27న `రెమల్ తుఫాన్’ బెంగాల్ తీరం తాకే అవకాశం

పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడినట్లు విశాఖ వాతావరణ శాఖ తెలిపింది. 24 గంటల్లో తుపానుగా మారి అనంతరం తీవ్ర తుపానుగా మారే అవకాశం ఉందని వెల్లడించింది. ఈ తుపానుకు ‘రేమాల్’గా నామకరణం చేసినట్లు విశాఖ వాతావరణ శాఖ అధికారి డాక్టర్ సునంద తెలిపారు. . తుపాను ఈశాన్య దిశగా కదిలి బంగ్లాదేశ్ తీరంలో 27వ తేదీ అర్ధరాత్రి దాటాక తీరం దాటే అవకాశముందని వెల్లడించారు.
ఒడిశా, బంగాల్, బంగ్లాదేశ్​పై తుపాను ప్రభావం చూపుతుందని తెలిపారు. మధ్య బంగాళాఖాతంలోకి మత్స్యకారులు వెళ్లవద్దని హెచ్చరించారు. పోర్టుల్లో ప్రమాద హెచ్చరికలు జారీ చేసినట్లు సునంద తెలిపారు. ఈ రేమాల్ తుపాను ప్రభావం రాష్ట్రంపై ఉండదని, అత్యధిక ఉష్ణోగ్రతలు కొనసాగుతాయన్నారు. తుపాను ప్రభావంతో నైరుతి రుతుపవనాలు వేగంగా కదులుతున్నాయని, నైరుతి రుతుపవనాలు శ్రీలంక వరకు విస్తరించినట్లు వెల్లడించారు.
 
రెమల్ తుఫాను మే 27న పశ్చిమ బెంగాల్ తీరం తాకే అవకాశం ఉందని తెలిపారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర తుపానుగా మారి పశ్చిమ బెంగాల్‌లోని సాగర్‌ ద్వీపం, బంగ్లాదేశ్‌లోని ఖెపుపరా మధ్య ఎక్కడో ఒకచోట తీరాన్ని తాకే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది.  దీంతో పశ్చిమ బెంగాల్‌లోని కోస్తా జిల్లాలో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. 
తుఫాను కారణంగా మే 26, 27 తేదీల్లో కోల్‌కతా, దక్షిణ మరియు ఉత్తర 24 పరగణాలు, పుర్బా మేదినీపూర్, హౌరా జిల్లాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.  ఆయా రోజుల్లో దక్షిణ 24 పరగణాల్లో గంటకు 90 నుండి 100 కి.మీ, పుర్బా మేదినీపూర్‌లో 80 నుండి 90 కి.మీ వేగంతో గాలులు వీస్తాయని, కోల్‌కతా, నార్త్ 24 పరగణాలు మరియు హౌరాలో గంటకు 60 నుండి 70 కి.మీ వేగంతో గాలులు వీస్తాయని హెచ్చరించింది. 
 
తుఫాను ప్రభావంతో మే 25 నుండి ఉత్తర, దక్షిణ ఒడిశాలో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు, ఉరుములతో కూడిన జల్లులు కూడా కురిసే అవకాశం ఉంది. మే 26న మిజోరం, త్రిపుర మరియు దక్షిణ మణిపూర్‌లో చాలా చోట్ల, మే 27, 28 తేదీల్లో అస్సాం, మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, మిజోరం, మణిపూర్ మరియు త్రిపురలలో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.
 
మే 27 ఉదయం వరకు ఉత్తర బంగాళాఖాతంలో మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లవద్దని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. మే 25న జరగనున్న లోక్‌సభ ఎన్నికల ఆరో దశ పోలింగ్‌పై తుపాను ప్రభావం ఉండదని ఐఎండీ కూడా అంచనా వేసింది.