ఇది ప్ర‌జ‌ల‌ను మోసం చేసే బ‌డ్జెట్

తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ మొత్తం అంకెల గారడీయేనని, ప్రజలను మోసం చేసే బడ్జెట్ తీసుకువచ్చారని బిజెపి ఎమ్మెల్యే ఈట‌ల రాజేంద‌ర్ ధ్వజమెత్తారు. సోమవారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఆయన మాట్లాడుతూ బడ్జెట్ లో కేటాయించిన నిధులలో 70 – 80 % నిధులు విడుదల కావని స్పష్టం చేశారు. బడ్జెట్ లో చాలా శాఖలకు కోతలు పెట్టారని ఆరోపించారు.
 
మధ్యాహ్నం భోజనం వండే వారికి వెయ్యి రూపాయలు ఇస్తున్నారని, అది కూడా రెండేళ్లకోసారి ఇస్తున్నారని విమర్శించారు. అంగన్వాడీలకు డబ్బు సరిగా ఇవ్వకపోవడంతో ముక్కిపోయిన ఆహారం అందుతుందని తెలిపారు. గురుకులలో సరైన వసతులు లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. మన ఊరు – మనబడి కేవలం చెప్పడానికే రంగురంగులుగా కనిపిస్తుంది అని పేర్కొన్నారు.

2023-24 ఆర్ధిక సంవత్సరానికి గాను రాష్ట్ర వార్షిక బడ్జెట్ ను ఆర్ధిక మంత్రి తన్నీరు హరీశ్ రావు ప్రవేశపెట్టారు. రూ. 2,90,396 కోట్ల వ్యయాన్ని ప్రతిపాదిస్తూ ఈ ఉదయం శాసనసభలో బడ్జెట్ ను ప్రవేశ పెట్టారు.  నాలుగేళ్లు పూర్తి కావొస్తున్నా రైతాంగానికి రుణమాఫీ చేయలేదని ఈటెల విమర్శించారు. రైతులు పూర్తిగా రుణమాఫీ చేయాలని కోరుతున్నారని ప్రభుత్వం ఆ దిశగా ఆలోచ‌న చేయ‌డం లేద‌ని మండిప‌డ్డారు.

స‌రుకు, సంగ‌తి లేని డ‌బ్బా బ‌డ్జెట్

కాగా, ఆర్థికమంత్రి హరీశ్ రావు ప్రవేశపెట్టిన బ‌డ్జెట్ లో స‌రుకు,సంగ‌తి లేని డ‌బ్బా బ‌డ్జెట్ అంటూ తెలంగాణ బిజెపి అధ్య‌క్షుడు బండి సంజ‌య్ విమర్శించారు. ఈ బడ్జెట్ గందరగోళంగా ఉందని, ప్రజాస్పందన కరవైన బడ్జెట్ అని ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి కెసిఆర్ మాటల్లో చెప్పాలంటే సరుకు లేదు, సంగతి లేదు. సబ్జెక్టు లేదు, ఆబ్జెక్టు లేదు. శుష్కప్రియాలు, శూన్యహస్తాలు అని బండి సంజయ్ ఎద్దేవా చేశారు. అంతా వట్టిదే, డబ్బా బడ్జెట్, బభ్రాజమానం భజగోవిందం అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.