32కు చేరిన రాజ్‌కోట్‌ గేమ్‌ జోన్‌ ప్రమాద మృతులు

గుజరాత్‌లోని రాజ్‌కోట్‌ గేమ్‌ జోన్‌ ప్రమాద మృతుల సంఖ్య 32కు చేరింది. వారిలో తొమ్మిది మంది చిన్నారులు కూడా ఉన్నారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. శనివారం సాయంత్రం రాజ్‌కోట్‌లోని టీఆర్‌పీ గేమ్‌ జోన్‌లో భారీ అగ్ని ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. సందర్శకులంతా ఆటల్లో నిమగ్నమైన సమయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. 

మంటు వారిని చుట్టుముట్టడంతో తప్పించుకునే ప్రయత్నం చేసేలోపై పైకప్పు కూలిపోవడంతో వారు బయటకు రాలేని పరిస్థితి ఏర్పడింది. తీవ్రంగా కాలిపోవడంతో మృతదేహాలను గుర్తించడం కష్టం మారిందని అధికారులు వెల్లడించారు.

ఈ ఘటనకు సంబంధించి ఇప్పటివరకు ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. వారిలో టీఆర్‌పీ గేమ్‌జోన్‌ యజమాని యువ్‌రాజ్‌ సింగ్‌ సోలంకితోపాటు దాని మేనేజర్‌ నితిన్‌ జైన్‌ కూడా ఉన్నారు. ప్రమాద ఘటనపై దర్యాప్తున్న ఆదేశించిన ప్రభుత్వం.. సీనియర్‌ పోలీస్‌ ఆఫీసర్‌ నేతృత్వంలో సిట్‌ను నియమించింది. 72 గంటల్లో నివేదిక ఇవ్వాలని స్పష్టం చేసింది.

కాగా, ప్రమాద జరిగిన ప్రదేశాన్ని రాష్ట్ర హోం మంత్రితో కలిసి సీఎం భూపేంద్ర పటేల్‌ ఆదివారం ఉదయం పరిశీలించారు. అగ్రిప్రమాద కారణాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం దవాఖానలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించారు. వారికి చికిత్స అందించాలని ఆదేశించారు.

ఈ ప్రమాదంపై సిట్ దర్యాప్తు ప్రారంభమైందని రాష్ట్ర హోం మంత్రి సింఘ్వీ తెలిపారు. దర్యాప్తును త్వరగా ముగించి దోషులకు శిక్ష పడేలా చూస్తామన్నారు. గల్లంతైన వ్యక్తి కోసం వెతుకుతున్నామని పేర్కొన్నారు. క్షతగాత్రులకు రాజ్ కోట్ ఎయిమ్స్ లో చికిత్స అందిస్తున్నామని తెలిపారు.

ఈ ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ సహా పలువురు రాజకీయ నాయకులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. టీఆర్పీగా పిలిచే ఈ గేమింగ్ జోన్ కు ఆపరేట్ చేయడానికి అవసరమైన లైసెన్సులు లేవని, రాజ్ కోట్ మున్సిపల్ కార్పొరేషన్ నుంచి ఫైర్ క్లియరెన్స్ కోసం నిరభ్యంతర పత్రం కూడా లేదని తెలిసింది. ఈ అగ్నిప్రమాద ఘటనను గుజరాత్ హైకోర్టు సుమోటోగా స్వీకరించింది. దీనిపై ఈ నెల 27న గుజరాత్ హైకోర్టులో విచారణ జరగనుంది.