3.5 కి.మీ మేర కోతకు గురైన విశాఖ తీరం

ఆంధ్రప్రదేశ్ లో సముద్ర తీరం 29 శాతం మేర కోతకు గురవుతోందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు రాజ్యసభలో ప్రశ్నోత్తరాల సమయంలో అడిగిన ప్రశ్నకు కేంద్ర భూ విజ్ఞాన శాఖ మంత్రి డా. జితేంద్ర సింగ్ ఇచ్చిన సమాధానంలో  తెలిపారు. ముఖ్యంగా విశాఖపట్నంలో 15.42 కి.మీ పొడవైన తీరం ఇప్పటివరకు 3.5 కి.మీ మేర కోతకు గురైందని వెల్లడించారు.
 
నేషనల్ సెంటర్ ఫర్ కోస్టల్ రీసెర్చ్ (ఎన్సీసీఆర్) అధ్యయనంలో కోతకు గురవుతున్న తీర ప్రాంతం గురించి భయానక వాస్తవాలు వెలుగులోకొచ్చాయని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ లో 294.89 కిలోమీటర్లు అంటే 28.7 శాతం తీరప్రాంతం వివిధ స్థాయిల్లో కోతకు గురైందని వెల్లడించారు.  అత్యధికంగా తూర్పుగోదావరిలో (89.25 కి.మీ), ఆ తరువాత కృష్ణ జిల్లా (57.55 కి.మీ), నెల్లూరు (53.32 కి.మీ), విశాఖపట్నం (25.81 కి.మీ), శ్రీకాకుళం (25.12 కి.మీ) మేర తీరం కోతకు గురయ్యిందని కేంద్రమంత్రి తెలియజేశారు.

తీరం కోతకు గురవడానికి తలెత్తుతున్న పరిస్థితులు, కారణాల గురించి వివరిస్తూ.. ఉష్ణమండల తుఫానులు, రుతుపవనాల కారణంగా తలెత్తే వరదలు, సముద్ర మట్టం పెరుగుదల తదితర ప్రకృతి సహజ వైపరీత్యాలకు తోడు ఓడరేవులు, నౌకాశ్రయాల నిర్మాణాలు, నదులు దెబ్బతినడం వంటివి కూడా కోతకు కారణమవుతున్నాయని కేంద్ర మంత్రి వివరించారు.

కోత కారణంగా భూమి, ఆవాసాలు, మత్స్యకారులు జీవనోపాధి దెబ్బతినడంతో పాటు ఫిషింగ్ కార్యకలాపాలకు అవసరమైన స్థలం తగ్గిపోతుందని చెప్పారు. విశాఖ నగరంలో మూడు దశాబ్దాలుగా కోతను ఎదుర్కొంటోందని, ప్రతికూల పరిస్థితుల్లో సుమారు 3.5 కిలోమీటర్ల పర్యాటక బీచ్, తీరప్రాంత రహదారులు కోతకు గురై క్షీణించాయని వివరించారు.

తీరం కోతను నివారించేందుకు పటిష్టమైన కార్యాచరణను రూపొందించి, విశాఖ నుంచే దాన్ని అమలు చేయడం మొదలు పెట్టాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరతానని అనంతరం జివిఎల్ మీడియాకు తెలిపారు. విశాఖ వంటి సుందర పర్యాటక నగరంలో తీర ప్రాంతం కోతకు గురవడం సామాన్య విషయం కాదని ఆందోళన వ్యక్తం చేశారు.

నగరవాసుల్లో కూడా ఈ విషయంపై పూర్తి అవగాహన కలిగించాల్సిన అవసరం ఉందని చెప్పారు. త్వరలో విశాఖలో ఈ విషయంపై వివిధ వర్గాల ప్రముఖులతో  ఒక అవగాహనా సదస్సు నిర్వహించనున్నట్టు ఆయన వెల్లడించారు.