హైదరాబాద్ లో మరోసారి ఏకకాలంలో 20 చోట్ల ఐటీ సోదాలు

తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో మరోసారి ఆదాయపన్ను శాఖ అధికారుల సోదాలు కలకలం రేపుతున్నాయి. రియల్ ఎస్టేట్ కంపెనీలే లక్ష్యంగా ఏకకాలంలో 20 చోట్ల అధికారులు సోదాలు చేస్తున్నారు. దిల్ సుఖ్ నగర్ లోని గూగి రియల్ ఎస్టేట్ ప్రధాన కార్యాలయంతో పాటు రాష్ట్రంలోని పలు రియల్ ఎస్టేట్ కంపెనీల్లో అధికారులు ముమ్మర దాడులు చేస్తున్నట్లు తెలుస్తుంది.
 
గూగి రియల్ ఎస్టేట్ ప్రధాన కార్యాలయంతో పాటు ఫార్మా హిల్స్, వండర్ సిటీ, రాయల్ సిటీ వంటి కంపెనీల్లో కూడా ఐటీ రైడ్స్ జరుగుతున్నాయి. మొత్తం ఐదు బృందాలుగా ఏర్పడిన 20 మంది అధికారులు రియల్ ఎస్టేట్ కార్యాలయాలే లక్ష్యంగా చేస్తున్నారు.
 
కొన్నిరోజుల క్రితం కూడా ఐటీ అధికారులు పలు ఫార్మా కంపెనీల్లో సోదాలు జరిపారు. వీరు పలు రియల్ ఎస్టేట్ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టినట్టు ఆధారాలు లభించినట్టు తెలుస్తుండగా, దీని ఆధారంగానే ఈ సోదాలు జరుగుతున్నాయని సమాచారం. హైదరాబాద్ లో వరుస ఐటీ సోదాలు పలు కంపెనీలను ఆందోళన కలిగిస్తున్నాయి.

నెల క్రితం హైదరాబాద్ లో తో పాటు పలు జిల్లాల్లో వసుధ ఫార్మా కంపెనీలో ఐటీ సోదాలు చేపట్టారు. వసుధ ఫార్మా పేరుతో రాజు అనే వ్యక్తి రియల్ ఎస్టేట్ చేస్తున్నాడు. మొత్తం 15 కంపెనీల పేరుతో రాజు రియల్ ఎస్టేట్ చేస్తున్నట్లు ఐటీ గుర్తించింది. ఈ ఫార్మా కంపెనీకి రాజు చైర్మన్ గా ఉండగా, ఆరుగురు డైరెక్టర్లు కార్యకలాపాలు చూస్తున్నారు.

 వీరందరి ఇళ్లు, కార్యాలయాల్లో అధికారులు సోదాలు జరిపారు. అలాగే ఏపీలోని విజయవాడ, విశాఖ, గుంటూరులో కూడా ఐటీ సోదాలు జరిగాయి.  ఇటీవల మంత్రి మల్లారెడ్డి, అతని సన్నిహితులు, కుటుంబసభ్యుల ఇళ్లల్లో, కార్యాలయాల్లో ఐటీ అధికారులు సోదాలు చేశారు.

ఆ సమయంలో కూడా ఐటీ  అధికారులు భారీగా పాల్గొన్నారు. ఏకంగా 2 రోజుల పాటు జరిగిన ఈ సోదాల్లో అధికారులు రూ.20 కోట్లు, బంగారు ఆభరణాలు సహా పలు కీలక డాక్యుమెంట్స్ స్వాధీనం చేసుకున్నారు. ఇక ఆ తర్వాత మంత్రి గంగుల కమలాకర్, ఎంపీ గాయత్రీ రవి ఇళ్లల్లో, ఆఫీసుల్లో అధికారులు సోదాలు చేశారు. ఆ వెంటనే పలు షాపింగ్ మాల్స్ లో కూడా అధికారులు సోదాలు చేశారు.