్మాసనం పిటిషన్‌పై విచారణను మూడు వారాలకు వాయిదా వేసింది. ఈ కేసులో చాలా కోర్ అంశాలున్నాయని, అన్నింటినీ లోతుగా విచారణ చేయాలని సుప్రీం తెలిపింది.