
మేలో ప్రారంభమైన ఉత్తరాఖండ్లోని చార్ధామ్ యాత్రకు ఈసారి గతంలో కంటే రెట్టింపు సంఖ్యలో పర్యాటకులు సందర్శించారు. ఈ క్రమంలో గంగోత్రి, యమునోత్రి, కేదార్నాథ్ ప్రాంతాలకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. దీంతో ఈ ఏడాది మృతుల సంఖ్య కూడా పెరిగింది. ఈ యాత్ర ప్రారంభమైన 16 రోజుల్లోనే 56 మంది యాత్రికులు (శుక్రవారం సాయంత్రం నాటికి) మరణించారు.
కేదార్నాథ్ ధామ్ యాత్ర మార్గంలో ఇప్పటివరకు గరిష్టంగా 27 మంది యాత్రికులు మరణించారని అక్కడి అధికారులు వెల్లడించారు. చార్ధామ్ బద్రీనాథ్, కేదార్నాథ్, గంగోత్రి యమునోత్రి ఎత్తైన హిమాలయ ప్రాంతాలలో ఉన్నాయి. ఇక్కడ చాలా కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. దీంతో ఈ ప్రాంతాలకు వెళ్లిన యాత్రికులు ఎక్కువగా గుండెపోటునల మరణించినట్లు వెలుగులోకి వచ్చింది.
ఈ యాత్రలో మృతి చెందిన 56 మందిలో 52 మంది యాత్రికులు గుండె పోటుతో మృతి చెందడం విశేషం. మృతుల్లో ఎక్కువ మంది 60 ఏళ్లు పైబడిన వారేనని అధికారులు చెప్పారు. మరోవైపు యాత్ర మార్గంలో భక్తులకు నిత్యం సూచనలు జారీ చేస్తున్నట్లు వెల్లడించారు. హెల్త్ చెకప్ సమయంలో ఆరోగ్యం బాగోలేని భక్తులను ప్రయాణం చేయవద్దని వైద్యులు కోరుతున్నారు.
దీని తర్వాత కూడా ఎవరైనా యాత్రకు వెళితే రాతపూర్వకంగా ఫారం నింపేలా చర్యలు తీసుకుంటున్నారు. కాలినడకన కేదార్నాథ్, యమునోత్రి ధామ్లను అధిరోహిస్తున్నప్పుడు ఒకటి నుంచి రెండు గంటల తర్వాత ఐదు నుంచి 10 నిమిషాలు విశ్రాంతి తీసుకోవాలని సూచిస్తున్నారు.
దీంతోపాటు వెచ్చని బట్టలు, వర్షం నుంచి రక్షణ కోసం రెయిన్ కోట్, గొడుగు, పల్స్ ఆక్సిమీటర్, థర్మామీటర్ వంటివి తెచ్చుకోవాలని సూచించారు. గుండె జబ్బులు, అధిక రక్తపోటు, ఉబ్బసం, మధుమేహంతో బాధపడే యాత్రికులు అవసరమైన మందులు, వైద్యుల నంబర్ను అందుబాటులో ఉంచుకోవాలని స్పష్టం చేశారు.
More Stories
నాగపూర్ హింసాకాండపై విశ్వహిందూ పరిషత్ ఆగ్రహం
నాగ్పుర్లో ఉద్రిక్త పరిస్థితులు.. పలు ప్రాంతాల్లో కర్ఫ్యూ
మణిపూర్ హింసాకాండ కేసులన్నీ గౌహతికి బదిలీ