పాక్ నుంచి బెదిరింపు కాల్స్ … రాజాసింగ్ డిజిపికి లేఖ

తనను చంపుతామని తనకు పాకిస్థాన్ నుంచి బెదిరింపు కాల్స్ వస్తున్నాయని అనేక సార్లు ఫిర్యాదు చేసినా తెలంగాణ పోలీసులు పట్టించుకోవడం లేదని, కనీసం ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయలేదని గోషామహల్ ఎమ్యెల్యే రాజాసింగ్ ఆందోళన వ్యక్తం చేశారు.  తాను జై శ్రీరామ్ అన్న ప్రతిసారీ తన మీద ఎఫ్ఐఆర్ బుక్ చేసే పోలీసులు.. ఇప్పుడు ఎందుకు చేయట్లేదని ఆయన ప్రశ్నించారు.
 
ఈ విషయమై తెలంగాణ డిజిపి అంజనీ కుమార్ కు ఓ లేఖ వ్రాస్తూ తనకు ప్రాణహాని ఉందని లైసెన్స్ గన్ ఇవ్వాలని కోరారు. రక్షణ కోసం పదేపదే కోరుతున్నా స్పందించడం లేదని అసహనం వ్యక్తం చేశారు. తనపై కేసులున్నాయని అభ్యంతరం వ్యక్తం చేస్తున్న పోలీస్ శాఖ.. కేసులున్న ఎవ్వరికీ లైసెన్స్ ఇవ్వలేదా అని ప్రశ్నించారు.
 

తనకు ఎనిమిది నంబర్ల నుండి బెదిరింపు కాల్స్ వస్తున్నాయని ఆ లేఖలో ఆయన పేర్కొన్నారు.  ఫిబ్రవరి 22న  బెదిరింపు కాల్స్ పై పోలీసులకు ఫిర్యాదు చేసినట్టుగా తెలిపారు. తనకు కొన్ని నెంబర్ల నుంచి వాట్సాప్ కాల్స్, వాట్సాప్ లలో సందేశాలు వస్తున్నాయని ఫిర్యాదులో చెప్పారు. తనకు వచ్చే బెదిరింపు కాల్స్ ఫోన్ నెంబర్లను కూడా పేర్కొన్నారు.

 
గన్ లైసెన్స్ కోసం ఇప్పటివరకు పోలీసుల వద్ద చాలాసార్లు అభ్యర్థన పెట్టుకున్నానని, తనపై కేసులు ఉన్నాయన్న కారణంతో పోలీసులు గన్ లైసెన్స్ ఇవ్వటం లేదని తెలిపారు. కేసులు ఉన్నా కూడా లైసెన్స్ పొందిన వ్యక్తులు ఉన్నారని రాజాసింగ్ గుర్తు చేశారు. తనకు ప్రాణహాని ఉందని మెురపెట్టుకుంటున్నా గన్ లైసెన్స్ ఇవ్వడం లేదని డీజీపీకి రాసిన లేఖలో రాజాసింగ్ ఆవేదన వ్యక్తం చేశారు.
 
కాగా.. రాజాసింగ్‌కు గతంలో కూడా బెదిరింపు కాల్స్ వచ్చాయి. దీంతో ప్రభుత్వం ఆయనకు భద్రత పెంచింది. బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని కూడా కేటాయించారు. అయితే గత కొంత కాలంగా బుల్లెట్ ఫ్రూప్ వాహనం తరచూ రిపేర్లు వస్తూ ఆగిపోతూ ఇబ్బందిగా మారింది.
 
ఈ విషయమై రాజాసింగ్ పలుమార్లు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. తనకు కేటాయించిన వాహనం కండీషన్ సరిగా లేదని, ఎక్కడ పడితే అక్కడ ఆగిపోతుందని ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారు. తనకు మరో వాహనం కేటాయించాలన్నారు. ప్రభుత్వం స్పందించకపోవటంతో వాహనాన్ని ప్రగతిభవన్ వద్ద వదిలేసి వెళ్లిపోయారు.
 
 ఆ తర్వాత ప్రభుత్వం ఆయనకు మరో బుల్లెట్ ఫ్రూప్ వాహనాన్ని కేటాయించింది. తాజాగా తనకు బెదిరంపు కాల్స్ వస్తున్నాయంటూ రాజాసింగ్ డీజీపీకి లేఖ రాయటం చర్చనీయాంశమైంది