సీఎం కేసీఆర్పై సుప్రీం కోర్టు అసంతృప్తి

ఫాం హౌస్ కేసులో సీఎం కేసీఆర్ వ్యవహరించిన తీరు పట్ల సుప్రీంకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. తెలంగాణ సీఎం అనుసరించిన పద్ధతి సరికాదని సుప్రీంకోర్టు సూచించింది. కేసు ఆడియో, వీడియోలను సీఎం ఎలా జడ్జిలకు పంపుతారని ప్రశ్నించింది. ఎమ్మెల్యేల కొనుగోలు కేసు విచారణ సందర్భంగా జస్టిస్ గబాయి ధర్మాసనం వ్యాఖ్యలు చేసింది.

కేసుకు సంబంధించి ఆడియో, వీడియో క్లిప్పులను పంపడంతో న్యాయమూర్తులకు కలిగిన అసౌకర్యానికి తెలంగాణ ప్రభుత్వం తరపున ప్రభుత్వ తరఫు న్యాయవాది దుష్యంత్ దవే సుప్రీంకోర్టుకు క్షమాపణలు తెలిపారు. ఎమ్మెల్యేల కొనుగోలు కేసుకు సంబంధించిన ఆడియో, వీడియోలను సీఎం కేసీఆర్ సుప్రీంకోర్టు న్యాయమూర్తులు సహా దేశవ్యాప్తంగా పలువురు ప్రముఖులకు పంపారు.

సోమవారం కేసు విచారణ సందర్భంగా దీనిపై సుప్రీంకోర్టు ధర్మాసనం అసంతృప్తి వ్యక్తం చేసింది. ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఆడియో, వీడియోలను న్యాయమూర్తులకు ఎలా పంపుతారని జస్టిస్ గవాయ్, జస్టిస్ అరవింద్తో కూడిన ధర్మాసనం ప్రశ్నించింది.

కాగా కేసు వివరాల్లోకి వెళ్తే, ఎమ్మెల్యేలకు ఎర వ్యవహారంపై దర్యాప్తును సీబీఐకి తెలంగాణ హైకోర్టు అప్పగించింది. దీన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును తెలంగాణ ప్రభుత్వం ఆశ్రయించింది. ఈ నెల 17న విచారణ జరిపిన న్యాయస్థానం ప్రభుత్వ తరఫు న్యాయవాది సమయం కోరడంతో కేసును సోమవారం వాయిదా వేసింది.

తాజాగా కేసు విచారణ జరిపిన అత్యున్నత న్యాయస్థానం సీఎం కేసీఆర్ వైఖరిపై అసంతృప్తి వ్యక్తం చేసింది.  సీబీఐ చేతిలోకి కేసు వెళ్తే… ఇప్పటి వరకు చేసిన విచారణ అంతా పక్కదారి పడుతుందని టీఎస్ ప్రభుత్వం తరపున సీనియర్ లాయర్లు సిద్ధార్థ లూత్రా, దుష్యంత్ దవేలు వాదనలు వినిపించారు.

ఈ కేసులో ఆధారాలన్నీ బీజేపీకి వ్యతిరేకంగా ఉన్నాయని, ఈ నేపథ్యంలో కేసును సీబీఐకి ఎలా అప్పగిస్తారని వాదించారు. కేసుపై వాదించేందుకు త‌న‌కు మరింత సమయం కావాలని కోరారు. మరోవైపు కేసులో కీలక ఆధారాలు లీక్ చేశారన్న విషయాన్ని ప్రతివాదుల తరఫు న్యాయవాది కోర్టు దృష్టికి తెచ్చారు. దీనిపై స్పందించిన జస్టిస్ గవాయ్.. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ఆధారాలను మీడియాకే కాదు.. జడ్జీలకు పంపారని పేర్కొన్నారు.