తొలిసారి బుల్లి రాకెట్‌ను పంపిన ఇస్రో

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) శ్రీహరికోట నుంచి ప్రయోగించిన చిన్న ఉపగ్రహ వాహకనౌక ఎస్ఎస్ఎల్‌వీ-డీ2 ప్రయోగం విజయవంతమైంది. శుక్రవారం ఉదయం 9.18గంటలకు ఏపీలోని తిరుపతి జిల్లా సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి నింగిలోకి దూసుకెళ్లింది.
 
ఇవాళ తెల్లవారుజామున 2.48 గంటలకు ప్రయోగానికి సంబంధించిన కౌంట్‌డౌన్ ప్రక్రియ ప్రారంభమవగా, ఉదయం 9.18గంటకు ఎస్‌ఎస్‌ఎల్‌వీ-డీ2 (స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్‌-డీ2) నింగిలోకి దూసుకెళ్లింది.  దీని ద్వారా భారత్‌కు చెందిన రెండు, అమెరికాకు చెందిన మూడు ఉపగ్రహాలను విజయవంతంగా నిర్దేశిత కక్ష్యలోకి పంపింది.
 
మొత్తం 15 నిమిషాల్లో ఈ ప్రయోగం పూర్తయ్యింది. శుక్రవారం తెల్లవారుజామున 2.48 గంటలకు ప్రారంభమైన 6.30 గంటల కౌంట్‌డౌన్‌ అనంతరం నింగిలోకి రాకెట్ దూసుకెళ్లింది. రాకెట్ ప్రయోగానికి ముందురోజు ఇస్రో చైర్మన్‌ ఎస్‌.సోమనాథ్‌ రాకెట్‌ విజయాన్ని ఆకాంక్షిస్తూ సూళ్లూరుపేట చెంగాళమ్మను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఎస్‌ఎస్‌ఎల్వీ-డీ2 నమూనాకు గురువారం ఉదయం తిరుమల శ్రీవారి ఆలయంలో ఇస్రో అధికారులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
 
 ఇస్రోకు చెందిన 156.3కిలోల బరువు కలిగిన ఈవోఎస్-07 ఉపగ్రహంతో పాటు అమెరికా అంటారిస్ సంస్థకు చెందిన 11.5 కిలోల జానుస్-1, చెన్నై స్పేస్ కిడ్జ్ ఇండియా ఆధ్వర్యంలో విద్యార్థులు రూపొందించిన 8.7 కిలోల ఆజాదీశాట్-2ను భూసమీప కక్ష్యలో ప్రవేశపెట్టారు.
 
ఈ ప్రయోగం విజయవంతమైన నేపథ్యంలో  అతి తక్కువ ఖర్చుతో అంతరిక్షంలోకి ఉపగ్రహాలను పంపించిన దేశంగా ఇస్రో సరికొత్త రికార్డు సృష్టించింది. ప్రపంచ అంతరిక్ష వాణిజ్య మార్కెట్ లో భారత్ దూసుకుపోనుంది. తక్కువ ఖర్చుతో ప్రపంచ దేశాలుకు సంబంధించిన చిన్న ఉపగ్రహాలను అంతరిక్షంలోకి ప్రవేశపెట్టిన ఘనత ఇస్రో సాధించింది.  .
 
గతేడాది ఆగస్టు 7న ప్రయోగత్మకంగా నిర్మించి ప్రయోగించిన మొదటి ఎస్ఎస్ఎల్‌వీ రాకెట్ సాంకేతిక సమస్య వలన సరైన కక్షలోనికి ఉపగ్రహాలను ప్రవేశపెట్టలేకపోయింది ఇస్రో.  అయితే, ఆగస్టు 7 నాటి ప్రయోగం విఫలం కావడంతో శాస్త్రవేత్తలు మరో చిన్న రాకెట్‌ను అభివృద్ధి చేసి పలు కీలక పరీక్షలు నిర్వహించి ఎస్‌ఎస్‌ఎల్వీ-డీ 2 రాకెట్‌ను సిద్ధం చేశారు.
 
అడ్వాన్స్ టెక్నాలజీతో ఉన్న ఈ రాకెట్ ద్వారా మనదేశానికి సంబందించిన భూపరిశీలన ఉపగ్రహం ఈవోఎస్‌-02 తోపాటు మరో రెండు చిన్న ఉపగ్రహాలను భూమధ్య రేఖకి 450 కిలోమీటర్లు ఎత్తులోని భూ వృతకార కక్షలోనికి ప్రవేశపెట్టారు. చిన్న శాటిలైట్ లాంచ్ మార్కెట్‌కు అనుగుణంగా కొత్తగా అభివృద్ధి చేసిన స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్‌ (ఎస్ఎస్ఎల్‌వీ)ని ప్రపంచానికి పరిచయం చేసింది ఇస్రో.
 
నింగిలోకి పంపిన భూపరిశీలన ఉపగ్రహం ఈవోఎస్‌-02 బరువు 140 కిలోలు. మారుమూల ప్రాంతాల్లో ఇంటర్నెట్‌ కనెక్టివిటీని అందించడంలో సాయపడేలా దీనిని రూపొందించారు. అలాగే, 75 ప్రభుత్వ పాఠశాలలకు చెందిన 750 మంది విద్యార్థులు రూపొందించిన ఆజాదీశాట్‌‌ బరువు 8 కిలోలు. స్వాతంత్రం వచ్చి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఆజాదీకా అమృత్‌ మహోత్సవాలకు గుర్తుగా దీన్ని రూపొందించారు. ఈ ఉపగ్రహం జీవితకాలం ఆరు నెలలు. ఇందులో రవీంద్రనాథ్‌ ఠాగూర్‌ పాడిన జాతీయ గీతం రికార్డ్‌ వెర్షన్‌ను పొందుపర్చారు.