విదేశాలకూ టీఎస్‌పీఎస్‌సీ పేపర్‌ లీకేజీ

టీఎస్‌పీఎస్‌సీ పేపర్‌ లీకేజీ విదేశాలకూ వ్యాపించినట్లు తెలుస్తున్నది. అక్టోబర్‌ నుంచే పేపర్‌ లీక్‌ అయినట్లు అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఆ దిశగా విచారణ చేస్తున్నారు. గ్రూప్‌-1 పేపర్‌ను రాజశేఖర్‌ చాలా మందికి అమ్ముకున్నట్లు సిట్‌ అనుమానం వ్యక్తం చేసింది.  గ్రూప్‌-1 రాసిన వారిలో విదేశాల నుంచి ఇద్దరు ఉన్నట్లు అధికారులు గుర్తించినట్లుగా సమాచారం.
వీళ్లను కూడా విచా రించేందుకు సిట్‌ సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తోంది. కరీం నగర్‌కు చెందిన ఆరుగురికి రాజశేఖర్‌ గ్రూప్‌-1 పేపర్‌ ఇచ్చినట్లు పోలీసుల విచారణలో తేలినట్లు సమాచారం.  అందులో పలువురు ఎన్‌ఆర్‌ఐలతో పాటు, మరికొంత మంది స్థానికులు గ్రూప్‌-1 పరీక్షలు రాసినట్లు అధికారులు గుర్తించారు. పరీక్షలు రాయడానికి నలుగురు ఎన్‌ఆర్‌ఐలు విదేశాల నుంచి ఇక్కడికి వచ్చారు.
పేపర్‌ విక్రయించడం ద్వారా వచ్చిన డబ్బులను రాజశేఖర్‌ స్నేహితులు, బంధువుల ఖాతాల్లో జమ చేసినట్లు తెలుస్తోంది.  అయితే దీనిపై అధికారులు మరింత లోతుగా విచారణ జరిపి అసలు నిజాలను బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. గతేడాది అక్టోబర్‌ నుంచి టీఎస్‌పీఎస్‌సీ ఏడు పరీక్షలను నిర్వహించింది.
దీంతో ఈ ఏడు పోటీ పరీక్షల్లో టాప్‌ స్కోర్‌ సాధించిన 500 మంది జాబితాను సిద్దం చేసినట్లు తెలి సింది. దాదాపు 100కు పైగా మార్కులు వచ్చిన వారందరినీ సైతం సిట్‌ అధికారులు విచారించనున్నట్లు తెలుస్తోంది.  టీఎస్‌పీఎస్సీ పేపర్‌ లీకేజీ వ్యవహారంపై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. ఈ కేసు స్టేటస్‌ రీపోర్టను సమర్పించాలని ప్రభుత్వాన్ని న్యాయస్థానం ఆదేశించింది. ఇందుకు సమయం కావాలని ప్రభుత్వం కోరడంతో మూడు వారాలు గడువు ఇచ్చింది. తదుపరి విచారణను ఏప్రిల్‌ 11కు వాయిదా వేసింది.
ఎబివిపి ప్రగతి భవన్ ముట్టడి 

టీఎస్ పీఎస్సీ ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారం తెలంగాణలో కలకలం రేపింది. దీని వెనుక ఉన్నవారిని కఠినంగా శిక్షించాలని అందరూ డిమాండ్ చేస్తున్నారు. ఈ లీకేజీపై ఏబీవీపీ ఆందోళనకు పిలుపునిచ్చింది. ఇందులో భాగంగా ఏబీవీపీ కార్యకర్తలు ప్రగతి భవన్ ముట్టడికి ప్రయత్నించారు. ఈ సందర్భంగా ప్రగతి భవన్ వద్ద భారీగా మోహరించిన పోలీసులు వారిని అడ్డుకున్నారు.

దీంతో ప్రగతి భవన్ వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఏబీవీపీ కార్యకర్తలపై పోలీసులు అమానుషంగా వ్యవహరించారు. అక్కడ పోలీసులకు, ఏబీవీపీ కార్యకర్తలకు మధ్య వాగ్వాదం చెలరేగింది. ప్రగతి భవన్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఏబీవీపీ కార్యకర్తలను అరెస్ట్ చేసిన పోలీసులు గోషామహల్ పోలీస్ స్టేషన్ కు తరలించారు.

 పేపర్ లీకేజీ ఘటనపై సీయం కేసీఆర్ స్పందించాలని, టీఎస్ పీఎస్ సి చైర్మన్,కార్యదర్శులను వెంటనే  బర్తరఫ్ చేయాలని,  సీఎం  కేసిఆర్ వెంటనే రాజీనామా చేయాలని వారు డిమాండ్ చేశారు.