బెంగళూరు చేరిన నాసా-ఇస్రో ఉపగ్రహం `నిసార్’

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో), అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ (నాసా) సంయుక్తంగా రూపొందించిన ఉపగ్రహంను త్వరలో ప్రయోగించడానికి వేగంగా సన్నాహాలు జరుగుతున్నాయి. దీని కోసం ఆ ఉపగ్రహాన్ని అమెరికా వైమానిక దళానికి చెందిన రవాణా విమానంలో భారత్‌కు తరలించారు. నాసా-ఇస్రో సింథటిక్ ఎపర్చర్ (నిసార్) ఉపగ్రహాన్ని సీ-17 విమానంలో కాలిఫోర్నియా నుంచి బెంగళూరుకు బుధవారం చేర్చారు.

ప్రపంచ వ్యాప్తంగా భూమి క్రస్ట్‌, ఉపరితలం, మంచు ప్రాంతాల్లో మార్పులను పరిశీలించేందుకు అమెరికా, భారత్‌ కలిసి సంయుక్తంగా ఈ మిషన్‌ చేపట్టనున్నాయి.  ‘నిసార్‌’ ఉపగ్రహం ద్వారా భూ పర్యావరణ వ్యవస్థలలో మార్పులను గమనిస్తారు.

అలాగే భూకంపాలు, అగ్నిపర్వత పేలుళ్లు, సముద్ర మట్టం పెరుగుదల వంటి ప్రకృతి వైపరీత్యాల సంకేతాలను ఈ శాటిలైట్‌ గుర్తించడంతోపాటు హెచ్చరికలు జారీ చేస్తుంది. తద్వారా భూమి క్రస్ట్‌, ఉపరితలంలో జరుగుతున్న మార్పుల అధ్యయానికి ఇది సహకరిస్తుంది.

కాగా, హిమాలయాల్లోని హిమానీనదాలు, కొండచరియలు విరిగిపడే అవకాశం ఉన్న ప్రాంతాల పరిశీలన, పర్యవేక్షణకు ఈ శాటిలైట్‌ను ఇస్రో వినియోగిస్తుంది. ఎస్‌యూవీ వాహనం అంత పరిమాణం, సుమారు 2,800 కిలోల బరువున్న నిసార్‌ ఉపగ్రహంలో ఎల్‌-బ్యాండ్‌, ఎస్‌-బ్యాండ్, సింథటిక్ ఎపర్చర్ రాడార్ (ఎస్‌ఏఆర్‌) వంటి పరికరాలు ఉన్నాయి.

ఎస్‌-బ్యాండ్‌, ఎస్‌ఏఆర్‌ ద్వారా మేఘాలు, దట్టమైన అడవుల పై నుంచి కూడా కింద ఉన్న వాటిని స్పష్టంగా చూడవచ్చు. అధిక రిజల్యూషన్ చిత్రాలను రూపొందించవచ్చు. మరోవైపు 2024లో ఆంధ్రప్రదేశ్‌లోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి ఈ శాటిలైట్‌ను ధ్రువ కక్ష్యలోకి పంపనున్నారు. అమెరికా, భారత్‌ మధ్య పౌర, అంతరిక్ష సహకారంలో మరో ప్రధాన అడుగు ఈ మిషన్‌ అని చెన్నైలోని అమెరికా రాయబార కార్యాలయం పేర్కొంది.