ఎట్టకేలకు రాజాసింగ్‌కు మరో పాత బులెట్ ప్రూఫ్ కారు

గోషామహల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్‌కు తెలంగాణ సర్కార్ ఎట్టకేలకు బుల్లెట్‌ ప్రూఫ్‌ వాహనాన్ని మార్పిడి చేసింది. పాత బుల్లెట్ ప్రూఫ్ వాహనం స్థానంలో మరో పాత వాహనాన్ని ప్రభుత్వం కేటాయించింది. ఇంతకు ముందు ఇచ్చిన బుల్లెట్‌ ప్రూఫ్‌ వాహనం తరచు ఆగిపోతూ ఇబ్బంది పెడుతుందని చాలా సార్లు సీఎం కేసీఆర్‌, డీజీపీ, హోంమంత్రి దృష్టికి రాజాసింగ్ తీసుకెళ్లారు.
 
అయితే.. ఆ విషయంలో ప్రభుత్వం సరిగా స్పందించక పోయేసరికి ఈ మధ్యే తన పాత వాహనాన్ని ప్రగతిభవన్‌ వద్ద వదిలేసి వెళ్లిపోయారు. అనంతరం అసెంబ్లీ సమావేశాలకు కూడా ఆయన తన బుల్లెట్ బైక్ మీద వచ్చారు. ఈ నేఫథ్యంలోనే రాజాసింగ్‌కు పాకిస్థాన్ నుంచి బెదిరింపు కాల్స్, మెస్సేజ్‌లు రావటం గమనార్హం.
 
ఈ క్రమంలోనే రాజాసింగ్‌కు పోలీసులు సోమవారం రోజున ఇంకో బుల్లెట్‌ ప్రూఫ్‌ వాహనాన్ని కేటాయించారు. అయితే ఇప్పుడు కేటాయించిన వాహనం కూడా కొత్తది కాకుండా 2017 మోడల్‌ ఫార్చ్యూనర్ కారు ఇవ్వటం గమనార్హం
 
తెలుపు రంగు బుల్లెట్‌ ప్రూఫ్‌ వాహనాన్ని ధూల్‌పేటలో ఉన్న తన ఇంటికి తీసుకు వచ్చినట్లు రాజాసింగ్ తెలిపారు. తాను లేకపోవటంతో అక్కడే వదిలి వెళ్లినట్లు ఆయనకు సమాచారం ఇచ్చినట్టు చెప్పారు. శ్రీశైలం వెళ్ళిన ఆయన ఇంటికి వెళ్లాక ఇప్పుడిచ్చిన వాహనం పరిస్థితి ఎలా ఉందో తెలుసుకుంటానని పేర్కొన్నారు. తనకు కొత్త కారే కావాలని ఏమీ లేదన్న రాజాసింగ్  మంచి కండిషన్‌లో ఉన్న వాహనం అయితే చాలని స్పష్టం చేశారు.