బీజాపూర్‌లో ఇద్దరు మావోలు హతం

ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ శనివారం ఎదురుకాల్పులు జరిగాయి. జిల్లాలోని కంకనార్‌ అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలు, మావోయిస్టులకు మధ్య కాల్పులు చోటు చేసుకోగా.. మావోలకు ఎదురుదెబ్బ తగిలింది. ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు మావోయిస్టులు హతమైనట్లు సమాచారం.  సంఘటనా స్థలం నుంచి ఆయుధాలు, వైర్‌లెస్‌ సెట్‌లు, బ్యాక్‌పాక్‌లు, మావోయిస్టుల యూనిఫారాలు, మందులు, నిషేధిత సామగ్రి, సాహిత్యంతో పాటు ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. డీజీఆర్‌ బలగాలు, మావోయిస్టులకు మధ్య గంటల పాటు ఎదురుకాల్పులు జరిగాయి.

కాల్పుల అనంతరం భద్రతా బలగాలు సంఘటనా స్థలంలో ముమ్మరంగా తనిఖీలు నిర్వహిస్తున్నాయి. ఎస్పీ జితేంద్ర యాదవ్ ప్రెస్ నోట్ విడుదల చేశారు. ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందినట్లుగా తెలిపారు. ఇదిలా ఉండగా మొన్న జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఏడుగురు చనిపోయిన విషయం తెలిసిందే. 

ఇదిలా ఉండగా.. బిజాపూర్ జిల్లాలో 33 మంది నక్సలైట్లు శనివారం భద్రత దళాల ఎదుట లొంగిపోయారు. ఇందులో ముగ్గురిపై రూ.3లక్షల రివార్డు ఉందని పోలీసులు పేర్కొన్నారు. గిరిజనులపై మావోయిస్టులు సాగిస్తున్న అత్యాచారాలతోను, ‘బూటకపు’ మావోయిస్టు సిద్ధాంపై నిరాశ చెంది పోలీసులు, సీఆర్‌పీఎఫ్‌ సీరియన్‌ అధికారుల ఎదుట నక్సల్స్‌ లొంగిపోయారని బీజాపూర్‌ సీనియర్‌ ఎస్పీ జితేంద్ర యాదవ్‌ తెలిపారు. ఇప్పటి వరకు మొత్తం 109 మంది లొంగిపోగా.. మరో 189 మంది అరెస్టయ్యారు.